పెత్తనం కుదరదు | KCR Object Law and Order under control of Governor in GHMC | Sakshi
Sakshi News home page

పెత్తనం కుదరదు

Aug 9 2014 2:01 AM | Updated on Aug 15 2018 9:22 PM

ఉమ్మడి రాజధాని పరిధిలో గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పించాలంటూ కేంద్రం తాజాగా పంపిన లేఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రంగా స్పందించారు.

* కేంద్రంపై కేసీఆర్ ఫైర్
* మోడీ ఫాసిస్టు చర్యలను ఖండిస్తున్నట్లు వ్యాఖ్యలు
* ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరిక
 
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధాని పరిధిలో గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పించాలంటూ కేంద్రం తాజాగా పంపిన లేఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఇచ్చిన ఈ ఆదేశాలను అమలు చేయబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయాలని సీఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వ అధికారాలను కబళించడానికి ప్రయత్నిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఫాసిస్టు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ కూడా లేఖ రాయాలని ప్రధాన కార్యదర్శికి సూచించారు. కేంద్రం నుంచి వచ్చిన లేఖను అన్ని రాష్ట్రాల సీఎంలకు పంపించాలని, త్వరలోనే సీఎంల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వివరించాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు ధోరణిని ప్రతిఘటించేందుకు ప్రజాస్వామ్య ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. కేంద్రం పంపిన లేఖలోని అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక అంశాలను అమలు చేయమని ప్రకటించారు. ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను గవర్నర్‌కు కల్పించాలని, అందుకు అవసరమైన విధంగా తెలంగాణ ప్రభుత్వం బిజినెస్ రూల్స్‌లో మార్పులు చేసుకోవాలని గత నెలలోనే కేంద్ర హోం శాఖ నుంచి లేఖ వచ్చిన సంగతి తెలిసిందే.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉమ్మడి పోలీసింగ్ వ్యవస్థను అమలు చేయాలని, ఇరు రాష్ట్రాల డీజీపీలతో కమిటీ వేయడంతోపాటు, నగరంలో పోలీసు అధికారుల నియామకానికి సంబంధించి ఇరు రాష్ట్రాల వారిని పరిగణించాలని అందులో సూచించింది. దీనికి రాష్ర్ట ప్రభుత్వం కూడా ఘాటుగానే బదులిచ్చింది.

రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 8లో ఉన్న ప్రకారం నడచుకుంటామే తప్ప.. గవర్నర్‌కు అధికారాలు కల్పించేలా బిజినెస్ రూల్స్‌ను మార్చబోమని తేల్చి చెప్పింది. ఇదంతా జరిగిన  నెల రోజుల తర్వాత కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేశ్‌కుమార్ పేరిట శుక్రవారం రాత్రి మరో లేఖ రాష్ర్ట ప్రభుత్వానికి అందింది. అయితే ఇందులో ఇరు రాష్ట్రాల పోలీసుల అధికారులను నియమించాలన్న నిబంధనను తొలగించారు.

Advertisement
 
Advertisement
Advertisement