న‘గరం..గరంగా..’ | Karimnagar Municipal Corporation | Sakshi
Sakshi News home page

న‘గరం..గరంగా..’

Mar 8 2015 2:17 AM | Updated on Sep 2 2017 10:28 PM

కరీంనగర్ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. పారిశుధ్య, టౌన్‌ప్లానింగ్, వీధి దీపాల అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఎజెండాలో పొందుపరిచిన 45 అంశాలతోపాటు టేబుల్ ఎజెండాలో నాలుగు అంశాలకు ఆమోదముద్ర వేశారు.

 టవర్‌సర్కిల్ : కరీంనగర్ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. పారిశుధ్య, టౌన్‌ప్లానింగ్, వీధి దీపాల అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఎజెండాలో పొందుపరిచిన 45 అంశాలతోపాటు టేబుల్ ఎజెండాలో నాలుగు అంశాలకు ఆమోదముద్ర వేశారు. నగరపాలక సర్వసభ్య సమావేశం మేయర్ రవీందర్‌సింగ్ అధ్యక్షతన శనివారం కార్పొరేషన్ సమావేశ మందిరంలో నిర్వహించారు. సభ ప్రారంభం కాగానే 7వ డివిజన్ కార్పొరేటర్ లింగంపల్లి శ్రీనివాస్ శానిటేషన్‌కు ఎలాంటి పొడిగింపులు లేకుండా టెండర్లు నిర్వహించాలని కోరారు. ఎజెండాలో మొదటి అంశంపై కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, ఎడ్ల సరిత మాట్లాడుతూ.. నగరంలో వ్యవసాయ భూములను కమర్షియల్‌గా మార్చాలని పలు దరఖాస్తులు చే సినా.. ఒకే స్థలాన్ని ఎజెండాలో చేర్చడంపై ప్రశ్నించగా, రానున్న కౌన్సిల్‌లో మిగతావి పెడతామని మేయర్ తెలిపారు.
 
 నగరంలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టడం లేదని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గందె మాధవి అధికారులపై ఆగ్రహించారు. అక్రమ నిర్మాణాలపై తీసుకున్న చర్యలు తెలపాలని కోరారు. ఏసీపీ ఫోన్‌లో సమాధానం ఇవ్వడం లేదని పరిచయం చేయూలని  42వ డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కోర్టు నుంచి వావిలాలపల్లి రోడ్డ్‌లో ఉన్న రెండు ఫంక్షన్‌హాల్స్‌కు పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో శుభకార్యాల సమయంలో రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందని 47వ డివిజన్ కార్పొరేటర్ బండారి వేణు తెలిపారు. హౌసింగ్‌బోర్డు ఎంట్రన్స్ రోడ్డును మాస్టర్‌ప్లాన్ ప్రకారం తీయాలని 21వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల ప్రకాశ్ కోరారు. 20వ డివిజన్‌లో 19 మందికి పింఛన్‌లు రెండుసార్లు వచ్చాయని, వాటిని అర్హులకు ఇవ్వాలని కార్పొరేటర్ నేతికుంట కళావతి కోరారు.  
 
 ఒక్క రూపాయి నల్లాకు ఆమోదం...
 నగరంలో ప్రవేశపెట్టిన ఒక్క రూపాయి నల్లా కనెక్షన్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పైపులు కొనుగోలుకు కేటారుుంచిన రూ.25 లక్షల నిధులకు ఆమోదం ముద్ర వేశారు.
 
 శానిటేషన్ వర్కర్ల పెంపు
 నగరపాలక సంస్థలో శానిటేషన్ వర్కర్లు, రిక్షాలు సరిపోవడం లేదని, వర్కర్ల సంఖ్యను పెంచి, మరో రెండు నెలలు పొడిగించి అయినా సరే టెండర్లు నిర్వహించాలని కార్పొరేటర్లు కోరారు. టెండర్లు ఆపడం మన పరిధిలో లేదని, అవసరమైతే వెంటనే 200 మంది వర్కర్ల కోసం మరో టెండర్ నిర్వహిస్తామని, రిక్షాలు కొనుగోలు చేస్తామని మేయర్ తెలిపారు. ప్రభుత్వం నుంచి 17 ట్రాక్టర్లు వస్తాయని వివరించారు.
 
 అధికారుల వాకౌట్..
 మేయర్ సముదాయింపు...
 అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే సదరు యజమానులు వచ్చి కలవగానే(ముడుపులు ఇవ్వగానే) టౌన్‌ప్లానింగ్ అధికారులు వదిలేస్తున్నారని 29వ డివిజన్ కార్పొరేటర్ ఉమాపతి ఆరోపించారు. అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తే పనులెలా చేస్తారని, వెంటనే క్షమాపణ చెప్పాలని కార్పొరేటర్లు వై.సునీల్‌రావు, ఆరిఫ్, నలువాల రవీందర్, పెద్దపల్లి రవీందర్ వాగ్వాదానికి దిగారు. తమ పట్ల కార్పొరేటర్లు దురుసుగా ప్రవర్తించడంతో అధికారులు వాకౌట్ చేసేందకు ప్రయత్నించగా మేయర్ కలుగజేసుకుని ఆపారు.  
 
 పరాయిలుగా చూడకండి : కమిషనర్
 అధికారులు, పాలకవర్గం అందరం ఒక కుటుంబం. మమ్మల్ని పరాయిలుగా చూడకండి. నొప్పించకుండా ఉంటే  సేవకులుగా పనిచేస్తామని కమిషనర్ రమణాచారి తెలిపారు. కార్పొరేషన్‌లో సిబ్బంది కొరత ఉండడంతోనే పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. 69 అత్యవసర పోస్టులు అవసరమున్నాయని తెలిపారు. టౌన్ ప్లానింగ్‌లో సిబ్బంది అంతా డిప్యూటేషన్‌లపైనే ఉండడంతో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. సమావేశంలో అన్ని విభాగాల అధికారులు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement