తెలంగాణ సాగునీటి కల సాకారం

Kaleshwaram Project: CM KCR Launches Markook Pump House - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారతదేశంలోనే అత్యధికంగా వరిని పండించే రాష్ట్రంగా తెలంగాణ నేడు రికార్డులకు కెక్కించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి కోసం కొట్లాడిన ప్రాంతం నేడు జలకళతో సస్యశ్యామలమైంది. నిధులు.. నీళ్లు.. ఉద్యోగాలే ఏజెండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు నీటికోసం భగీరథ ప్రయత్నం చేశారు. కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎన్నో ఇంజనీరింగ్ కంపెనీలు ముందుకొచ్చినా ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించింది మాత్రం మేఘా (MEIL).  ఈ కంపెనీ రికార్డు స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసింది. కాళేశ్వరం బహుళ ఎత్తిపోతల పథకంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ నిర్మించిన కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని కేసీఆర్‌ శుక్రవారం ప్రారంభించారు. దీని ద్వారా 3763  మెగావాట్ల  పంపింగ్ సామర్థ్యం వినియోగంలోకి వచ్చింది.

పుష్కలంగా గోదావరి జలాలు..
ఒకప్పుడు నీటిగోసను అనుభవించిన తెలంగాణ నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మారింది. ముఖ్యమంత్రి ఆలోచనకు తోడు ఎంఈఐఎల్‌ అహోరాత్రుల కృషి ఫలితంగానే  ఇది సాధ్యపడింది. నీటి ప్రాజెక్టులు కట్టాలంటే దశబ్దాలు పడుతాయన్న అపఖ్యాతిని దూరంచేసేలా మేఘా కంపెనీ మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం విశేషం.  ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకంలో అత్యధిక పంపింగ్‌ కేంద్రాలను పూర్తిచేసి తన ఇంజనీరింగ్‌ శక్తిసామర్థ్యాలు, నైపుణాన్ని చాటుకుంది. కేవలం నాలుగేళ్ళ సమయంలో దాదాపు నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్‌హౌస్‌లను నిర్మించడమే కాకుండా వాటిని పంపింగ్‌ ద్వారా వినియోగంలోకి(ఆపరేషన్, మెయిన్‌టెనెన్స్‌) తీసుకొచ్చింది.

రికార్డు స్థాయిలో పూర్తి..
మేఘా సంస్థ దీనిని ఓ నీటి ప్రాజెక్టుగా కాకుండా తమకు దక్కిన గౌరవంగా భావించి ఓ సవాల్‌గా తీసుకొని పూర్తి చేసింది. కేవలం నాలుగేళ్లలో ప్రపంచంలోని అతి భారీనీటి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసింది. ముఖ్యమంత్రి పట్టుదలకు తోడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎలక్ట్రోమెకానికల్‌ ఇంజనీరింగ్‌ సంస్థలు బీహెచ్‌ఈఎల్, ఆండ్రిజ్, జైలం, ఏబిబి, క్రాంప్టన్‌ గ్రేవ్స్, వెగ్‌ లాంటి సంస్థలు ఇందులో భాగస్వామ్యం పంచుకున్నాయి.  ప్రపంచంలో తొలిసారిగా ఇక్కడ భారీస్థాయిలో బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని నాలుగేళ్ళ క్రితం ప్రభుత్వం ప్రారంభించింది. పనులు ప్రారంభించిన మూడేళ్ళలోనే లింక్‌1, లింక్‌2లో ఎత్తిపోతల కేంద్రాలు వినియోగంలోకి వచ్చాయి.

ఇంజనీరింగ్ చరిత్రలో అద్భుతం కాళేశ్వరం..
ప్రపంచ ఇంజనీరింగ్ చరిత్రలోనే మేఘా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతంగా నిలిచింది. తాజాగా ప్యాకేజ్‌14లోని పంప్‌హౌస్‌ను వినియోగంలోకి తేవడం ద్వారా 3,763మెగావాట్ల  పంపింగ్‌ సామర్థ్యం వినియోగంలోకి రానుంది. నీటి పారుదల రంగంలో దాదాపు 618 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్‌ చేసేలా భారీ ఎత్తిపోతల పథకం పూర్తి చేసుకుంది. సాగునీటి అవసరాల కోసం ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికాలోని కొలరాడోలో మాత్రమే భారీ ఎత్తిపోతల పథకం ఉంది. ఆ తర్వాత లిబియాలోని  గ్రేట్‌ మ్యాన్‌మేడ్‌ రివర్‌ రూపుదిద్దుకుంది. ఇంజనీరింగ్‌ నిపుణులు సైతం నివ్వేరపోయేలా రికార్డు సమయంలో కాళేశ్వరం పనులు పూర్తయ్యాయి. 

భూగర్భంలో కొత్త లోకం 
మొత్తం పంపింగ్‌ కేంద్రాల్లో అత్యధిక భాగం భూగర్భంలో నిర్మించినవే. అత్యధిక సామర్థ్యం కలిగిన పంపింగ్‌ కేంద్రాలు భూగర్భంలోనివే. ఇందులో మేఘా ఇంజనీరింగ్‌ నిర్మించిన గాయత్రి (ప్యాకేజ్‌8), అన్నపూర్ణ (ప్యాకేజ్‌10), రంగనాయక సాగర్‌ (ప్యాకేజ్‌11), మల్లన్నసాగర్ (ప్యాకేజ్‌12) భూగర్భంలో నిర్మించినవే. ప్రధానంగా గాయత్రి పంప్‌హౌస్‌ నిర్మాణం కోసం భూగర్భంలో 2.3ఘనపు మీటర్ల మట్టిని తొలిసి బయటకు తీసింది. ఈ పంపింగ్‌ కేంద్రం వైశాల్యం 84753.2 చదరపు అడుగులు. దీనికి సంబంధించిన సర్జ్‌పూల్, అదనపు సర్జ్‌పూల్స్‌ కూడా ప్రపంచంలోనే పెద్దవి. గోదావరిని దిగువ నుంచి ఎగువకు తిరుగు ప్రయాణం చేసే విధంగా పంపింగ్‌ చేయడం కోసం 1120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు పంప్‌హౌస్‌లను 28మిషన్‌లతో ఏర్పాటు చేశారు. అవి లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) పంపింగ్‌ కేంద్రాలు. వీటిన్నింటిని భూగర్భంలో నిర్మించి సరికొత్త ఆ ప్రాంతంలో సరికొత్త లోకాన్ని సృష్టించింది. 

భూగర్భంలో గాయత్రి నిర్మాణం.. 
ఆ తర్వాత ప్యాకేజ్‌8 పంపింగ్‌ కేంద్రం గాయత్రి. భూగర్భంలో మేఘా నిర్మించిన ఒక్కో పంపింగ్ కేంద్రం ఒక్కో అద్భుతాన్ని సృష్టించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 2టిఎంసీల నీటి పంపింగ్‌కుగాను మొత్తం 4680 మెగావాట్ల పంపింగ్‌ సామర్థ్యం కలిగిన కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా అందులో ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేస్తున్న 89మిషన్లు 3840 మెగావాట్ల సామర్థ్యం కలిగినవి మేఘానే ఏర్పాటు చేస్తోంది. 

మేఘాకు దక్కిన గౌరవం
ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పాలుపంచుకోవడం మేఘా ఇంజనీరింగ్‌ అదృష్టమని మేఘా సంస్థ ప్రతినిధి బీ.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రపంచంలో అత్యుత్తమ ఇంజినీరింగ్‌ సంస్థతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం తమకు దక్కిన జీవితకాల గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో చర్చించి ప్రోత్సహించడం వల్లనే త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని బీ.శీనివాస్‌ రెడ్డి  తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top