‘ప్రొఫెసర్ల’ బాధ్యత వర్సిటీలకే

Kadiyam Srihari says professor responsibilities on university - Sakshi

నియామకాలపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి

సాక్షి, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాల బాధ్యత యూనివర్సిటీలకే అప్పగించామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో 1,550 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటి భర్తీకి సంబంధించి వేసిన కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో నియామకాలపై స్పష్టత ఇచ్చామని పేర్కొన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌    సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రూ.6.22 కోట్లతో నిర్మించిన పరీక్షల భవనానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.

గత ప్రభుత్వాలు విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని, విద్యారంగాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది రూ.420 కోట్లు కేటాయించిందని, ఇందులో రూ.20 కోట్లు అంబేడ్కర్‌ యూనివర్సిటీకి ఇచ్చిందని గుర్తు చేశారు. వర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్, అసోసియేట్‌ ప్రొఫెసర్ల వేతనాలు పేంచేందుకు వీసీల కమిటీ ఆమోదం తెలిపిందని, త్వరలో పెంపు అమల్లోకి వస్తుందని వెల్లడించారు.

కోర్టు తీర్పునకు లోబడే టీఆర్‌టీ
ఎందరో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ)ను కోర్టు తీర్పునకు అనుగుణంగా చేపడతామని కడియం స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును సమీక్షిస్తున్నామని, త్వరలో పది జిల్లాల ఆధారంగానే టీఆర్‌టీ నిర్వహించి నియామకాలు పూర్తి చేస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు అవకాశాలు కల్పించే క్రమంలోనే 31 జిల్లాల వారీగా నోటిఫికేషన్‌ ఇచ్చామని తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top