
'రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రోత్సహిస్తా?'
ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీఎల్పీ నేత కె. జానారెడ్డి తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీఎల్పీ నేత కె. జానారెడ్డి తీవ్రంగా ఖండించారు. తన తరువాత.. తమ పార్టీ నేతను వారసుడిగా ఎన్నుకుంటాం కానీ... మరో పార్టీ నేతను ఎలా వారసుడిగా ప్రకటిస్తామని ఆయన ప్రశ్నించారు. మంగళవారం జానారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చర్యలు మాదిరిగానే ఆయన తనపై చేసిన వ్యాఖ్యలు కూడా అనాలోచితంగా ఉన్నాయన్నారు.
తాను రిటైరయితే కాంగ్రెస్ నేతలను ప్రమోట్ చేస్తానే కానీ, రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రోత్సహిస్తానని జానారెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్, టీడీపీ పార్టీలు ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నాయని, రాజకీయాలు కలుషితమయ్యాయని ఆయన అన్నారు. ఈ అనూహ్య పరిణామాలు తనకు మనస్తాపం కలిగించాయని, రాజకీయంగా కొనసాగి ఈ పరిస్థితులపై పోరాడాలా లేక విశ్రాంతి తీసుకోవాలా అని ఆలోచిస్తున్నానని జానారెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత తెలంగాణ సీఎం కేసీఆర్దేనన్నారు. కేసీఆర్ పాలన ఆశించిన విధంగా లేదంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారని జానారెడ్డి వ్యాఖ్యానించారు.