గొత్తి కోయల్ని తరలించొద్దు | Sakshi
Sakshi News home page

గొత్తి కోయల్ని తరలించొద్దు

Published Tue, Oct 17 2017 1:53 AM

Interim orders of the High Court instructing the state government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం జలగలంచ గ్రామంలో నివసిస్తున్న గొత్తి కోయలను అక్కడి నుంచి ఖాళీ చేయించవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. గొత్తి కోయల జీవన విధానా నికి ఇబ్బందులు కల్పించరాదని, వెంటనే వారికి తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశిస్తూ మధ్యం తర ఉత్తర్వులు జారీ చేసింది. అడవుల్లో నివాసం ఉండేందుకు ఆదివాసీలకు చట్టం వెసులుబాటు కల్పిస్తోందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది. షెడ్యూల్‌ ట్రైబ్స్‌ అండ్‌ అదర్‌ ట్రెడిషనల్‌ ఫారెస్ట్‌ డ్వెల్లర్స్‌ యాక్ట్‌–2006 ప్రకారం ఆదివాసీలు అడవుల్లో నివాసం ఏర్పాటు చేసుకునేందుకు హక్కు ఉందని స్పష్టం చేసింది.

18 ఏళ్లుగా అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్న గొత్తి కోయల ఇళ్లను కూల్చివేయడాన్ని తప్పుపడుతూ హైదరాబాద్‌లోని అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్, పౌరహక్కుల కమిటీ సహాయ కార్యదర్శి డాక్టర్‌ గుంటి రవీందర్‌ దాఖలు చేసిన ప్రజాప్రయో జన వ్యాజ్యాన్ని సోమవారం ధర్మాసనం విచారిం చింది. గొత్తి కోయల నివాసం వల్ల అరుదైన పశుపక్ష్యాదులు కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నా కూడా.. చట్ట ప్రకారం ముందుగా వారికి నోటీసులు ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతివాదులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి, సీఎఫ్‌ఓ, కేంద్ర గిరిజన శాఖ కార్యదర్శి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్‌ఓ, ఫారెస్ట్‌ రేంజర్‌లతోపాటు వ్యక్తిగత ప్రతివా దులుగా ఉన్న అటవీ అధికారులు శిరీష, జోగీందర్‌ల కు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో తమ వాదనలతో కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

ఇళ్లు కూల్చి.. బోరుపీకేసి..: గత నెల 16న పస్రా ఫారెస్ట్‌ రేంజి ఆఫీసర్‌ శిరీష, తాడ్వాయి ఫారెస్ట్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ జోగీందర్‌ సారథ్యంలో రెండు వందల మంది అటవీ అధికారులు ఒక్కసారిగా జేసీబీలు, ట్రాక్టర్లు, బుల్‌డోజర్లతో వచ్చి గొత్తి కోయలకు చెందిన 36 ఇళ్లను కూల్చేశారని, తాగునీటికి ఉన్న ఒకే ఒక బోరును కూడా పీకివేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది రఘునాథ్‌ వాదిం చారు. సుమారు 30 మంది ఆదివాసీల పిల్లలు చదువుకునే పాఠశాలనూ ధ్వంసం చేశారని, పంటల్ని నాశనం చేశారని ఆరోపించారు. ఆఖరికి గర్భవతులని కూడా చూడకుండా కొట్టారని, చాలా మందిని చెట్లకు కట్టివేశారని వివరించారు. 18 ఏళ్లుగా అడవి తల్లినే నమ్ముకున్న గొత్తి కోయలకు కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులు దాడి చేశారన్నారు.

వన్య ప్రాణులకు ముప్పు..: గొత్తి కోయలు పోడు వ్యవసాయం చేయడం వల్ల వన్య ప్రాణులకు ముప్పు ఏర్పడుతోందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ జె.రామచంద్ర రావు వాదించారు. పోడు వ్యవసాయం పేరిట వృక్షాలను కొట్టేస్తున్నారని చెప్పారు. మానవీయ కోణంలో వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా తరలి వెళ్లేందుకు ముందుకు రావడం లేదని వివరించారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోలకు, సల్వాజుడుం కార్యకర్తలకు మధ్య ఘర్షణల నేపథ్యంలో అక్కడి నుంచి తప్పించుకుని తాడ్వాయి మండలం జలగలంచ ప్రాంతానికి వలస వచ్చారని చెప్పారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement