సీసీఎస్‌లో ఐదుగురిపై వేటు | in ccs five police persons dropped | Sakshi
Sakshi News home page

సీసీఎస్‌లో ఐదుగురిపై వేటు

Apr 23 2015 3:57 AM | Updated on Aug 21 2018 7:58 PM

రాజధానిలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)లో అక్రమాలను వెలుగులోకి తెస్తూ .....

సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)లో అక్రమాలను వెలుగులోకి తెస్తూ ‘సాక్షి’లో వచ్చిన కథనాలపై నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. అవినీతికి పాల్పడిన సీసీఎస్‌లోని ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సస్పెండైన వారిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్, హెడ్‌కానిస్టేబుల్ ఉన్నారు. సీసీఎస్‌కు చెందిన ఆటో మొబైల్ టీం(ఏటీఎం) ఇన్‌స్పెక్టర్ తుమ్మపూడి శ్రీనివాస ఆంజనేయప్రసాద్, సబ్‌ఇన్‌స్పెక్టర్ జి.శ్రీనివాస్, అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆర్.ఎం.గురునాథుడు, హెడ్‌కానిస్టేబుల్ ఎ.మోహన్‌లతో పాటు సీసీఎస్ వైట్ కాలర్ అఫెన్స్ టీం ఇన్‌స్పెక్టర్ మధుమోహన్ అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలింది.

విచారణాధికారులు బుధవారం సాయంత్రం కమిషనర్ మహేందర్‌రెడ్డికి నివేదిక సమర్పించారు. దీంతో వారిపై ఆయన సస్పెన్షన్ వేటు వేశారు. నెల రోజుల క్రితమే ఇన్‌కమ్‌ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌ను బెదిరించి అతని ఆస్తులను బలవంతంగా మరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించిన వ్యవహారంలో ఇదే సీసీఎస్‌లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ను కూడా కమిషనర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు రికవరీ చేసిన వాహనాల మాయంపై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాలపై ఆయన స్పం దించారు. 60 ఠాణాల పరిధిలో రికవరీ  వాహనాలపై ఆరా తీయడంతో పలువురు పోలీసులు అక్రమంగా వాడుతున్న 140 వాహనాలు తిరిగి ఠాణాలకు చేరుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement