ఐఏఎస్, ఐపీఎస్ లకు పదోన్నతులు | IAS IPS promotions | Sakshi
Sakshi News home page

ఐఏఎస్, ఐపీఎస్ లకు పదోన్నతులు

Feb 27 2016 3:33 AM | Updated on Sep 3 2017 6:29 PM

రాష్ట్రంలో అఖిల భారత సర్వీసుకు చెందిన 31 మంది అధికారులకు పదోన్నతులు లభించాయి.

మొత్తం 31 మందికి ప్రమోషన్లు
ముఖ్య కార్యదర్శులుగా ఐదుగురు ఐఏఎస్‌లకు అవకాశం
అదనపు డీజీలుగా ఇద్దరు, ఐజీలుగా ఐదుగురు ఐపీఎస్‌లు

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అఖిల భారత సర్వీసుకు చెందిన 31 మంది అధికారులకు పదోన్నతులు లభించాయి. పదోన్నతుల కమిటీ (డీపీసీ) రూపొందించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేయడంతో శుక్రవారం సాధారణ పరిపాలన శాఖ ఈ ఉత్తర్వులు వెలువరించింది. పదోన్నతి లభించిన వారిలో ఐఏఎస్‌లు 13 మంది, ఐపీఎస్‌లు 12 మంది, ఐఎఫ్‌ఎస్‌లు ఆరుగురు ఉన్నారు. ఐఏఎస్‌లకు సంబంధించి 1991 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు అధికారులకు కార్యదర్శి నుంచి ముఖ్య కార్యద ర్శి హోదా లభించింది.

వీరిలో రజత్ కుమార్ (పౌరసరఫరాలశాఖ కమిషనర్), కె.రామకృష్ణారావు (ఆర్థికశాఖ కార్యదర్శి), హర్‌ప్రీత్‌సింగ్ (కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి), జి.అశోక్‌కుమార్‌లకు చోటు దక్కింది. ప్రస్తుతం వెయింటింగ్‌లో ఉన్న జి.అశోక్ కుమార్‌కు గృహనిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. 1990 బ్యాచ్‌కు చెందిన శేషాద్రి, సయ్యద్ అలీ, ముర్తజ రిజ్వీలకు సూపర్ టైమ్‌స్కేల్‌ను వర్తింపజేశారు. వీరితో పాటు 2000 బ్యాచ్‌కు చెందిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జగన్‌మోహన్, రాహుల్‌బొజ్జా, దినకర్‌బాబులకు కూడా సూపర్‌టైం స్కేల్ వర్తింపచేశారు. 2003 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులైన యోగితా రాణా, లోకేశ్ కుమార్, సత్యనారాయణరెడ్డిలకు స్పెషల్ గ్రేడ్ స్కేల్ ఇచ్చారు.

 అదనపు డీజీలుగా సీవీ ఆనంద్, రాజీవ్త్రన్
ప్రస్తుతం ఐజీలుగా ఉన్న 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ (సైబరాబాద్ కమిషనర్), రాజీవ్ రతన్ (అగ్నిమాపకశాఖ డీజీ)లకు అదనపు డెరైక్టర్ జనరల్‌గా పదోన్నతి కల్పించారు. అలాగే 1998 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐపీఎస్‌లకు డీఐజీల నుంచి ఐజీలుగా పదోన్నతి లభించింది. వీరిలో విక్రం సింగ్‌మాన్, ఆర్.బి.నాయక్, బి.మల్లారెడ్డి, టి.మురళీకృష్ణ, ఎం.శివప్రసాద్‌లు ఉన్నారు. 2002 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు రాజేశ్ కుమార్, శివశంకర్‌రెడ్డిలకు డీఐజీ హోదా లభించింది. 2003 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌లు షానవాజ్ ఖాసిం, ఎ.సత్యనారాయణ, డా.వి.రవీందర్‌లకు సీనియర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పించారు. అలాగే ఆరుగురు ఐఎఫ్‌ఎస్‌లకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌గా పదోన్నతి లభించింది. వీరిలో 1982 బ్యాచ్‌కు చెందిన డీకే పాండే, కేసీ శ్రీవాసుకి, చందన్ మిత్రా, పి.మధుసూదన్‌రావు, 1983 బ్యాచ్‌కు చెందిన ఏకే జైన్, ప్రశాంత్‌కుమార్ ఝాలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement