ర్యాలీలు బంద్‌

Hyderabad Police Ready to Counting - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో గురువారం నగరంలో నిషేధాజ్ఞలు విధించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ విధిస్తూ సీపీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకూడదు. విజయోత్సవ ర్యాలీలను పూర్తిగా నిషేధించారు. మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 6గంటల నుంచి శుక్రవారం ఉదయం 6గంటల వరకు ఇవి అమల్లో ఉంటాయి. కల్లు దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లతో పాటు మిలటరీ క్యాంటీన్లు, స్టార్‌ హోటళ్లలోని బార్లకూ ఇది వర్తించనుంది. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని, బహిరంగ ప్రదేశాల్లో క్రాకర్లు కాల్చొద్దని, డీజేలతో పాటు పరిమితికి మించి శబ్ధం చేసే వాటిని వినియోగించొద్దని కొత్వాల్‌ స్పష్టం చేశారు.ఈ నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

ఏర్పాట్లపై వీడియోకాన్ఫరెన్స్‌...
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో గురువారం కౌంటింగ్‌ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన చర్యలు, బందోబస్తు ఏర్పాట్లపై కొత్వాల్‌ అంజనీకుమార్‌ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. బషీర్‌బాగ్‌ కమిషనరేట్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(సీసీసీ)లో జరిగిన ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర, రాష్ట్ర, నగర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని, బెట్టింగ్‌ నిర్వాహకులపై కఠినంగా వ్యవహరించాలని సిటీ పోలీసు బాస్‌ అధికారులను ఆదేశించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top