
ఫార్మాసిటీకి మాస్టర్ ప్లాన్ రూపొందించండి
హైదరాబాద్ ఫార్మాసిటీకి సమీకృత అభివృద్ధి ప్రణాళిక (ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్) రూపొందించేందుకు కన్సల్టెన్సీలను....
* కన్సల్టెన్సీలకు ఆహ్వానం పలుకుతూ సర్కారు నోటిఫికేషన్
* ప్రాజెక్టు అమలు పర్యవేక్షణకు టాస్క్ఫోర్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఫార్మాసిటీకి సమీకృత అభివృద్ధి ప్రణాళిక (ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్) రూపొందించేందుకు కన్సల్టెన్సీలను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనుభవం కలిగిన కన్సల్టెన్సీలు జూలై 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్ ఐఐసీ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రతిపాదిత ఫార్మాసిటీలో జనావాసాలు, వర్క్స్టేషన్లు, కాలుష్య వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు, ఇతర మౌలిక సౌకర్యాలు ఎలా ఉండాలనే అంశంపై అనుభవమున్న క న్సల్టెన్సీలతో మాస్టర్ ప్లాన్కు రూపకల్పన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’కి అవసరమైన 11వేల ఎకరాల భూమిని గుర్తించింది. మరోవైపు ఫార్మాసిటీలో అనుమతులు కోరుతూ ఇప్పటికే 350కుపైగా ఫార్మా పరిశ్రమల నుంచి దరఖాస్తులు అందినట్లు టీఎస్ ఐఐసీ వర్గాలు వెల్లడించాయి.
వీరికి అనుమతులు లభిస్తే సుమారు ఆరు వేల ఎకరాల మేర భూమిని కేటాయించాలి. ఆసక్తి వ్యక్తీకరణతో (ఈఓఐ) ముందుకు వచ్చే కన్సల్టెన్సీని వీలైనంత త్వరగా ఎంపిక చేసి మాస్టర్ప్లాన్ను కొలిక్కి తీసుకురావాలని టీఎస్ఐఐసీ భావిస్తోంది. ప్రణాళిక సిద్ధమైన వెంటనే ఫార్మాసిటీలో తొలిదశ పనులు చేపట్టాలని టీఎస్ఐఐసీ నిర్ణయించింది.
పర్యవేక్షణకు స్పెషల్ టాస్క్ఫోర్స్: ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫార్మాసిటీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు స్పెషల్ టాస్క్ఫోర్స్ కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. పరిశ్రమల శాఖ కార్యదర్శి చైర్మన్గా, టీఎస్ ఐఐసీ వైస్ చైర్మన్ సభ్య కార్యదర్శిగా స్పెషల్ టాస్క్ఫోర్స్కు నేతృత్వం వహిస్తారు.