‘మోటార్ల’పై నియంత్రణ! 

ఎస్సారెస్పీ కాల్వల పరిధిలో నిరంతర పర్యవేక్షణకు ఆదేశాలు 

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు నీటిని తరలించేందుకు కాల్వల పరిధిలోని మోటార్లను నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్‌ జిల్లాల కలెక్టర్లకు మంగళవారం నీటి పారుదల శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాల్వల పరిధిలోని 180 కి.మీ. మేర పో లీసు, రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల అధికారులతో పర్యవేక్షించాలని ఆదేశించింది. మోటార్ల పరిస్థితిని సమీక్షించి, తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎస్సారెస్పీ పరిధిలో 3 వేలకు పైగా మోటార్లు ఉండటంతో చివరి ఆయకట్టు రైతులకు నీరందటం లేదు. దీంతో రైతులు ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్సారెస్పీ పైఆయకట్టు పరిధిలో విద్యుత్‌ ను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top