కొండ పోచమ్మకు గోదావరి జలాలు | Godavari water released from MallannaSagar to Kondapochamma | Sakshi
Sakshi News home page

మల్లన్న సాగర్ నుంచి కొండ పోచమ్మకు గోదావరి జలాలు

May 13 2020 2:25 PM | Updated on May 13 2020 2:38 PM

Godavari water released from MallannaSagar to Kondapochamma - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గోదావరి జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక అడుగు వేసింది.  ప్రతిష్టాత్మక కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గుండెకాయ వంటి కొమురవెల్లి మలన్నసాగర్ నుంచి బుధవారం నీటి విడుదల మొదలైంది. 52 టీఎంసీల నీరు నిల్వ చేయగల సామర్ధ్యం కలిగిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ సర్జ్పూల్కు సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ నుంచి విడుదలైన గోదావరి జలాలు చేరాయి. ఈ పథకంలో ఇది మానవ నిర్మిత అతిపెద్ద కట్టడం. ఇక్కడి నుంచి ఈ జలాలను కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లోకి విడుదల చేశారు.

మల్లన్నసాగర్ రిజర్వాయర్ సహ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియోజకవర్గం గజ్వేల్ పరిధిలో కొండపోచమ్మ సాగర్ భారీ రిజర్వాయర్‌ను ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ నిర్మించింది. ఎటువంటి ఆర్భాటం లేకుండా నేడు అధికారులు వెట్రన్ చేపట్టారు. వెట్రన్లో భాగంగా తొలుత  ఒకటో నెంబర్ పంప్ నుంచి నీటి విడుదలను చేపట్టారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శనం, సూచనలకు అనుగుణంగా నీటిపారుదల రంగ నిపుణుల సలహా మేరకు ఎటువంటి అటంకాలు ఎదురవకుండా నిర్మాణపనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ చేపట్టింది.

వాస్తవానికి మలన్నసాగర్ రిజర్వాయర్ నింపిన తర్వాతే కొండపోచమ్మ సాగర్‌కు నీరు విడుదల కావాలి. 52 టీఎంసీల సామర్ధ్యం కలిగిన భారీ  కొమురవెల్లి మలన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో తుక్కాపూర్ పంప్‌హౌస్‌ నుంచి డెలివరీ సిస్టర్న్ ద్వారా నీటిని  లిఫ్ట్ చేస్తున్నారు. ఈ నీరు గజ్వేల్ మండలం అక్కారంలో నిర్మించిన పంప్‌హౌస్‌కి ఆ తర్వాత మర్కూక్ సమీపంలో నిర్మించిన మరో పంప్‌హౌస్‌కు అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ సర్జ్పూల్‌కు చేరుతాయి.

మల్లన్న సాగర్ సర్జ్పూల్ నుంచి ఒక్కొక్కటి 43 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 8 మెషీన్లు  నీటిని ఎత్తిపోస్తాయి. ఒక్కొ పంప్ 1100 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తాయి. ఇక్కడ గోదావరి జలాలు 103.88 మీటర్ల ఎత్తుకు చేరుతాయి. ఈ మార్గమధ్యలో 16.18 కి.మీ పొడవైన సొరంగం కూడా ఉంది. దాదాపు 119 కి.మీ పొడువైన 17 డిస్ట్రిబ్యూటరీ కాలువలు కూడా దీనికి అనుసంధానంగా ఉన్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు అందే ఆయకట్టులో ఎక్కువ శాతం మల్లన్నసాగర్  పరిధిలోనే ఉంది.  ఈ రిజర్వాయర్ ద్వారా సిరిసిల్ల, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల పరిధిలో 1,25,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇక్కడి నుంచి సుదూరాన ఉన్న బస్వాపూర్ రిజర్వాయర్కు కూడా నీరు ఎత్తిపోయనున్నారు. అలాగే నల్లగొండ జిల్లాకు కూడా గోదావరి జలాలు మల్లన్నసాగర్ నుంచే అందుతాయి. ఇక్కడి నుంచి మరో స్వతంత్ర లింక్ ద్వారా నీరు సింగూరుకు చేరుతాయి. కొండపోచమ్మ సాగర్‌కు వెళ్లే మార్గంలో ఉండే అన్ని చెరువులను గోదావరి జలాలతో నింపుతారు.

Advertisement
 
Advertisement
Advertisement