రాత్రంతా మాట్లాడుకో..!


ఈనెల 1 నుంచి ఉచిత కాల్స్

ల్యాండ్ లైన్ నుంచి ఏ ఫోన్‌కైనా..

బీఎస్‌ఎన్‌ఎల్ అపూర్వ కానుక


 

కరీంనగర్ క్రైం : ల్యాండ్ ఫోన్లకు ఆదరణ పెంచేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త పథకం ప్రవేశపెట్టింది. మే డే సందర్భంగా ల్యాండ్ ఫోన్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జిల్లాలో 23 వేలకు పైగా ల్యాండ్ లైన్ వినియోగదారులు, 9 వేలకు పైగా బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులున్నారు. మొబైల్ రాకతో క్రమంగా వినియోగదారులు సంఖ్య తగ్గిపోరుుంది. బ్రాడ్‌బ్యాండ్ సేవలను వినియోగించుకనే వారు తప్ప ల్యాండ్ ఫోన్లు వినియోగించేవారే లేరు. ల్యాండ్‌ఫోన్లకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది.



ల్యాండ్ లైన్ నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచితంగా మాట్లాడునే అవకాశం కల్పించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు ఇతర ఆపరేటర్లకు చెందిన ల్యాండ్‌లైన్, మొబైల్ ఫోన్లకు ఉచితం మాట్లాడుకునే అవకాశం కల్పించింది. లోకల్, ఎస్డీడీ కాల్స్ కూడా ఉచితమే. కొత్త కనెక్షన్ కోసం రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ అద్దె పట్టణాల్లో ఈ నెల 1 నుంచి రూ.220, గ్రామీణపరిధిలో రూ.160.   



యువతే టార్గెట్

 మారుతున్న నగర జీవన ైశె లిలో రాత్రి 11 తర్వాతే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ఈక్రమంలో రాత్రి వేళల్లోనే కుర్రకారు ఎక్కువగా మాట్లాడుతుంటారు. వీరే కాకుండా వివిధ ఉద్యోగాలు చేసే వారు సైతం రాత్రి వేళనే తీరిగ్గా ఉంటుండడంతో ఈ పథకానికి క్రేజీ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా హైదారాబాద్ వంటి మహానగరాల్లో ఉన్న ఆప్టికల్ ఫైబర్ ఫర్ హోమ్ పథకాన్ని జిల్లాలోనూ ప్రవేశపెట్టాలని కొంతకాలంగా వినియోగదారులు కోరుతున్నారు.



జిల్లాలో ఉన్న అండర్ గ్రౌండ్ కేబుల్స్‌తో ఇంటర్నెట్ వేగం బాగా తగ్గుతోందని దీనికి తోడు అనేక చోట్ల అతుకులుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఫిర్యాదులున్నాయి. ఇప్పటికైనా డిమాండ్ ఎక్కువగా ఉన్న చోట్ల ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్య కల్పించాలని కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top