బ్యాంకు మేనేజర్‌నంటూ మోసం | fraud as bank manager | Sakshi
Sakshi News home page

బ్యాంకు మేనేజర్‌నంటూ మోసం

Sep 23 2014 3:15 AM | Updated on Sep 2 2017 1:48 PM

బ్యాంకు మేనేజర్‌నని ఫోన్ ద్వారా పరిచయం చేసుకున్న వ్యక్తి.. ఏటీఎం పిన్ నంబర్ తెలుసుకున్నాడు.

కమ్మర్‌పల్లి : బ్యాంకు మేనేజర్‌నని ఫోన్ ద్వారా పరిచయం చేసుకున్న వ్యక్తి.. ఏటీఎం పిన్ నంబర్ తెలుసుకున్నాడు. క్లోనింగ్ చేసిన కార్డుతో వివిధ దుకాణాల్లో షాపింగ్ చేసి రూ. 15,630 డ్రా చేశాడు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ పవార్ బాలాజీకి ఆంధ్రాబ్యాంక్‌లో ఖాతా ఉంది. ఆయన ఫోన్‌కు ఆదివారం రాత్రి 70338 71737 నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను బ్యాంకు మేనేజర్‌నని పరిచయం చేసుకున్నాడు. నీ ఏటీఎం పిన్ నంబర్ మారిందని తెలిపాడు.

పాత నంబర్ చెప్పాలని కోరాడు. దీంతో బాలాజీ తన కార్డు నంబర్ తెలిపాడు. అవతలి వ్యక్తి వెంటనే ఫోన్ పెట్టేశాడు. అనుమానం వచ్చిన బాలాజీ.. వెంటనే కమ్మర్‌పల్లిలోని ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. అయితే ఏటీఎం బంద్ ఉండడంతో మెట్‌పల్లి ఎస్‌బీహెచ్ ఏటీఎం కేంద్రం వద్దకు వెళ్లి తన వద్ద ఉన్న ఏటీఎం కార్డుతో బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలని చూశాడు. అనేబుల్ టు ప్రాసెస్ అని రిసిప్ట్ రావడంతో నివ్వెరపోయాడు. సోమవారం కమ్మర్‌పల్లి ఆంధ్రాబ్యాంక్‌కు వెళ్లి తన ఖాతాకు సంబంధించి లావాదేవీలు చూడగా ఆదివారం ఒక్కరోజే ఏడు దఫాలుగా రూ. 15,630 డ్రా అయినట్లు తేలింది.

కార్డు తన వద్ద ఉండగానే ఖాతాలోని నగదు ఎలా విత్‌డ్రా అయ్యిందని బ్యాంక్ మేనేజర్‌ను అడిగాడు. పిన్ నంబరు చెప్పడం వల్ల అజ్ఞాత వ్యక్తి షాపింగ్ ద్వారా డబ్బులు డ్రా చేసి ఉంటాడని మేనేజర్ పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement