రైతుల ఆత్మహత్యలపై రాజకీయూలా? | former mp ponnam prabhakar fires on kcr about Farmers suicide | Sakshi
Sakshi News home page

రైతుల ఆత్మహత్యలపై రాజకీయూలా?

Jun 14 2015 12:38 AM | Updated on Oct 3 2018 7:42 PM

తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయని ఆశించిన రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించడం బాధాకరమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

 కరీంనగర్ : తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయని ఆశించిన రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించడం బాధాకరమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన రుణమాఫీ హమీలో స్పష్టత లేదని ఆరోపించారు. ఇటీవల కురిసిన వడగళ్ల వానతో నష్టపోయిన రైతుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించకపోవడం బాధాకరమని అన్నారు.  రైతుల ఆత్మహత్యలపై రాజకీయాలు చేయడం టీఆర్‌ఎస్‌కే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లాలో 120 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. అధికారికంగా నివేదిక పంపకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ అంటే ఒక్క మెదక్ జిల్లాయేనా అని అన్నారు. మెదక్ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న 55 మంది రైతులకు లక్షన్నర చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం.. మిగతా జిల్లాలను విస్మరించడం ఏమిటని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల వివరాలు కేంద్రానికి పంపితే ఎక్కడా పరువు పోతుందోనని.. తెలంగాణ సర్కారు వాస్తవాలను తొక్కిపెట్టడం దారుణమన్నారు.

ఖరీఫ్ ముంచుకొస్తున్నా.. ఇంతవరకు అధికార యంత్రాంగం యూక్షన్‌ప్లాన్, రుణప్రణాళిక తయారు చేయకపోవడం రైతులను విస్మరించడమేనని మండిపడ్డారు. పారిశ్రామిక అభివృద్ధి పేరిట హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే సరిపోదని.. జిల్లాల్లో అనువుగా ఉండే పరిశ్రమలను నెలకొల్పి తెలంగాణలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. సమావేశంలో నాయకులు కర్ర రాజశేఖర్, చెన్నాడి అజిత్‌రావు, ఎర్రోళ్ల రవీందర్, ఉప్పరి రవి, సదానందచారి, గుగ్గిళ్ల శ్రీనివాస్, పొన్నం సత్యం  పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement