కాంగ్రెస్‌ నరహంతక పార్టీ | Fight between Jivanreddi and kamalakar | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నరహంతక పార్టీ

Aug 30 2017 2:36 AM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్‌ నరహంతక పార్టీ - Sakshi

కాంగ్రెస్‌ నరహంతక పార్టీ

కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం మంగళవారం అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీ వాగ్వాదానికి వేదికగా మారింది.

- జెడ్పీని కుదిపేసిన ‘గంగుల’ వ్యాఖ్యలు 
సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే కమలాకర్‌ మధ్య వాగ్వాదం
 
సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం మంగళవారం అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీ వాగ్వాదానికి వేదికగా మారింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశిస్తూ ‘నరహంతక పార్టీ’ అనడంతో వివాదం చెలరేగింది. జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ తుల ఉమ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చర్చలో భాగంగా కాటారం జెడ్పీటీసీ సభ్యుడు నారాయణరెడ్డి పెద్దపల్లిలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో చరిత్రలో ఎక్కడా లేనంతగా ఒకేసారి మాజీ మంత్రి శ్రీధర్‌బాబు సహా 300 మందిపై అన్యాయంగా కేసులు పెట్టారని ఆరోపించారు. దీంతో టీఆర్‌ఎస్‌ సభ్యులు ఆయనతో వాగ్వాదానికి దిగారు.

కాంగ్రెస్‌ సభ్యులు మళ్లీ లేచి డౌన్‌ డౌన్‌ అన్నందుకే కేసులు పెడితే టీఆర్‌ఎస్‌ నేతల మీద ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఈ అంశంపై వాడీవేడిగా చర్చ జరుగుతున్న సమయంలో కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అక్రమ కేసుల గురించి ప్రస్తావించాల్సి వస్తే అందులో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ముందు వరుసలో ఉంటుందని, ఆ పార్టీ నరహంతక పార్టీ అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కమలాకర్‌ వ్యాఖ్యలపై స్పందించిన సీఎల్పీ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నరహంతకుల పార్టీ అన్నందుకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పి మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. నేరెళ్లలో ఇసుక లారీల ప్రమేయంతో 12 మంది చనిపోగా ఇవన్ని ప్రభుత్వానికి కనిపించడం లేదా, నరహంతకుల పార్టీ ఎవరిదో చెప్పాలని జీవన్‌రెడ్డి నిలదీశారు.    

Advertisement
 
Advertisement
Advertisement