అర్ధంతరంగా నిలిచిపోయిన ‘ఇందిరమ్మ’ ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ముందుగా పైకప్పు వరకు పూర్తయిన నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.
అర్ధంతరంగా నిలిచిపోయిన ‘ఇందిరమ్మ’ ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ముందుగా పైకప్పు వరకు పూర్తయిన నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో ప్రత్యేక సర్వే నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పది రోజుల్లో వివరాల సేకరణ పూర్తిచేసి నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. తాజా ప్రక్రియ ద్వారా జిల్లాలో సగంలో ఆగిపోయిన 2,775 ఇళ్లకు మోక్షం లభించే అవకాశం ఉంది. ఇదిలాఉంటే ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) కింద గత ఏడాది నిర్దేశించిన లక్ష్యాలు పూర్తికాలేదు. ఈ ఐఏవై లక్ష్యాన్ని ‘ఇందిరమ్మ’ ఇళ్లతో భర్తీ చేయాలని యంత్రాంగం భావిస్తోంది.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రస్తుతం రాష్ట్రంలో నిలిచిపోయింది. ఈ పథకం కింద ఇప్పటికే మంజూరైన పలు ఇళ్లకు బిల్లుల చెల్లింపులు నిలిపివేశారు. ఈ పథకంలో భారీ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే అభియోగాలుండడంతో పూర్తిస్థాయి విచారణకు సర్కారు ఆదేశించింది. ఈ క్రమంలో విచారణపర్వం పూర్తయితే తప్ప పథకం ముందుకుసాగే అవకాశం లేదు. మరోవైపు ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) కింద గత ఏడాది నిర్దేశించిన లక్ష్యాలు పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ఐఏవై లక్ష్యాన్ని భర్తీ చేసేందుకు యంత్రాంగం సరికొత్త ప్రక్రియకు తెరలేపింది. ఐఏవైలో మిగిలిపోయిన లక్ష్యాన్ని ఇందిరమ్మ ఇళ్లతో భర్తీ చేయాలని భావిస్తోంది. దీంతో కొందరికైనా లబ్ధి చేకూరుతుందని భావించిన అధికారులు.. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాధాన్యతాక్రమంలో లబ్ధిదారులను తేల్చనున్నారు.
పది రోజుల్లో ఫైనల్..
2014-15 వార్షిక సంత్సరంలో ఇందిరా ఆవాస్యోజన పథకం కింద జిల్లాకు 3,430 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేసి.. వారికి మంజూరు సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇప్పటివరకు 655 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో 2,775 ఇళ్లు మిగిలిపోయాయి. ఇప్పటికే మంజూరైన ఐఏవై ఇళ్లలో 1,829 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. పైకప్పు పడిన వాటికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని భావించిన అధికారులు.. తాజాగా మరోమారు క్షేత్రపరిశీలనకు దిగారు. ఐఏవై లబ్ధిదారులే కాకుండా ఇందిరమ్మ పథకంలోని లబ్ధిదారులను కూడా పరిగణించి మొత్తంగా 2,775 మందిని చేర్చి ప్రయోజన ం చేకూర్చాలని నిర్ణయించారు. పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేసి జాబితాను ప్రభుత్వానికి పంపించాలని యంత్రాంగం నిర్ణయించింది. దీంతో తుదిజాబితాకు ప్రభుత్వం అనుమతిస్తే గత ఏడాది ఐఏవై లక్ష్యం నెరవేరే అవకాశముంది.
ఐఏవైలో సర్దుబాటుతో కొత్తగా వచ్చే ఇళ్లు (నియోజకవర్గాల వారీగా)
నియోజకవర్గం= ఇళ్లు
చేవెళ్ల= 363
పరిగి= 667
రాజేంద్రనగర్= 46
ఇబ్రహీంపట్నం= 348
మహేశ్వరం= 480
మేడ్చల్= 163
తాండూరు= 394
వికారాబాద్= 314