భర్త వెంకటరావు,కుమార్తె కనక మహాలక్ష్మితో బాధితురాలు విజయలక్ష్మి
తప్పుగా ఆధార్ లింక్ చేసిన సిబ్బంది
రేషన్ కార్డు తొలగింపు
ప్రభుత్వ పథకాలు దూరం
పీజీఆర్ఎస్లో ఐదుసార్లు ఫిర్యాదు
మహారాణిపేట (విశాఖ): సాంకేతిక లోపాలు పేద ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. దీనికి విశాఖ జిల్లా గాజువాక పైడిమాంబ అమ్మవారి కాలనీకి చెందిన వేగి విజయలక్ష్మి ఉదంతమే నిదర్శనం. అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులతో బతికే ఈ పేద మహిళ పేరు మీద ప్రభుత్వ రికార్డుల్లో ఏకంగా 964 ఇళ్లు ఉన్నట్లు చూపిస్తోంది. ఆధార్ నమోదులో దొర్లిన తప్పిదం వల్ల ఆమె రేషన్ కార్డు పోయింది.
ప్రభుత్వ పథకాలన్నీ నిలిచిపోయాయి. తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తెకు ‘తల్లికి వందనం’ కూడా రాలేదు. సమస్యను పరిష్కరించాలని కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో ఐదుసార్లు దరఖాస్తు చేసినా అధికారుల్లో చలనం లేకపోవడం దారుణం. తమకు న్యాయం చేయాలని సోమవారం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీ అందించడానికి వచ్చిన విజయలక్ష్మి కుటుంబం తన ఆవేదనను ‘సాక్షి’తో వెలిబుచ్చింది.


