సౌకర్యాలు లేకనే.. | farmers got loss due to heavy untimely rains | Sakshi
Sakshi News home page

సౌకర్యాలు లేకనే..

May 22 2014 2:31 AM | Updated on Sep 2 2017 7:39 AM

అకాల వర్షాలు రైతన్నలను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అసలే ధాన్యం కొనుగోళ్లు లేక, కనీస మద్దతు ధర రాక తీవ్ర ఆందోళన చెందుతున్న రైతులపై ప్రకృతి విరుచుకు పడుతోంది.

బాన్సువాడ టౌన్, న్యూస్‌లైన్  :  అకాల వర్షాలు రైతన్నలను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అసలే ధాన్యం కొనుగోళ్లు లేక, కనీస మద్దతు ధర రాక తీవ్ర ఆందోళన చెందుతున్న రైతులపై ప్రకృతి విరుచుకు పడుతోంది. బాన్సువాడ మండలంలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ వర్షం వల్ల మండలంలోని వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. బాన్సువాడ మార్కెట్ యార్డులో ఉన్న ధాన్యం కుప్పలన్నీ వర్షం నీటిలో మునిగి పోయాయి. పొద్దంతా ఎండలు మండిపోతున్నాయి. రాత్రి వేళ వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చి వర్షం కురియడంతో రైతులు ధాన్యాన్ని కాపాడుకోలేక పోతున్నారు.

 రైతులకు తాటిపత్రులు కూడా అందుబాటులో ఉండక పోవడంతో ధాన్యం కుప్పలు తడిసి పోతున్నాయి. బాన్సువాడ మండలంలోని తాడ్కోల్, సోమేశ్వర్, బుడ్మి, తిర్మలాపూర్, చింతల్‌నాగారం, బోర్లం తదితర గ్రామాల్లో పొలాల్లోనే ఉన్న ధాన్యం వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్నది. చింతల్ నాగారంలో రెండు రోజుల క్రితమే సుమారు 400 ఎకరాల్లో రైతులు వరి కోతలు కోసి  ధాన్యాని ఆరబెట్టారు. వర్షం దాటికి కుప్పలన్నీ నానిపోయాయి. ఎకరానికి రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు పేర్కొంటున్నారు.

 గన్నీ సంచుల కొరత, రైస్ మిల్లర్‌ల నిబంధనలు, హమాలీల కొరత కారణంగా ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో రోజుల తరబడి ధాన్యం కాంటాలు కావడం లేదని, ఫలితంగా ధాన్యం కుప్పలన్నీ వర్షం పాలవుతున్నట్లు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement