స్మార్ట్‌ఫోన్‌ బుక్‌ చేస్తే.. దేవతల బొమ్మలు

Fake Online Shopping To Fraud - Sakshi

కరీమాబాద్‌: ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్‌ బుక్‌ చేస్తే.. దానికి బదులు సోంపాపిడి ప్యాకెట్, దేవతా మూర్తుల బొమ్మలు పోస్టల్‌ ద్వారా వచ్చిన సంఘటన నగరంలోని రంగశాయిపేటలో చోటుచేసుకుంది. 5వ డివిజన్‌ జక్కలోద్ది గ్రామానికి చెందిన మైదం వంశీకి 20 రోజుల క్రితం తన ఫోన్‌కు ‘మీరు స్మార్ట్‌ ఫోన్‌ విన్నయ్యారు.. రూ.1800 చెల్లిస్తే మీ ఇంటికి పోస్ట్‌ ద్వారా పంపిస్తాం’ అనే మెస్సేజ్‌ గ్లోబల్‌ ఇండియా టెలీ మార్కెటింగ్‌ ఆనందగిరి, బెంగళూర్‌ నుంచి వచ్చింది. దీంతో ఆయన వెంటనే బుక్‌ చేశాడు. ఈ క్రమంలో మంగళవారం పోస్టల్‌ ప్యాకింగ్‌ ద్వారా రంగశాయిపేట పోస్టాఫీస్‌కు బాక్స్‌ వచ్చింది. పోస్టల్‌ వారు వంశీ ఫోన్‌కు కాల్‌చేసి బాక్స్‌ తీసుకెళ్లాలని చెప్పారు.

అక్కడి వెళ్లి రూ.1800 చెల్లించి బాక్స్‌ అక్కడే ఓపెన్‌ చేయగా అందులో స్మార్ట్‌ ఫోన్‌కు బదులు సోంపాపిడి ప్యాకెట్, పూజా సామగ్రికి సంబంధించి లక్ష్మి, పాదుకలు, తాబేలు, ఒక లాకెట్‌ బ్రాస్‌ ఉన్నాయి. దీంతో అవాక్కయిన వంశీ తాను మోసపోయానని గుర్తించి హెడ్‌ పోస్టాఫీస్‌ సూపరింటెండెంట్‌ను కలిశాడు. ఆయన సంబంధిత గ్లోబల్‌ ఇండియా మార్కెటింగ్‌ కంపెనీ ప్రతినిధుల సెల్‌ నంబర్‌కు(9611693363) ఫోన్‌ చేశారు. కంపెనీవారు పొరపాటు జరిగినట్లు చెప్పారని సూపరింటెండెంట్‌ తెలిపారు. అంతే కాకుండా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇండియాపోస్ట్‌.జీఓవీ.ఇన్‌సీసీసీ కంప్లేంట్స్‌’లో ఫిర్యాదు చేయాలని బాధిడికి వివరించారు. కాగా పార్శిల్‌ ద్వారా వచ్చిన వస్తువుల మొత్తం విలువ రూ.100 కూడా ఉండదని 
తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top