ఖమ్మం జిల్లాలో భారీగా పేలుడు సామగ్రి పట్టివేత | explosives held in Khammam district | Sakshi
Sakshi News home page

ఖమ్మం జిల్లాలో భారీగా పేలుడు సామగ్రి పట్టివేత

Jan 23 2015 10:30 PM | Updated on Sep 2 2017 8:08 PM

ఖమ్మం జిల్లాలో భారీగా పేలుడు సామగ్రిని పట్టుకున్నారు.

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో భారీగా పేలుడు సామగ్రిని పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని మావోయిస్టులకు చేరవేస్తున్న జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 కంకర లోడ్ టిప్పర్ అడుగు భాగంలో పేలుడు సామగ్రిని ఉంచి పాల్వంచ నుంచి మల్కన్‌గిరికి తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1.92 ల క్షలు ఉంటుందని, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని కొత్తగూడెం ఓఎస్‌డి జూవెల్ డేవిస్ వివరించారు. స్థానిక సీఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిలిటెన్ స్టిక్స్ అక్రమంగా రవాణా అవుతున్నట్లు పోలీసులకు గత 21న సమాచారం అందిందని, ఎంపీ బంజరు సమీపంలో మాటువేసి పట్టుకున్నామని చెప్పారు.

362 జిలిటెన్ స్టిక్స్, 12 బండిళ్ల డిటోనేటర్లు, (ఒక్కో బండిల్‌లో 25 చొప్పున) స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్ శంకర్ నారాయణ, క్లీనర్ సంతోష్ విశ్వకర్మను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిని విచారించగా పాల్వంచ మండలం జగన్నాధపురం ప్రభావతి స్టోన్ క్రషర్స్ సూపర్ వైజర్ బండారి వీరన్న టిప్పర్‌లో ఎక్కించాడని తె లిపారని వెల్లడించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన బొల్లం నాగేశ్వరరావు సరఫరా చేశాడని చెప్పడంతో అతడిని కూడా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

పాల్వంచ టు మల్కన్‌గిరి...

పాల్వంచకు చెందిన అమర్‌కుమార్ ఒడిశాలో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడి మావోయిస్టులతో సంబంధాలు ఏర్పడటంతో వారికి పేలుడు పదార్థాలు సరఫరా చేసేందుకు మల్కన్ గిరికి రవాణా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని ఓఎస్‌డీ తెలిపారు. అమర్ కుమార్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement