13 కమిటీలు

Elections Allart Revenue Department Nizamabad - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: ఎన్నికలు పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతలను వివిధ కమిటీలకు అప్పగించింది. మొత్తం 13 కమిటీలను నియమించగా, ఒక్కో కమిటీకి ఒ క్కో జిల్లా స్థాయి అధికారికి పర్యవేక్షణ బా ధ్యతలను కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అప్పగించారు. ఈ మేరకు సంబంధిత శాఖల జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. పోలిం గ్‌ విధులు నిర్వర్తించనున్న అధికారులు, సిబ్బంది నియామకం బాధ్యతలను జిల్లా రెవె న్యూ అధికారి ఆర్‌.అంజయ్యకు అప్పగించా రు.

అలాగే, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లకు అవసరమైన సిబ్బంది కేటాయింపులు, సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్ల) వంటి అంశాలను డీఆర్వో పర్యవేక్షించనున్నారు. ట్రాన్స్‌పోర్టు కమిటీ నోడల్‌ అధికారిగా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ ఎం.వెంకటేశ్వర్‌రెడ్డిని నియమితులయ్యారు. ఈవీఎంలు, పోలింగ్‌ సిబ్బందిని పోలింగ్‌ కేంద్రాలకు తరలింపు వంటి బాధ్యతలను డీటీసీకి అప్పగించారు. అలాగే పోలింగ్‌ నిర్వహణ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూంలకు తరలింపు వంటి అంశాలను వెంకటేశ్వర్‌రెడ్డి పర్యవేక్షించనున్నారు.

ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి శిక్షణ తరగతులు, అవగాహన వంటి వాటి కోసం ప్రత్యేక కమిటీని నియమించారు. బోర్గాం(పి) జిల్లా పరిషత్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్రా రామారావుకు బాధ్యతలు అప్పగించారు. పోలింగ్‌ నిర్వహణ, కౌంటింగ్‌కు అవసరమైన సామగ్రి ఏర్పాట్ల బాధ్యతలు కార్మిక శాఖ ఉప కమిషనర్‌ చతుర్వేదికి అప్పగించారు. ఎంతో కీలకమైన ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, అభ్యర్థుల ఖర్చులపై పర్యవేక్షించే కమిటీకి జిల్లా సహకార శాఖాధికారి సింహాచలం నోడల్‌ అధికారిగా నియమితులయ్యారు. అభ్యర్థుల ఖర్చుపై ఎప్పటికప్పుడు నిఘా ఉండటం వంటి విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందిని డీసీవో పర్యవేక్షించనున్నారు.

ఎన్నికల తీరును పరిశీలించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్‌ స్థాయి ఉన్నతాధికారులు ప్రత్యేక పరిశీలకులుగా జిల్లాకు రానున్నారు. నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే ఈ పరిశీలకులు జిల్లాకు చేరుకుని ఎన్నికల నిర్వహణ తీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తుంటారు. వీటిని సమన్వయం చేసుకునేందుకు నోడల్‌ అధికారిగా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ హరికృష్ణను నియమించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును పర్యవేక్షించే బాధ్యతలు సీపీ కార్తికేయకు అప్పగించారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం కోసం ప్రత్యేకంగా మీడియా సెల్‌ను ఏర్పాటు చేశారు.

పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మహ్మద్‌ ముర్తుజా నోడల్‌ అధికారిగా వ్యవహరించనున్నారు. అదనపు పీఆర్వో రామ్మోహన్‌రావుకు కూడా ఈ బాధ్యతలు అప్పగించారు. కంప్యూటరైజేషన్‌ నోడల్‌ అధికారిగా ఎన్‌ఐసీ సమాచార అధికారి రాజ్‌గోపాల్‌ను నోడల్‌ అధికారిగా నియమించారు. స్వీప్‌ నోడల్‌ అధికారులుగా డీసీవో సింహాచలం, బాలభవన్‌ సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌ నియమితులయ్యారు.  హెల్ప్‌లైన్, ఫిర్యాదుల పరిష్కారం, ఎస్‌ఎంఎస్‌ మానిటరింగ్, కమ్యూనికేషన్‌ ప్లాన్‌ నోడల్‌ అధికారిగా కార్తిక్, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రత్యేక నోడల్‌ అధికారి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.స్రవంతికి బాధ్యతలు అప్పగించారు. ఆయా కమిటీలకు కేటాయించిన విధులను సంబంధిత నోడల్‌ అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. 

రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓటర్ల జాబితా 
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓటర్ల జాబితా అందజేసినట్లు కలెక్టర్‌ రామ్మోహన్‌రావు  తెలిపారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్‌చే ఆమోదింపబడిన జాబితాను పార్టీల ప్రతినిధులకు అందజేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.   

ఎన్నికల ఫిర్యాదుల కోసం కంట్రోల్‌ రూం 
ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): ఎన్నికల ఫిర్యాదుల కోసం జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ రామ్మోహన్‌రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కంట్రోల్‌ రూం 24 గంటల పాటు పని చేస్తుందని పేర్కొన్నారు. కంట్రోల్‌ రూంకు 18004256644 లేదా 08462–224001కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అలాగే, ఎన్నికల ప్రవర్తన నియమావళిపై మోడల్‌ కండక్ట్‌ కోడ్‌ నోడల్‌ అధికారి డీసీవో సింహాచలం (91001 15747)కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top