ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ రేపటి నుంచే.. | Eamcet Second Phase Counselling Will starts On 6th July | Sakshi
Sakshi News home page

Jul 5 2018 2:38 AM | Updated on Jul 5 2018 8:33 AM

Eamcet Second Phase Counselling Will starts On 6th July - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది ఇంజనీరింగ్‌ ప్రవేశాల్లో భాగంగా రెండో దశ కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ప్రవేశాల కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 6 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 186 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో 64,946 సీట్లు అందుబాటులో ఉండగా, గత నెలలో నిర్వహించిన మొదటి దశ కౌన్సెలింగ్‌లో 52,621 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించింది. మరో 12,325 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. పైగా సీట్లు పొందిన వారిలో 38,705 మంది విద్యార్థులే సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసి, కాలేజీల్లో ప్రవేశాలు పొందారు.

దీంతో ఖాళీగా ఉన్న వాటితో పాటు విద్యార్థులు చేరని సీట్లు కలుపుకొని కన్వీనర్‌ కోటాలో 26,241 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వాటి భర్తీకి ఈ నెల 6 నుంచి రెండో దశ ప్రవేశాల కౌన్సెలింగ్‌ జరగనుంది. ఈసారి ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు మూడో దశ కౌన్సెలింగ్‌ కూడా నిర్వహించాలని ఇప్పటికే ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. అయితే ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు ఈ నెల 19తో పూర్తి కానున్నాయి. ఆ తర్వాతే మూడో దశ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్‌ వెల్లడించారు.

ఇదీ రెండో దశ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌..
6–7–2018 నుంచి 8–7–2018 వరకు: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు
7–7–2018 నుంచి 8–7–2018 వరకు: రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌
7–7–2018 నుంచి 10–7–2018 వరకు: వెరిఫికేషన్‌ పూర్తయిన వారికి వెబ్‌ ఆప్షన్లు
12–7–2018: సీట్ల కేటాయింపు
12–7–2018 నుంచి 14–7–2018: ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌
13–7–2018 నుంచి 15–7–2018: సీట్లు లభించిన కాలేజీల్లో రిపోర్టింగ్‌
16–7–2018 నుంచి: తరగతులు ప్రారంభం 

Advertisement
 
Advertisement
Advertisement