దరి చేరని ధరణి!
భూ క్రయవిక్రయాలకు తప్పని పాట్లు
రిజిస్ట్రేషన్ల కోసం కిలో మీటర్ల కొద్ది ప్రయాణం
సాక్షి, మెదక్: జిల్లాలో నర్సాపూర్, రామయంపేట, తుప్రాన్, మెదక్లలో సబ్రిజిస్టార్ల ద్వారా భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. పెద్దశంకరంపేట, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్, పాపన్నపేట మండలాలకు చెందిన రైతులు మెదక్ వెళ్లి రిజిస్టేషన్లు చేయించుకుంటున్నారు. భూ క్రయవిక్రయాలు జరిపే వారు భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మెదక్లో ఉన్న సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.
సుమారుగా 50 నుంచి 60కిలో మీటర్ల మేర ప్రయాణం చేస్తూ నానా ఇబ్బంది పడాల్సి వస్తోందని వాపోతున్నారు. అక్కడ అధికారులు అందుబాటులో లేకపోయినా, ఏవైనా సాంకేతిక ఇబ్బందు లు ఎర్పడినా ఆరోజు మొత్తం సమయం వృథా కావడంతో పాటూ రిజిస్ట్రేషన్ వా యిదా వేసుకోవాల్సి వస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికాక తప్పడంలేదు.
ఆన్లైన్ సమగ్ర భూ వివరాలు
ఇంతకు ముందు ఆన్లైన్లో నమోదు కాని భూ వివరాలను భూరికార్డుల ప్రక్షాళన అనంతరం నమోదు చేశారు. రిజిస్ట్రేషన్ విధానానికి ధరణి వెబ్సైట్ను రూ పొందించారు. దీంతో పట్టణాలకు, నగరాకు పరిమితమైన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మండల కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. సబ్రిజిస్ట్రార్ల ప్రక్రియపై ఇప్పటికే తహసీల్దార్తో పాటూ కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చా రు. తహసీల్దార్ సబ్రిజిస్ట్రార్గా వ్యవహరించేందుకు వారికి ధరణి వెబ్సైట్పై అవగాహన సైతం కల్పించారు. అయితే ధరణి వెబ్సైట్లో భూ రికార్డుల నమోదు ప్రారంభించడంలో తీవ్రంగా జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ధరణితో ప్రయోజనాలు
∙సరళమైన దస్తావేజులతో రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం ఉంటుంది.
∙తహసీల్దార్ భూముల రికార్డుల ప్రక్రియలో వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవడంతో వారికి అవగాహన ఎర్పడుతంది.
∙నకిలీ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండదు.
ఆన్లైన్లోలో భూముల వివరాలు చూసి రిజిస్ట్రేషన్ కాగానే మొదటి మ్యూటేషన్ చేయడంతో పహాణీలో నమోదు చేసుకునేందుకు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
∙సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దళారుల బెడద ఉండటంతో తప్పుడు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంలో దళారుల బెడద తప్పుతుంది.
∙రిజిస్ట్రేషన్ల పనులు త్వరగా పూర్తి అవుతాయి.
ప్రయాణంతో ఇబ్బంది
రిజిస్ట్రేషన్ పనిపై వెళ్లాలంటే 50కిలో మీటర్లకు పైగా ప్రయాణం చేయాల్సిందే. అక్కడికి వెళ్లాక పని కాకపోతే ఆ రోజంతా వృథా అవుతుంది. అధనపు ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి. మండల కేంద్రంలో ఎర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికీ దిక్కులేదు. వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రజా సమస్యలు తీర్చాలి.
– ఎల్లంపల్లి గౌతమ్, సర్పంచ్, దనూర
ప్రభుత్వ ఆదేశాలు అందలేదు
ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం నిర్వహిస్తున్న భూ ప్రక్షాళన కార్యక్రమంలో భూ సవరణలు ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలు వస్తే మండలాల్లో ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ లు చేస్తాం.
– నాగేష్, జాయింట్ కలెక్టర్, మెదక్
సంబంధిత వార్తలు