గెలిపిస్తే ప్రజాసేవకే అంకితం | dedicated to public service | Sakshi
Sakshi News home page

గెలిపిస్తే ప్రజాసేవకే అంకితం

Apr 6 2014 1:30 AM | Updated on Aug 15 2018 7:35 PM

గెలిపిస్తే ప్రజాసేవకే అంకితం - Sakshi

గెలిపిస్తే ప్రజాసేవకే అంకితం

ఎన్నికల్లో తమను గెలిపిస్తే ప్రజాసేవకే అంకితమవుతానని నారాయణఖేడ్ జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్ సీపీ తరఫున పోటీచేస్తున్న మహానంద షెట్కార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

నారాయణఖేడ్ రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికల్లో తమను గెలిపిస్తే ప్రజాసేవకే అంకితమవుతానని నారాయణఖేడ్  జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్ సీపీ తరఫున పోటీచేస్తున్న మహానంద షెట్కార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం మండలంలోని జుజాల్‌పూర్, జగన్నాథ్‌పూర్, పిప్రి,  పంచగామ, బాణాపూర్, తుర్కాపల్లి, చాంద్‌ఖాన్‌పల్లి గ్రామాల్లో ఆమె ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
 
వేసవిని సైతం లెక్కచేకుండా ఓటర్లను ఓటుకోసం అభ్యర్థించారు. ఓటర్లు పలు సమస్యలపై ఏకరువు పెట్టారు. తనను గెలిపిస్తే వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామాలు, తండాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా చేస్తానన్నారు. మైళ్లదూరం నుంచి మహిళలు ఎన్నో కష్టాలు పడుతూ మంచినీటిను తెచ్చుకోవడం దారుణమన్నారు.
 
తండాలు, గ్రామాల్లో అవసరం మేర బోర్లు వేయడంతోపాటు, మంజీరా నీరు సరఫరా జరిగేలా చూస్తానని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్  వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు వైఎస్సార్‌సీపీని గెలిపించాలన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లు, రేషన్ కార్డులు అందజేశారని తెలిపారు. పేదల సొంతింటి కలను వైఎస్ నెరవేర్చారన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి ఉన్నత విద్యాభ్యాసం చేసే అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు.
 
ఈమారు ఎన్నికల్లో జెడ్పీటీసీగా తనను గెలిపించాలని మహానంద షెట్కార్ కోరారు. ప్రచారంలో వైఎస్సార్ సీపీ నాయకులు డాక్టర్ విజయ్‌కుమార్ షెట్కార్, శ్రీదేవి షెట్కార్, మమతాషెట్కార్, సంతోషి షెట్కార్, లక్ష్మి, జగదేవి, వార్డు సభ్యులు దత్తు, సంజీవ్, అంబదాస్, గోపాల్, సంగమేశ్వర్, బిరాదర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రచారానికి ప్రజలనుంచి అనూహ్య స్పందన వ్యక్తమైంది. ఓటర్లు వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను  ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
 
 వైఎస్ వల్లే అభివృద్ధి   
 నారాయణఖేడ్ రూరల్: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దయవల్లే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, అదే తరహా అభివృద్ధికోసం ర్యాకల్ ఎంపీటీసీగా తనను గెలిపించాలని వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పార్వతి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆమె ర్యాకల్ గ్రామంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. పేదల అభ్యున్నతికోసం రాజశేఖర్‌రెడ్డి పాటుపడ్డారన్నారు. నేటికీ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆయన సేవలను తలుచుకుంటున్నారన్నారు.

ర్యాకల్ గ్రామం అభివృద్ధిలో వెనుకబడి ఉందని, మంచినీటి సమస్యను గ్రామస్థులు ఎదుర్కొంటున్నారన్నారు. తనను గెలిపించిన పక్షంలో సమస్యలు తీరుస్తానని భరోసా ఇచ్చారు. ప్రజలనుంచి వస్తున్న అనూహ్య స్పందనే తన గెలుపుకు నాంది అవుతుందన్నారు. చల్లగిద్ద తండా, పలుగు తండాలు ప్రతీ వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయన్నారు.

స్థానిక నాయకులు తండాలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కిలోమీటర్ల దూరం నుంచి నీటిని గిరిజనులు కష్టాలు పడుతూ తెచ్చుకుంటున్నారని తెలిపారు.  తనను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని ఆమె అభ్యర్థించారు. ప్రచారంలో వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement