నిర్మల్ మండలం కడ్తాల్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఓ మొసలి మృతి చెందింది.
నిర్మల్ అర్బన్ (ఆదిలాబాద్) : నిర్మల్ మండలం కడ్తాల్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఓ మొసలి మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చిన మొసలిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చనిపోయింది. గమనించిన స్థానికులు, వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు.
పట్టణ సీఐ జీవన్రెడ్డి, ఎస్సై సునీల్కుమార్, పెట్రోలింగ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, మృతిచెందిన మొసలిని పరిశీలించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి, కళేబరాన్ని వారికి అప్పగించారు. బైపాస్ రోడ్డు సమీపంలో రెండు చెరువులు, సరస్వతీ కాలువ ఉండడంతో వాటిలో ఎక్కడి నుంచైనా మొసలి వచ్చి ఉంటుందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.