పూణె నుంచి కొత్తపల్లితండాకు..

Couple Ride Bike From Pune to Jogulamba With Baby - Sakshi

జోగుళాంబ గద్వాల, నవాబుపేట: మండలంలోని కొత్తపల్లితండాకు చెందిన భార్యాభర్తలు తమ ఏడునెలల చిన్నారితో పూణే నుంచి బైక్‌పై 670 కిలోమీటర్లు, 12 గంటల పాటు ప్రయాణించి గమ్యస్థానం చేరుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన విశాల్, లీలాబాయి పూణెలో టైల్స్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌ ఉండటంతో ఇంటికి రావాలని, తల్లిదండ్రులను చూడాలన్న తపనతో పలుమార్లు ప్రయత్నించారు. విఫలం కావటంతో చివరికి బైక్‌పై మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పూణెలోని ఉథార్‌ నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 10 గంటలకు తండాకు చేరుకున్నారు. ఆరోగ్యంగానే ఉన్నారని, 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని మండల అధికారులు సూచించారు. 

పాప కోసం : విశాల్‌  
బస్సులో అందరితో కలిసి వస్తే చిన్నారికి ప్రమాదమని భావించి ఎవరూ చెప్పినా వినకుండా ధైర్యం చేసి బైక్‌పై బయలుదేరాం. 4 చోట్ల ఆగి చిన్నారికి పాలు తాగించి మేము తిన్నాం. ఊరికి రావాలన్న తపనతో ఎంత దూరం వచ్చామో తెలియలేదు. ఇక్కడకు వచ్చాక అందరూ మాట్లాడుతుంటే చిన్నారితో ఇంత దూరం బైక్‌పై రావటం నిజంగా సాహసమే అనిపిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top