ఆగస్టు 5 నుంచి ఎంటెక్‌ కౌన్సెలింగ్‌ | Counseling for admission to M.Eng, MTech, M.Pharmacy etc. | Sakshi
Sakshi News home page

ఆగస్టు 5 నుంచి ఎంటెక్‌ కౌన్సెలింగ్‌

Jul 21 2017 2:20 AM | Updated on Sep 5 2018 8:36 PM

ఆగస్టు 5 నుంచి ఎంటెక్‌ కౌన్సెలింగ్‌ - Sakshi

ఆగస్టు 5 నుంచి ఎంటెక్‌ కౌన్సెలింగ్‌

ఎంఈ/ఎంటెక్, ఎం.ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించాలని పీజీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది.

గేట్, జీప్యాట్‌ అభ్యర్థులకు 5 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌
పీజీఈసెట్‌ అభ్యర్థులకు 6 నుంచి వెరిఫికేషన్‌
ఉత్తీర్ణత లేఖలతో పీజీ కాలేజీల్లో చేరే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: ఎంఈ/ఎంటెక్, ఎం.ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించాలని పీజీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన కమిటీ సమావేశంలో ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు చేశారు. గేట్, జీప్యాట్‌లో అర్హత సాధించిన వారికి ఆగస్టు 5 నుంచి 8 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. అనంతరం వారికి 6 నుంచి 8 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించి.. 13వ తేదీన సీట్లను కేటాయించనుంది. ఇక పీజీఈసెట్‌లో అర్హత సాధించిన వారికి ఆగస్టు 6 నుంచి 10 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేపట్టనుంది. 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించి.. 16న సీట్లను కేటాయించనుంది. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 14 నుంచి 22లోగా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. రెండో దశ కౌన్సెలింగ్‌ను వచ్చే నెల 23 నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది.

ఫీజు సమస్యకు ప్రత్యామ్నాయం..
ఎంటెక్‌/ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో చేరాలంటే విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ఉత్తీర్ణత సర్టిఫికెట్లతోపాటు కాలేజీలు ఇచ్చే బదిలీ సర్టిఫికెట్‌ తప్పనిసరి. అయితే ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో అనేక కాలేజీలు ఒరిజినల్‌ సర్టిఫికెట్లను విద్యార్థులకు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఫీజులు వచ్చే వరకు కాలేజీలు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వకపోయినా సరే పీజీ ఇంజనీరింగ్‌ తదితర కోర్సుల్లో విద్యార్థులు చేరే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించినట్లు పాపిరెడ్డి వెల్లడించారు. కాలేజీ యాజమాన్యాలు తమకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వచ్చాకే ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇస్తామన్నా సరేనని.. అయితే ముందుగా విద్యార్థులకు తమ కాలేజీల్లో బీటెక్‌ తదితర కోర్సులు పూర్తి చేసినట్లు ఒక లేఖ ఇస్తే చాలన్నారు. ఆ లేఖలను తీసుకువచ్చిన విద్యార్థులను ఎంటెక్, ఎం.ఫార్మసీ తదితర కోర్సుల్లో చేర్చుకోవాలని కాలేజీలకు సూచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు పీజీ ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులను నిర్వహించే కాలేజీలకు ఆ లేఖలను అనుమతించి ప్రవేశాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఈసారి తగ్గనున్న సీట్లు..
ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్‌–డి (పీబీ), ఎం.ఆర్క్, ఎంప్లానింగ్‌లో ఈసారి సీట్లు భారీగా తగ్గే అవకాశం ఉంది. గతేడాది 291 కాలేజీల్లో 22,042 సీట్లు ఉండగా, సగం మంది విద్యార్థులు కాలేజీల్లో చేరారు. దీంతో ఈసారి కొన్ని కాలేజీలు పలు కోర్సులను రద్దు చేసుకున్నాయి. లోపాల కారణంగా మరికొన్ని కాలేజీల్లో సీట్లు రద్దు కాను న్నాయి. మొత్తంగా ఈసారి 15 వేల వరకు సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గతేడాది కన్వీనర్‌ కోటాలో 15,430 సీట్లు ఉండగా ఈసారి 10 వేల సీట్లున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement