
రేషన్ డీలర్ల సమావేశం రసాభాస
రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది.
రెండు గ్రూపులుగా
విడిపోయి వాదులాట
గొడవ కారణంగా
సమావేశానికి రాని మంత్రి ఈటల
మధ్యలోనే వెళ్లిపోయిన
అధికారులు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. డీలర్ల సంఘం నేతలు రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పర దూషణలు, వాదులాటకు దిగడంతో సమావేశం అర్ధాంతరంగా రద్దైంది. రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖను పునర్వ్యవస్థీకరించేందుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం సరకుల సరఫరా, పంపిణీ తదితర అంశాల్లో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తోంది. ప్రక్షాళనలో కీలక భాగస్వాములైన డీలర్లతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ ఆశయాలను వారికి వివరించడంతో పాటు, అపరిషృ్కతంగా ఉన్న డీలర్ల సమస్యలను పరిష్కరించాలని భావించింది.
దీనిలో భాగంగానే బుధవారం లక్డీకాపూల్లోని ఫ్యాఫ్సీ భవన్లో వారితో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి జిల్లాల నుంచి 500 మంది వరకు హాజరయ్యారు. సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్ రాకముందే సభా వేదికపైకి నేతలను పిలిచే క్రమంలో గొడవ రేగింది. అసలు డీలరే కానీ వ్యక్తి సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా ఎలా ఉంటాడని ప్రస్తుత అధ్యక్షుడు నాయకోటి రాజును ఉద్దేశించి ఓ వర్గం డీలర్లు గొడవకు దిగారు.
ఏరోజూ డీలర్ల సంక్షేమం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో రాష్ట్ర అధ్యక్షుడి వర్గం ప్రతిదాడికి దిగింది. ఏడు జిల్లాల డీలర్లంతా కలిసి రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకున్నారంటూ ఎదురుదాడికి దిగింది. కొందరు విషపురుగులు వచ్చి సమావేశాన్ని చెడగొట్టే యత్నాలు చేస్తున్నారని, గతంలోనూ ఇదేమాదిరి వ్యవహరించారని ఆరోపణలు చేసింది. దీంతో సమావేశంలో ఘర్షణ వాతావరణ చోటుచేసుకుంది. రెండు వర్గాలు పరస్పర దూషణలు, వాదులాటకు దిగడంతో సమావేశానికి వచ్చిన అధికారులు బయటకు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మంత్రి ఈటల సమావేశానికి రాలేనని సమాచారం పంపారు. చాలాసేపు వేచి చూసిన అధికారులు గొడవ సద్దుమణగకపోవడంతోఅక్కడినుంచి వెళ్లిపోయారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి అందరినీ శాంతపరిచే యత్నం చేశారు.
మంత్రిని కలసి వివరణ..
కాగా సమావేశం రద్దైన అనంతరం డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు, మంత్రి ఈటలను మినిస్టర్స్ క్వార్టర్స్లో కలసి గొడవపై వివరణ ఇచ్చారు. కావాలనే ఒకరిద్దరు డీలర్లు ఇదంతా చేశారని మంత్రి దృష్టికి తెచ్చారు. గొడవను పట్టించుకోకుండా డీలర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని, కమీషన్ పెంచే విషయమై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.