కూటమి.. ఓటమే

Congress Leaders Join TRS Rangareddy - Sakshi

యాలాల: మహాకూటమికి జనాదరణ లేదని, ఎన్ని పార్టీలు ఏకమై వచ్చినా.. ఓటమి చవిచూడటం తప్ప వారు చేసేదేమీ లేదని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం లక్ష్మీనారాయణపూర్‌ నుంచి చేపట్టిన బైక్‌ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు. ప్రజల్లో తమకు పెరుగుతున్న మద్దతు చూసి ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, వీరికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని వెల్లడించారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా పథకాలు అన్నివర్గాల ప్రజలకు వరంగా నిలిచాయని స్పష్టంచేశారు.

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే పెట్టుబడి సాయాన్ని రూ.5 వేలకు పెంచుతామని, ఆసరా పింఛన్లు రెండింతలు చేస్తామని, దివ్యాంగులకు రూ.3 వేల పెన్షన్‌ ఇస్తామని, సొంత స్థలం ఉన్నవారందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు చెబుతున్న కల్లబొల్లి మాటలను పట్టించుకోవద్దని సూచించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ సారథ్యంలో చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేస్తామని ప్రకటించారు. పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని చెప్పారు.
 
భారీ మెజార్టీతో గెలిపిస్తాం.. 
అనంతరం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కరణం పురుషోత్తంరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సిద్రాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించే నాయకుడిగా పేరున్న మంత్రి మహేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో వచ్చి హడావుడి చేసే నాయకులను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్‌ నాయ కులు చేస్తున్న విషప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాయన్నగౌడ్, రైతు సమితి మండల కన్వీనర్‌ సురేందర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వడ్డే రాములు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శంకర్, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ సిద్దారెడ్డి, మాజీ వైఎస్‌ చైర్మన్‌ అనంతయ్య, మాజీ సర్పంచ్‌లు శివకుమార్, వెంకటయ్య, బిచ్చన్నగౌడ్, సీనియర్‌ నాయకులు పగిడియాల మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి..  
తాండూరు: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అన్ని కులాలకు సముచిత స్థానం లభించిందని మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. వికారాబాద్‌ జిల్లా హోలియ దాసరి సంఘం అధ్యక్షుడు, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ దాసరి వెంకటయ్యతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. పెద్దేముల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు, వివిధ పార్టీల కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరు తున్నారని తెలిపారు. అనంతరం విశ్రాంత ఉద్యోగి నరేందర్‌రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి తనతో కలిసి రావాలని ఆయనను కోరారు.  పార్టీ నాయకులు కోహిర్‌ శ్రీనివాస్, కిషన్‌రావు, విష్ణువర్ధన్‌రెడ్డి, రమేష్‌కుమార్, కృష్ణయ్యగౌడ్, ఎర్ర బాలప్ప, రవీందర్, ఆజంఖాన్, విఠల్, ప్రసాద్, రఘు  ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top