మంద కృష్ణపై గవర్నర్‌కు టీఎస్‌ఎంఆర్‌పీఎస్‌ ఫిర్యాదు  | Complaint to the governor on Manda Krishna | Sakshi
Sakshi News home page

మంద కృష్ణపై గవర్నర్‌కు టీఎస్‌ఎంఆర్‌పీఎస్‌ ఫిర్యాదు 

Dec 20 2017 3:06 AM | Updated on Oct 8 2018 3:00 PM

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభలను అడ్డుకుంటామని, ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను రానీయబోమని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించడం భారత జాతి గౌరవాన్ని కించపర్చడంగా భావిస్తున్నామని తెలంగాణ స్టేట్‌ ఎంఆర్‌పీఎస్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు మంద కృష్ణపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కోరారు. తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

టీఎస్‌ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్‌ మాదిగ, జాతీయ అధ్యక్షుడు సుంకపాక దేవయ్య మాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి పాపయ్య మాదిగ, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ఎస్సీ వర్గీకరణపై చట్టబద్ధత   కల్పించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. కుల వృత్తిపై ఆధారపడి జీవించే మాదిగలకు నెలకు రూ.2000 చొప్పున పెన్షన్‌ ఇప్పించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement