‘కామన్‌ సర్వీస్‌ రూల్స్‌ ఏర్పాటు చేయాలి’ 

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో పనిచేస్తున్న 50 వేల మంది లెక్చరర్లకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పిం చి, కామన్‌ సర్వీస్‌ రూల్స్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల టీచర్స్‌ అసోసియేషన్‌ జేఏసీ డిమాండ్‌ చేసింది. ఆదివారం బషీర్‌బాగ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఇంజనీరింగ్‌ లెక్చరర్స్‌కు కళాశాలల యజమాన్యాలు అతి తక్కువ వేతనాలు చెల్లించి తమ శ్రమను దోపిడీ చేస్తున్నాయన్నారు.

ఏఐసీటీఈ ప్రకారం పర్మినెంట్‌ లెక్చరర్స్‌తో సమానంగా వేతనాలను చెల్లించాలని అన్నారు. యాజమాన్యాలు విద్యార్థుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తూ.. తమకు మాత్రం జీతాల విషయంలో అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. ఇలా చేస్తున్న కళాశాల యాజమాన్యాలపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే టీచర్స్‌ వెల్ఫేర్‌ బోర్డును ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో జేఎన్‌టీయూ నిర్వహించిన పరీక్షల వాల్యుయేషన్‌ను నిలిపివేస్తామని హెచ్చరించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top