
ఎక్కువ ర్యాంకులొచ్చినా మొదటి విడతలోనే సీట్లు..
జోసా తొలి రౌండ్ సీట్ల కేటాయింపు
జాతీయ కాలేజీల్లో 62 వేలకుపైగా సీట్లు భర్తీ
కౌన్సెలింగ్లో పాల్గొన్న 127 విద్యా సంస్థలు
టాపర్లంతా ముంబై ఐఐటీ వైపే
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో తొలి దశ సీట్ల కేటాయింపును జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) శనివారం వెల్లడించింది. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు సహా జాతీయ ఇంజనీరింగ్ (ఎన్ఐటీలు), ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు (జీఎఫ్టీఐలు) మొత్తం 127 సంస్థలు ఈ కౌన్సెలింగ్లో పాల్గొన్నాయి. వీటి పరిధిలో 62,854 సీట్లు ఉన్నాయి.
ఈ ఏడాది మొత్తం ఆరు దశల్లో కౌన్సెలింగ్ చేపట్టాలని జోసా ఈ ఏడాది నిర్ణయించింది. తొలి దశ కౌన్సెలింగ్లో ఐఐటీల్లో 18,160 సీట్లను భర్తీ చేశారు. సామాజిక కేటగిరీల వారీగా సీట్ల కేటాయింపు జరిగినట్టు జోసా వెల్లడించింది. జాతీయస్థాయి టాప్ ర్యాంకర్లంతా ఐఐటీ బాంబేలోనే సీట్లు పొందారు. అందులోనూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సులకు అన్ని ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రధానంగా ఆప్షన్లు ఇచ్చారు.
మారిన ట్రెండ్
గతంతో పోలిస్తే ఈసారి జోసా కౌన్సెలింగ్ భిన్నంగా కన్పిస్తోంది. ఎక్కువ ర్యాంకులు వచ్చినవారికి కూడా తొలి దశలోనే సీట్లు వచ్చాయి. గత ఏడాది ఆఖరి రౌండ్లో కూడా ఐఐటీల్లో జనరల్ కేటగిరీలో కటాఫ్ (బాలుర విభాగం) 6,375 దాటలేదు. ఈసారి తొలి రౌండ్లోనే 6,242 ర్యాంకు విద్యార్థికి కూడా సీటు వచ్చింది. తాజా కౌన్సెలింగ్ను గమనిస్తే జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలపై విద్యార్థులకు ఆసక్తి తగ్గుతున్నట్టు కన్పిస్తోంది.
కోవిడ్ తర్వాత జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్కు విద్యార్థులు సీరియస్గా సన్నద్ధమవ్వడం లేదని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు రాష్ట్రాల్లో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, అటానమస్ సంస్థలు, ప్రైవేటు వర్సిటీలు పెరుగుతున్నాయి. దీంతో విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీల కోసం పోటీ పడటానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కూడా కఠినంగా ఉంటోందని విద్యార్థులు భావిస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే ఐఐటీల నాణ్యత ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మంచి ర్యాంకు రాకున్నా... ఆఖరివరకూ నిరీక్షించాలి
మంచి ర్యాంకు రాకున్నా ఈసారి ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లు వచ్చే అవకాశం కన్పిస్తోంది. ఎందుకంటే పోటీ తక్కువగానే కన్పిస్తోంది. వేలల్లో ర్యాంకులు ఉన్న వారికి ఈసారి సీట్లు వచ్చే వీలుందని భావించాలి. బ్రాంచీ, సంస్థ విషయంలో కొంత ఆలోచించి అడుగేయాలి. – ఎంఎన్ రావు (జేఈఈ అధ్యాపకులు)