
ఇయ్యాల వచ్చి.. రేపు వెళ్తారు..
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మరోసారి జిల్లాకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం
ఆరోసారి జిల్లాకు సీఎం కేసీఆర్
తిమ్మాపూర్, జనగామలో హరితహారం సభలు
హెచ్పీఎస్కు మడికొండలో శంకుస్థాపన
వరంగల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మరోసారి జిల్లాకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ జిల్లాలో గురు, శుక్రవారాల్లో పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లా పర్యటన పూర్తి చేసుకుని గురువారం రాత్రి హన్మకొండకు వస్తారు. మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో బస చేస్తారు. శుక్రవారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు. హరితహారం కార్యక్రమంలో రోజంతా బిజీబిజీగా గడపనున్నారు. ఏళ్లుగా ప్రారంభానికి నోచుకోకుండా ఉన్న రీజిన్ సైన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. వర్ధన్నపేట, జనగామ నియోజకవర్గాల్లో హరితహారం బహిరంగ సభల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీసులు బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యూరు. గతేడాది జూన్ 2న ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్.. ఇప్పటి వరకు ఐదుసార్లు జిల్లాకు వచ్చారు. తాజాగా మరోసారి జిల్లాకు వస్తున్నారు. వరంగల్ లోక్సభకు ఉప ఎన్నికల రానున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ అంశంపైనా జిల్లా నాయకుల అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
గురువారం రాత్రి 7 గంటలకు.. మరిపెడ మీదుగా రోడ్డు మార్గంలో హన్మకొండలోని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి చేరుకుని బస చేస్తారు.శుక్రవారం ఉదయం 10 గంటలకు.. లక్ష్మీకాంతారావు ఇంటి నుంచి బయలుదేరి వరంగల్ ప్రెస్క్లబ్కు చేరుకుంటారు. అక్కడ హరితహారంలో పాల్గొని పుష్కరదర్శిని పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.10.15 గంటలకు.. ప్రెస్క్లబ్ నుంచి బయలుదేరి వర్ధన్నపేట నియోజకవర్గం తిమ్మాపూర్లోని బెస్తంచెరువు వద్ద చేపట్టిన హరితహారం స్మృతివనం పనులకు శంకుస్థాపన చేస్తారు. మొక్కలు నాటుతారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 11.15 గంటలకు.. బెస్తంచెరువు నుంచి బయలుదేరి హంటర్రోడ్డులోని రీజినల్ సైన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. అక్కడ మొక్కలు నాటుతారు.
11.30 గంటలకు రీజినల్ సైన్స్ సెంటర్ నుంచి బయలుదేరి 11.40 గంటలకు వడ్డెపల్లి చెరువు వద్దకు చేరుకుంటారు. అక్కడ హరితహారంలో పాల్గొంటారు. 11.50 గంటలకు.. వడ్డెపల్లి చెరువు నుంచి బయలుదేరి 12.05 గంటలకు ధర్మసాగర్లోని పోలీసు శిక్షణ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ హరితహారంలో పాల్గొంటారు.12.15 గంటలకు.. పోలీస్ శిక్షణ కేంద్రం నుంచి బయలుదేరి 12.30 గంటలకు మడికొండలోని పారిశ్రామిక ప్రాంతంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.12.40 గంటలకు.. మడికొండ నుంచి బయలుదేరి 1.20 గంటలకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి ఇంటికి చేరుకుంటారు. అక్కడే భోజనం చేస్తారు.
2.22 గంటలకు జనగామలోని బతుకమ్మ కుంట వద్దకు చేరుకుని హరితహారంలో పాల్గొంటారు. 2.35 నుంచి 3.15 వరకు బతుకమ్మ కుంట వద్ద జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. బతుకమ్మ కుంట నుంచి 3.20 బయలుదేరి సూర్యాపేట రోడ్డు ఆర్టీసీ కాలనీలో ఏర్పాటు చేసిన హెలిపాడ్కు చేరుకుని హెలికాప్టర్లో హైదరాబాద్కు వెళ్తారు.