ఛత్తీస్గఢ్ కూలీలకు విముక్తి
ఇటుక బట్టీలపై అధికారుల దాడులు
పిల్లలతో సహా 177 మందిని వారి రాష్ట్రానికి తరలింపు
ఇబ్రహీంపట్నం రూరల్: ఇటుక బట్టీల్లో వెట్టిచాకిరీ చేస్తున్న కూలీలకు అధికారులు విముక్తి కల్పించారు. బట్టీల్లో కూలీలను వేధింపులకు గురిచేస్తున్నారని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా అధికారులు స్పందించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేశ్కుమార్ను అప్రమత్తం చేశారు. కలెక్టర్ ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి మహేశ్వరం, ఇబ్రహీంపట్నం మండలాల్లో పనిచేస్తున్న ఛత్తీస్గఢ్ కూలీలను గుర్తించారు.
ఈ నెల 24, 25ల్లో దాడులు నిర్వహించారు. మహేశ్వరంలోని రావిర్యాల, కొంగరఖుర్దూ, ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్, ఆదిభట్ల, ఎల్మినేడు, చర్లపటేల్గూడల్లో పనిచేస్తున్న ఛత్తీస్గఢ్కు చెందిన 140 మంది పెద్దలు, 37 మంది చిన్నారులను అధికారుల సమక్షంలో వారి రాష్ట్రానికి పంపించారు.