బంపర్ ఆఫర్ పేరుతో..

బంపర్ ఆఫర్ పేరుతో..


రూ. లక్షలు వసూలు చేసి ఉడాయించిన ముఠా

లబోదిబోమంటున్న బాధితులు


 

 భువనగిరి : ప్రజల అమాయకత్వాన్ని, ఆశను ఆసరా చేసుకుని బంపర్ ఆఫర్‌ల పేరుతో రూ.లక్షలు వసూలు చేసి ఉడాయించిన ఓ ముఠా ఉదంతం గురువారం భువనగిరిలో వెలుగు చూసింది. జిల్లాతో పాటు ,రంగారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో ఆటోల ద్వారా హోంనీడ్స్ పేరిట మోసపోయిన వారంతా భువనగిరికి చేరుకుని లబోదిబోమంటున్నారు. వివ రాలు.. 20 రోజుల క్రితం నలుగురు యువకులు శ్రీ ఆంజనేయ మార్కెటింగ్ పేరుతో పోచమ్మవాడలో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. రంగు రంగుల బ్రోచర్లు తయారు చేసి ఆటోల్లో గ్రామాలకు చేరుకున్నారు. బ్రోచర్లలో స్క్రాచ్ కార్డులను పొందుపరిచారు. ఒక్కో కార్డు రూ.100కు విక్రయించారు.



కార్డును స్క్రాచ్ చేయగ అందులో ఆర్డినరి కంపెనీలకు చెందిన  రైస్ కుక్కర్ , మిక్సి, టేబుల్‌ఫ్యాన్, డీవీడీ, హోం థియేటర్, మిక్సర్‌గ్రైండర్‌లు బహుమతులుగా వచ్చాయి. మందుగానే ఒక్కొక్కరి వద్ద రూ.1900 వసూలు చేసి వీటిలో కేవలం 500 లోపు విలువ గల వస్తువులను ఇచ్చారు. ఈనెల 10 తేదీన భువనగిరిలో బంపర్ డ్రా తీయడం జరుగుతుందని చెప్పారు. బంపర్ డ్రాలో రిఫ్రిజిరేటర్, ఎల్‌సీడీ, 10 గ్రాముల బంగారం, ల్యాప్‌ట్యాప్, వాషింగ్ మెషీన్‌లభిస్తాయని చెప్పడంతో పెద్ద ఎత్తున వారివద్ద స్క్రాచ్ కార్డులు కొన్నారు. ఇలా మోసగాళ్లు యాదగిరిగుట్ట, యాదగిరిపల్లి, మోత్కూరు, ఆత్మకూర్, వడాయిగూడెం, ముగ్దుంపల్లి, కొండమడుగు, మాదాపురం, అవుషాపురం, వలిగొండ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున స్క్రాచ్ కార్డులు విక్రయించి రూ.లక్షలు దండుకున్నారు.



అయితే తమకు స్క్రాచ్ కార్డులో వచ్చిన ఫ్యాన్‌లు ఇవ్వకుండా కేవలం రైస్‌కుక్కర్‌ను మాత్రమే ఇచ్చిన వారు మిగతా వస్తువులతో పాటు బంపర్ ఫ్రైజ్ కూడా ఇస్తామని చెప్పిన ప్రకారం వివిధ గ్రామాల నుంచి కార్డులు తీసుకువచ్చారు. తీరా ఇక్కడి వచ్చి చూస్తే మోసగాళ్లు ఇంటికి తాళం వేసి ఎప్పుడో ఉడాయించారు. దీంతో తాముమోసపోయామని ఆగ్రహించిన వారంత తీవ్ర దూషణలకు దిగారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమకు జరిగిన మోసాన్ని వివరించి న్యాయం చేయాలని పోలీస్‌లను కోరారు.

 

 10వ తేదీ రమ్మన్నారు

 ఆగస్టులో మాయింటికి వచ్చారు. బంపర్ ఆఫర్ ఉందని చెప్పి రూ.1900  తీసుకుని స్క్రాచ్ కార్డు ఇచ్చారు. అందులో ఫ్యాన్ వచ్చింది.కానీ రూ. 400ల కుక్కర్ ఇచ్చారు. ఇదేమిటని అడిగితే 10వ తేదీ భువనగిరిలో బంపర్ డ్రా తీస్తారు. ఆ రోజు అక్కడివస్తే ఫ్యాన్ లేదా మిగిలిన 1500లు ఇస్తామని నమ్మబలికారు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరూ లేరు. తనలాంటి వారెందరో మోసపోయారు.

 - మారగోని మల్లయ్య, వలిగొండ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top