ఊరూరా ఇంటర్నెట్ | BSNL Internet to be spread all over villages | Sakshi
Sakshi News home page

ఊరూరా ఇంటర్నెట్

Jul 8 2015 12:17 AM | Updated on Sep 3 2017 5:04 AM

ఊరూరా ఇంటర్‌నెట్ ఏర్పాటు చేసేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ నడుం బిగించింది.

* బీఎస్‌ఎన్‌ఎల్ ఏపీ సర్కిల్ సీజీఎం మురళీధర్
సాక్షి, హైదరాబాద్: ఊరూరా ఇంటర్‌నెట్ ఏర్పాటు చేసేందుకు  బీఎస్‌ఎన్‌ఎల్ నడుం బిగించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 21,265 గ్రామాలను హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. తెలంగాణలోని  నిజామాబాద్ జిల్లా మక్లూర్ బీఎస్‌ఎన్‌ఎల్ బ్లాక్ పరిధిలో 5 గ్రామ పంచాయతీలకు, ఏపీలోని పరవాడ బ్లాక్ పరిధిలో హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్‌ను అందిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్ మిగతా పంచాయతీల కోసం ప్రత్యేకంగా ఆప్టికల్ ఫైబర్ లైన్లను ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించిన వివరాలను బీఎస్‌ఎన్‌ఎల్ ఏపీ సర్కిల్ సీజీఎం మురళీధర్ మంగళవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. కేంద్రం ప్రతిపాదించిన డిజిటల్ ఇండియాలో భాగంగా తెలంగాణ పరిధిలో 8,779 పంచాయతీలు, ఏపీ పరిధిలో 12,876 పంచాయతీలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కలగనుందని తెలిపారు.
 
ల్యాండ్‌లైన్ వ్యవస్థను ఆధునికీకరించేందుకు చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. అలాగే, రెండు రాష్ట్రాల్లో రూ.198 కోట్లతో కొత్త ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వివరించారు. 3 జీ టవర్లను 1,450కు పెంచనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 79  పర్యాటక ప్రాంతాల్లో 5జీ వైఫ్ సేవలు అందుబాటులో ఉంచామన్నారు. వీటిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి వైఫై హాట్‌స్పాట్‌లుగా మరో 93 ప్రాంతాలను గుర్తిం చామన్నారు. కాగా, అమూల్య పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించిన్నట్లు వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా ఏ  నెట్‌వర్క్‌కైనా లోకల్/ఎస్టీడీల కాల్ రేటు సెకనుకు ఒక పైసాగా ఉంటుందని, రాత్రి 9 నుంచి ఉదయం ఏడు వరకు నిమిషానికి 20 పైసలుగా ఉంటుందని చెప్పారు. అలాగే, రూ.200 పైబడిన విలువైన టాప్ అప్ ఓచర్లకు ఫుల్ టాక్‌టైం ఇస్తామని ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement