73 రోజులుగా ఇంటర్నెట్ బంద్..
2.6 బిలియన్ డాలర్ల నష్టం
టెహ్రాన్: యుద్ధం మిగిల్చిన గాయం ఒకవైపు.. డిజిటల్ దిగ్బంధనం చేస్తున్న విధ్వంసం మరోవైపు! ఇరాన్లో గత 73 రోజులుగా కొనసాగుతున్న ఇంటర్నెట్ బ్లాక్అవుట్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని స్థితికి నెట్టివేస్తోంది. క్షిపణుల మోత కంటే భయంకరంగా ఈ 'డిజిటల్ సీజ్' సామాన్యుల ఉపాధిని బలితీసుకుంటోంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇరాన్ ప్రైవేట్ రంగాన్ని ఈ సుదీర్ఘ ఇంటర్నెట్ నిషేధం శ్మశానవాటికగా మారుస్తోంది.
నిశ్శబ్ద భూకంపం
అంతర్జాతీయ ఇంటర్నెట్ వాచ్డాగ్ 'నెట్ బ్లాక్స్' (NetBlocks) తాజా నివేదిక ప్రకారం, ఆధునిక సమాజంలో ఇంత సుదీర్ఘకాలం జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ నిలిపివేయడం ఇదే ప్రథమం. ఇప్పటివరకు సుమారు 2.6 బిలియన్ డాలర్ల (రూ. 21,000 కోట్లకు పైగా) ఆర్థిక నష్టం వాటిల్లింది. నేరుగా 10 లక్షల మంది, పరోక్షంగా మరో 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రతిరోజూ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 80 మిలియన్ డాలర్ల మేర నష్టపోతోంది. ఆన్లైన్ మార్కెటింగ్ ఛానెళ్లు 90% వరకు మూతపడ్డాయి.
కుప్పకూలిన డిజిటల్ సామ్రాజ్యం
ఒకప్పుడు ఇరాన్ గర్వకారణంగా చెప్పుకునే 'డిజిటల్ ఎకానమీ' ఇప్పుడు ఆవిరవుతోంది. ఇరాన్ అమెజాన్గా పిలిచే 'డిజికాలా' వందలాది మందిని తొలగించగా, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ 'కామ్వా' తన సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. "రెండు యుద్ధాలు, నెలల తరబడి ఇంటర్నెట్ బంద్ తర్వాత మేము నిలబడలేకపోతున్నాం" అని సంస్థ వ్యవస్థాపకులు ఆవేదన వ్యక్తం చేశారు.
పారిశ్రామిక రంగానికి పక్షవాతం
సాంకేతిక రంగమే కాకుండా, పెట్రోకెమికల్, ఉక్కు, వస్త్ర పరిశ్రమలు సైతం కుదేలయ్యాయి. సరఫరా గొలుసు (Supply Chain) విచ్ఛిన్నం కావడంతో ముడి పదార్థాల దిగుమతి నిలిచిపోయింది. ఒక్క పశ్చిమ ఇరాన్ ఫ్యాక్టరీలోనే 700 మంది కార్మికులను ఇంటికి పంపించేశారు. దాదాపు 35 లక్షల మంది కార్మికుల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడిందని పారిశ్రామిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
తప్పని తిప్పలు.. తెగనమ్ముకుంటున్న ఆస్తులు
మధ్యతరగతి ఇరానియన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఉద్యోగాలు ఊడిపోవడంతో కనీస అవసరాల కోసం కార్లు, బంగారు ఆభరణాలను అమ్ముకుంటున్నట్లు బాధితులు వాపోతున్నారు. టెహ్రాన్కు చెందిన బాబాక్ అనే ప్రొడక్ట్ డిజైనర్ మాటల్లో చెప్పాలంటే.. "జీవితాంతం కష్టపడి నేర్చుకుని ఎదిగాను, కానీ ఇప్పుడు నా కళ్లముందే భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తోంది."
రాజకీయ చదరంగం.. ఆర్థిక బలి
ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విఫలం కావాలని అమెరికా భావిస్తుండగా, ప్రభుత్వం మాత్రం లొంగే ప్రసక్తే లేదని మొండికేస్తోంది. కానీ, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడం, కరెన్సీ విలువ పాతాళానికి పడిపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది. విదేశీ ప్లాట్ఫారమ్లు బంద్ కావడంతో ప్రజలను బలవంతంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండే దేశీయ యాప్ల వైపు మళ్లిస్తున్నారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగకరమని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, ఇరాన్లో క్షిపణి దాడుల కన్నా 'డిజిటల్ ముట్టడి' వల్ల కలిగే నష్టం దీర్ఘకాలికంగా ఆ దేశ వెన్నుముకను విరిచేలా కనిపిస్తోంది.


