బీజేపీ సీనియర్‌నేత కన్నుమూత | BJP Senior leader passes away in Garidepalli | Sakshi
Sakshi News home page

బీజేపీ సీనియర్‌నేత కన్నుమూత

Jul 17 2014 1:28 AM | Updated on Mar 29 2019 9:24 PM

బీజేపీ సీనియర్‌నేత  కన్నుమూత - Sakshi

బీజేపీ సీనియర్‌నేత కన్నుమూత

బీజేపీ సీనియర్‌నేత రామినేని ప్రభాకర్(62) బుధవారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా గొంతు సంబంధిత కేన్సర్‌తో బాధపడుతున్న

 సూర్యాపేట/ గరిడేపల్లి :బీజేపీ సీనియర్‌నేత రామినేని ప్రభాకర్(62) బుధవారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా గొంతు సంబంధిత కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సౌమ్య ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.  గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మర్రికుంటకు చెందిన ప్రభాకర్  గడ్డిపల్లి గ్రామ సర్పంచ్‌గా 1981,1988,1990 సంవత్సరాలలో మూడు సార్లు గెలిచి 25 సంవత్సరాల పాటు పనిచేశారు. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి జిల్లా ఉపాధ్యక్షుడిగా, జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పలు పదవుల్లో కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు.
 
 1996లో మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఆయనను పంచాయతీరాజ్ విభాగంలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియమించింది. 2009లో సూర్యాపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రామినేనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రామినేని మృతదేహాన్ని మొదట సూర్యాపేటకు ఆతరువాత మర్రికుంటకు తీసుకెళ్లారు. అంత్యక్రియలు స్వగ్రామంలో గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు తెలిపారు.
 
 నేడు ప్రముఖుల రాక
 మర్రికుంటలో గురువారం జరగనున్న అంత్యక్రియలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. కిషన్‌రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు బండారు దత్తాత్రేయ, పార్టీ నేతలు ఇంద్రసేనారెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు.
 
 రామినేని మృతి పార్టీకి తీరనిలోటు
 సూర్యాపేట మున్సిపాలిటీ : బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు రామినేని ప్రభాకర్ మృతి పార్టీకి తీరనిలోటని బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు, గోలి మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం రామినేని ప్రభాకర్ భౌతికకాయానికి సూర్యాపేటలోని ఆయన నివాసంలో రాష్ట్ర , పట్టణ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. నీతికి, నిజాయితీకి మారుపేరు ప్రభాకర్ అని కొనియాడారు.  సంతాపం తెలిపిన వారిలో మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్, గోదల రంగారెడ్డి, కొణతం సత్యనారాయణరెడ్డి, రంగరాజు రుక్మారావు, సంపత్‌కుమార్, బండపల్లి పాండురంగాచారి, చలమల్ల నర్సింహ, టీయూపీఎస్ రాష్ట్ర నాయకుడు శేషగాని శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మణ్‌రావు, అప్పారావు, సారగండ్ల మాణిక్యమ్మ, బాణాల విజయ్‌కుమార్, ఏడుకొండల్, జీడి భిక్షం, బెరైడ్డి సంజీవరెడ్డి, గజ్జల వెంకటరెడ్డి, కోతి మాధవి, అన్నెపర్తి రాణి, అబీద్, శ్రీనివాస్, కత్తి వెంకన్న  ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement