చెన్నై: తమిళనాడు 17వ శాసనసభ సభాపతి (స్పీకర్)గా టీవీకే సీనియర్ నాయకుడు జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో సీఎం విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. స్పీకర్ పదవికి ప్రభాకర్ మే 11న నామినేషన్ దాఖలు చేయగా.. ఇతర పార్టీల నుంచి ఎవరూ పోటీ పడకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
కాగా, జేసీడీ. ప్రభాకర్కు శాసనసభ నిబంధనలు, సంప్రదాయాలపై అపారమైన అనుభవం ఉంది. 2011లో విల్లివాక్కం నుండి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్గా మారింది. అన్నాడీఎంకేలో సీనియర్ నేతగా ఇది వరకు ఉన్న జేసీడీ ప్రభాకర్ ప్రస్తుతం టీవీకే తరపున థౌజండ్ లైట్స్ నుంచి గెలిచారు. సీఎం విజయ్ నేతృత్వంలోని అధికార తమిళగ వెట్రి కళగం తరపున సీనియర్ నాయకుడు, థౌజండ్ లైట్స్ ఎమ్మెల్యే జే.సీ.డీ. ప్రభాకర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. సీఎం విజయ్, మంత్రులతో కలిసి ఆయన ఈ నామినేషన్ను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ఇవాళ ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


