‘లాక్‌’ మీకు.. దొడ్డిదారి మాకు..! | Alcohol Sales in Black market Suryapet | Sakshi
Sakshi News home page

‘లాక్‌’ మీకు.. దొడ్డిదారి మాకు..!

Apr 16 2020 1:07 PM | Updated on Apr 16 2020 3:17 PM

Alcohol Sales in Black market Suryapet - Sakshi

హుజూర్‌నగర్‌ : ఇటీవల బైక్‌తో సహా అధికారులు పట్టుకున్న బీర్ల కాటన్‌ (ఫైల్‌)

సాక్షిప్రతినిధి, సూర్యాపేట : వేసిన తాళం, సీల్‌ వేసినట్లే ఉంటున్నాయి.. కానీ దుకాణంలో మద్యం మాత్రం మాయమవుతోంది. దొడ్డిదారిన బెల్టు షా పులు, మందు బాబులకు మద్యం చేరుతోంది. లాక్‌డౌన్‌ ఉన్నా ఈ దందా జిల్లాలో గుట్టుచప్పుడు కా కుండా సాగుతోంది.‘లాక్‌’ మీకు.. దొడిదారి మాకు’ అన్నట్లుగా కొందరు మద్యం వ్యాపారులు వ్యవహరి స్తున్నారు. ఒక్కో బాటిల్‌పై ఎమ్మార్పీ కన్నా మూడు రెట్ల వరకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. వాహన తని ఖీల్లో మద్యం పట్టుబడుతుండడంతో ‘లాక్‌’ నిబంధనలను పట్టించుకోవడం లేదని స్పష్టమవుతోంది.

సీల్‌ ఉన్నా..
జిల్లాలో 75 మద్యం దుకాణాలు, 16బార్లు ఉన్నా యి. గత నెల 22న జనతా కర్ఫ్యూ నుంచి వీటికి మూత పడింది.ఎక్త్సెజ్‌ అధికారులు దగ్గరుండి వీటికి సీల్‌ వేశారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు తెరవద్దని ఆయా యజమానులను ఆదేశించారు. అయితే గత నెల 31వరకు రాష్ట్ర ప్రభుత్వం తొలుత లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14 వరకు, అనంతరం వచ్చే నెల 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. వరుసగా ఇన్ని రోజు లు లాక్‌డౌన్‌ ఉంటుందని మద్యం వ్యాపారులు ఊహించలేదు. లాక్‌డౌన్‌లోనూ సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు దొడ్డిదారి దందాకు తెరతీసినట్లు సమాచారం. సీల్‌ వేసిన ఉన్నా దుకాణా నికి వెనక నుంచి ఉన్న డోర్‌తో రాత్రికి రాత్రే మద్యం తీసి దూర ప్రాంతాల్లో తమకు తెలిసిన బెల్టు షాపులు, బంధువుల ఇళ్లకు తరలించారు. ముందు సీల్‌ ఉన్నా వెనక నుంచి మద్యం తరలించినా సంబంధిత శాఖ అధికారులు మాత్రం పసిగట్ట లేదు.

మూడు రెట్లు ఎక్కువ ధర..
ఇలా దుకాణం నుంచి బయటికి తీసిన మద్యాన్ని వ్యాపారులు ఎమ్మార్పీ కన్నా మూడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. పట్టణాల్లో ఈ దందా జోరుగా జరుగుతోంది. లాక్‌డౌన్‌ ఎత్తితేనే దుకాణాలు తెరవనుండడంతో మద్యం ప్రియులు కూడా ఎంత ధర పెట్టయినా మద్యం కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు, పట్టణాల్లో పలువురు వ్యక్తులు మద్యం అమ్ముతుండడం తనిఖీల్లో బయట పడింది. గత నెల 22నుంచి ఇప్పటి వరకు జిల్లాలో మద్యం తరలిస్తూ పట్టుబడిన కేసులు 34 నమోదయ్యాయి. 740 క్వార్టర్‌ బాటిల్స్, 40 హాఫ్‌ బాటిల్స్, 258 బీర్‌ బాటిల్స్‌ సీజ్‌ చేశారు. వాహన తనిఖీల్లో మద్యం పట్టుబడుతుండడంతో పోలీసుల కళ్లు గప్పి భారీ స్థాయిలోనే మద్యం దందా కొనసాగుతుందని సమాచారం.

డబుల్‌ ‘లాక్‌’..
వాహన తనిఖీల్లో మద్యం పట్టుబడుతుండడంతో దుకాణాలపై పోలీసు, ఎక్సైజ్‌æ శాఖ అధికారులు నిఘా పెట్టారు. లాక్‌డౌన్‌ ప్రారంభంలో దుకాణ యజమాని వేసిన తాళానికి ఎక్త్సెజ్‌ శాఖ సీల్‌ వేసింది. మద్యం దందాకు చెక్‌ పెట్టేందుకు రెండు రోజుల క్రితం దుకాణ యజమాని వేసిన తాళంతో పాటు ఎక్సైజ్‌ శాఖ కూడా మరో తాళం వేసి.. సీల్‌ వేసింది. డబుల్‌ లాక్‌తో దందాకు అడ్డుకట్ట వేసినట్లేనని ఆయా అధికారులు భావిస్తున్నా.. జిల్లాలో మారుమూలన ఉన్న మండలాల్లోని దుకాణాల నుంచి ఇప్పటికే చాలా వరకు మద్యం తరలించినట్లు ఆరోపణలున్నాయి. సంబంధిత అధికారులు ఇటీవల రెండు, మూడు దుకాణాలు తనిఖీ చేయడంతో స్టాక్‌లో స్వల్పంగా మార్పులు కనిపించినట్లు తెలిసింది. లాక్‌డౌన్‌ ఎత్తిన తర్వాత దుకాణాల్లో ఉన్న స్టాక్‌ చెక్‌ చేసి, ఎక్కడైనా తక్కువ ఉంటే ఆ దుకాణాల యజమానులపై కేసులు పెట్టాలని జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధికారులను ఉత్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

స్టాక్‌ లేకపోతే కేసు ..
లాక్‌డౌన్‌ చేసిన రోజు ఒక్కో దుకాణంలో ఎంత స్టాక్‌ ఉందో.. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత అంతే స్టాక్‌ ఉండాలి. స్టాక్‌లో తేడా కనిపిస్తే ఆ దుకాణ యజమానిపై కేసు నమోదు చేస్తాం. ఒక్కో దుకాణానికి డబుల్‌ లాక్‌తో పాటు సీల్‌ ఉంది. ఎవరైనా యజమానులు వీటిని తెరిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement