86 పశు వైద్యశాలలు మంజూరు | 86 veterinary clinics granted | Sakshi
Sakshi News home page

86 పశు వైద్యశాలలు మంజూరు

Oct 9 2014 11:38 PM | Updated on Mar 28 2018 11:05 AM

జిల్లాకు 86 పశు వైద్యశాలలు మంజూరయ్యాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఘట్‌కేసర్: జిల్లాకు 86 పశు వైద్యశాలలు మంజూరయ్యాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో గురువారం 3.5 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ప్రతాప్‌సింగారంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు సౌకర్యం లేని 1300 గ్రామాలకు రవాణా వసతి కల్పిస్తామని చెప్పారు. అన్ని గ్రామాలకూ రోడ్లు వేస్తామన్నారు. మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ.. అవసరమైన చోట ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. నీటి ఎద్దడి సమస్యకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ నియోజకవర్గం శివారు ప్రాంతంలో ఉన్నందున 3 డిపోలను ఏర్పాటు చేయాలన్నారు. చెంగిచర్ల డిపో నుంచి రోడ్డు వేయాలని కోరారు.  సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు మంద సంజీవరెడ్డి, శామీర్‌పేట్ ఎంపీపీ చంద్రశేఖర్, టీఆర్‌ఎస్ నాయకుడు నక్క ప్రభాకర్‌గౌడ్, సింగిల్ విండో చైర్మన్  గొంగళ్ల స్వామి, మండల ఉపాధ్యక్షుడు గ్యార లక్ష్మయ్య, ఎంపీటీసీ సభ్యులు మంకం రవి, కేశవనాథం, రమాదేవి, సర్పంచ్‌లు స్వర్ణలత, నక్క వరలక్ష్మి, మూసీ శంకరన్న, నాయకులు బైరు రాములు, లక్ష్మణ్, నరసింహ, కొంతం వెంకట్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, బొక్క ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ యాట కుమార్, ధరంకార్ సత్యరాం పాల్గొన్నారు.

ఆహ్వానపత్రం అందలేదు..
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమకు ఆహ్వానం అందలేదంటూ ప్రతాప్‌సింగారం సర్పంచ్ బాషగల్ల ఆండాలు, ఎంపీటీసీ సభ్యులు సంజీవ్‌లు సమావేశం నుంచి బయటకు వెళ్లారు. గ్రామానికి ప్రథమ పౌరురాలైన సర్పంచ్‌కు తెలియకుండా అధికారులు ఇలా చేయడం భావ్యం కాదని ఎంపీటీసీ సభ్యుడు సంజీవ్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన రజక సంఘం ప్రారంభ కార్యక్రమాన్ని సైతం ఆహ్వానించలేదని ఆయన ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement