6.1లక్షల కుటుంబాలకు ఆహారభద్రత | 6.1 lakh families ahara bhadratha | Sakshi
Sakshi News home page

6.1లక్షల కుటుంబాలకు ఆహారభద్రత

Mar 5 2015 2:33 AM | Updated on Sep 2 2017 10:18 PM

జిల్లాలో 6.1 లక్షల కుటుంబాలకు ఆహారభద్రత కార్డులను అందిస్తున్నామని జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి చెప్పారు.

నిజాంసాగర్: జిల్లాలో 6.1 లక్షల కుటుంబాలకు ఆహారభద్రత కార్డులను అందిస్తున్నామని జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి చెప్పారు. ఆహార భద్రత కార్డుల కోసం 6.3 లక్షల కుటుంబాల వారు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. బుధవారం నిజాంసాగర్ తహశీల్ కార్యాలయాన్ని జేసీ రవీందర్‌రెడ్డి, బోదన్ ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్ సందర్శించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఆహార భద్రత పథకం ద్వారా అర్హులైన  వారికి కార్డులను మంజూరు చేస్తున్నామన్నారు.

జిల్లా వ్యాప్తంగా 19.5 లక్షల యూనిట్ల బియ్యం సరఫరా చేస్తున్నామని  తెలిపారు. ప్రతి నెల రేషన్ దుకాణాల ద్వారా వినియోగదారులకు సక్రమంగా సరుకులు అందిస్తున్నామన్నారు. జిల్లాలో 33 వేల మందికి ఏఏవై కార్డులున్నాయని, వీరికి 35 కిలోల బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. రేషన్ వినియోగదారులు ఆధార్ నంబర్లను అందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో సన్నబియ్యం పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు.

సివిల్ సప్లయ్ గోదాంల ద్వారా పాఠశాలలకు సరఫరా చేస్తున్న ఈ పథకంలో కోతలు రాకుండా వేయింగ్ మిషన్ల ద్వారా బియ్యం తూకం వేస్తామ న్నారు. రేషన్ డీలర్లు నెల నెలా డీడీలను సకాలంలో చెల్లించాలన్నారు. ప్రతీ నెలా 10వ తేదిలోగా డీడీలు చెల్లిస్తే, రేషన్‌దుకాణాల్లో ప్రతీ నెలా ఒకటో తేదీ నుంచి నిత్యావసర సరుకులను అందిస్తామని తెలిపారు. సమావేశంలో స్థానిక తహశీల్దార్ సయ్యిద్‌మస్రూర్, ఆర్‌ఐ బాల్‌రెడ్డి తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement