breaking news
ahara bhadratha Cards
-
పెద్ద రైతులకు రేషన్ బంద్..!
సాక్షి, నేలకొండపల్లి: తప్పుడు వివరాలతో రేషన్ పొందుతున్న పెద్ద రైతులకు రైతుబంధు పథకం కష్టాన్ని తెచ్చింది. వివరాలను రేషన్ సర్వర్తో అనుసంధానం చేయటంతో పదెకరాలు, అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూములున్న రైతులకు రేషన్ నిలిచిపోతున్నాయి. ఇప్పటి వరకు తక్కువ భూమి ఉన్నట్లు చూపించి పలువురు పెద్ద రైతులు ఆహార భద్రత కార్డులు పొందారు. మరికొందరు భూమి ఉన్నా సేద్యంలో లేదంటూ తప్పుడు ధృవీకరణ పత్రాలు చూపించి రేషన్ తీసుకుంటున్నారు. అలాంటి రైతులకు పథకంతో తెరపడింది. రేషన్ సర్వర్కు దీనిని అనుసంధానం చేయటంతో ఎక్కువ భూములు ఉన్న రైతులకు రేషన్ నిలిచిపోయింది. పెట్టుబడి సాయం పొందేందుకు సాగులో లేని భూములను సైతం సేధ్యం చేస్తున్నామంటూ రైతులు తప్పుడు పత్రాలు చూపి రెండు పర్యాయాలు లబ్ధి పొందారు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రైతుబంధు లబ్ధిదారుల వివరాలను తెప్పించుకొని తమ శాఖ సర్వర్కు అనుసంధానం చేయడంతో పెద్ద రైతుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా ఫుడ్ సెక్యూరీటీ యాక్ట్ 2013 ప్రకారం వారిని రేషన్, రైతుబంధుకు అనర్హులుగా ప్రకటించింది. విచారించాలని డీఎస్ఓలకు ఆదేశాలు.. జిల్లాలో పది ఎకరాల పైన ఉన్న రైతులు ఎవరెవరు ఉన్నారో విచారించాలని జాయింట్ కలెక్టర్ల ద్వారా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు అందాయి. పెద్ద రైతులు, వారి భూముల వివరాలు విచారించి నివేదికలను పంపాలని అన్ని మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. ఇప్పటికే డీఎస్ఓ లకు లిఖిత పూర్వక ఆదేశాలు అందాయి. రైతు బంధుతో .. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు 8 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందజేస్తోంది. దీంతో ఏ రైతుకు ఎంత భూమి ఉందో లెక్క తేలిపోయింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆకున్ సబర్వాల్ రైతుల ఆధార్ నంబర్ను పీడీఎస్ రైస్ ఈ పాస్ సర్వర్కు అనుసంధానం చేయటంతో అనర్హులు దొరికిపోయారు. ప్రస్తుతం రేషన్ దుకాణాలల్లో ఈ పాస్ విధానంలో బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద రైతులు రేషన్ దుకాణానికి వెళ్లి ఈ పాస్ మిషన్ పై వేలిముద్ర వేస్తు ఇన్వాలీడ్ అని వస్తోంది. దీంతో డీలర్లు రేషన్ను నిలిపివేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 669 దుకాణాలు ఉండగా వాటిలో 3,95,857 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. అర్హులకు ఇబ్బంది లేదు.. తక్కువ భూమి ఉన్న రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక వేళ రేషన్ ఆగిపోతే స్థానిక తహసీల్దార్కు దరఖాస్తు కోవాలి. విచారించి రేషన్ అందేలా చర్యలు తీసుకుంటాం. పది ఎకరాలు అంత కంటే ఎక్కువగా భూమి ఉన్న రైతులకు ఈనెల నుంచి రేషన్ను నిలిచిపోతుంది. ఇప్పటికే కమీషనర్ కార్యాలయంలో బ్లాక్ చేశారు. – కె.వెంకటేశ్వర్లు, ఇన్చార్జ్ డీఎస్ఓ, ఖమ్మం -
6.1లక్షల కుటుంబాలకు ఆహారభద్రత
నిజాంసాగర్: జిల్లాలో 6.1 లక్షల కుటుంబాలకు ఆహారభద్రత కార్డులను అందిస్తున్నామని జాయింట్ కలెక్టర్ రవీందర్రెడ్డి చెప్పారు. ఆహార భద్రత కార్డుల కోసం 6.3 లక్షల కుటుంబాల వారు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. బుధవారం నిజాంసాగర్ తహశీల్ కార్యాలయాన్ని జేసీ రవీందర్రెడ్డి, బోదన్ ఆర్డీవో శ్యాంప్రసాద్లాల్ సందర్శించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఆహార భద్రత పథకం ద్వారా అర్హులైన వారికి కార్డులను మంజూరు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 19.5 లక్షల యూనిట్ల బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రతి నెల రేషన్ దుకాణాల ద్వారా వినియోగదారులకు సక్రమంగా సరుకులు అందిస్తున్నామన్నారు. జిల్లాలో 33 వేల మందికి ఏఏవై కార్డులున్నాయని, వీరికి 35 కిలోల బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. రేషన్ వినియోగదారులు ఆధార్ నంబర్లను అందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో సన్నబియ్యం పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. సివిల్ సప్లయ్ గోదాంల ద్వారా పాఠశాలలకు సరఫరా చేస్తున్న ఈ పథకంలో కోతలు రాకుండా వేయింగ్ మిషన్ల ద్వారా బియ్యం తూకం వేస్తామ న్నారు. రేషన్ డీలర్లు నెల నెలా డీడీలను సకాలంలో చెల్లించాలన్నారు. ప్రతీ నెలా 10వ తేదిలోగా డీడీలు చెల్లిస్తే, రేషన్దుకాణాల్లో ప్రతీ నెలా ఒకటో తేదీ నుంచి నిత్యావసర సరుకులను అందిస్తామని తెలిపారు. సమావేశంలో స్థానిక తహశీల్దార్ సయ్యిద్మస్రూర్, ఆర్ఐ బాల్రెడ్డి తదితరులున్నారు.