breaking news
-
కవిత లేఖ, రేవంత్పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు భారత సైనికులను కించపరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఆర్మీ ఛీప్ మీద మీకు విశ్వాసం లేదా? అని ప్రశ్నంచారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవిత లేఖపై కాంగ్రెస్ చర్చ అంతా ఒక డ్రామా అంటూ వ్యాఖ్యలు చేశారు.వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల మృతి చెందుతున్నాయి. శుక్రవారం ఎనిమిది కోడెలు, శనివారం ఐదు కోడెలు మరణించాయి. ఈ అంశమై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కోడెలను రక్షించాల్సిన బాధ్యత రాజన్న దేవస్థానానిదే. కోడెలను రక్షించడానికి సరైన ప్రణాళికలు రూపొందించాలి. కోడెల గదుల సంఖ్య పెంచాలన్నారు.మరోవైపు.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బండి సంజయ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు భారత సైనికులను కించపరిచే విధంగా ఉన్నాయి. ఆర్మీ ఛీప్ మీద మీకు విశ్వాసం లేదా?. పెహల్గాం ఘటన జరిగిన పదిహేను రోజుల్లోనే ఉగ్రవాదులను చంపాం. ఉగ్రవాదం అంతమయ్యే వరకు యుద్ధం కొనసాగుతుంది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది. పీవోకేను కాంగ్రెస్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు?.కవిత లెటర్పై చర్చ అంతా కాంగ్రెస్ డ్రామా. బీఆర్ఎస్, బీజేపీలు ఎప్పుడూ కలిసే ప్రసక్తే లేదు. కవిత అరెస్టును ఆపడానికి బీజేపీతో కలవాలని చూసినప్పుడే దగ్గరకు రానివ్వలేదు. కాంగ్రెస్ ప్రొడక్షన్లో జరిగిందే కవిత లేఖ. బీఆర్ఎస్ అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ మేము. మేము వారిని దగ్గరికి రానివ్వం. ఎంపీ ఈటల రాజేందర్, హరీష్రావు కలిశారన్న విషయం నేను వినలేదు. దీనిపై ఏం మాట్లాడలేను అని స్పష్టం చేశారు. -
‘కాంగ్రెస్కు ముని మనవడు వయస్సున్న పార్టీ మీది’’
హైదరాబాద్: గాంధీ కుటుంబం గురించి బీజేపీ నేతలు తప్పుగా మాట్లాడుతున్నారంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. నిజాయితీ, నీతి, త్యాగం, ప్రేమ కల్గిన గాంధీ కుటుంబం నుంచి వచ్చిన ఒక నేత రాహుల్ గాంధీ అని జగ్గారెడ్డి అన్నారు. అటువంటి వారిపై బీజేపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడటం తగదన్నారు. బీజేపీ ఎంపీ రఘనందన్ రావుకు గౌరవం ఇస్తానని, కానీ ఆయన లిమిట్స్ దాటి మాట్లాడుతున్నారంటూ హెచ్చరించారు. కిషన్ రెడ్డి మొట్టికాయలకు రఘునందన్ మైండ్ బ్లాండ్ అయ్యిందని ఎద్దేవా చేశారు జగ్గారెడ్డి. సర్దార్ పటేల్ మావాడు అంటుంన్నారు...‘1885 లో కాంగ్రెస్ ఆవిర్బవించింది... బీజేపీ పుట్టింది 1980. కాంగ్రెస్ చరిత్రకు బీజేపీ చరిత్రకు వంద ఏళ్ళ తేడా ఉంది. బీజేపీ పుట్టి కేవలం 45 ఏళ్ళు అయింది. కాంగ్రెస్కు ముని మనవడు వయస్సున్న పార్టీ మీది. మోతీలాల్ నెహ్రూ , జవహర్ లాల్ నెహ్రూ , ఇంధిరా గాంధీ ... వీరంతా స్వాతంత్ర్యానికి ముందు పుట్టిన వారే. మోదీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ,రణమఘునందన్ రావు స్వాతంత్యం తర్వాతే పుట్టారు. రఘనందన్ రావు చరిత్ర తెలుసుకో... రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. చరిత్ర పై చర్చ చేసే దమ్ము ఉందా?, గాంధీ కుటుబం ఏలిన రోజు... బీజేపీ లో ఇప్పుడు విమర్శిస్తున్న వారు ఇంకా పుట్టలేదు. స్వాతంత్ర్య వచ్చిన నాడు పరిస్థితులు ఎలా ఉండెనో ఎవరికి తెలుసు.నెహ్రూ ప్రధాని అయిన తర్వాత 545 సంస్థానాలకు భారత్లో విలీనం చేశారు. మీకు ఎవరు దిక్కు లేక సర్దార్ పటేల్ మావాడు అంటుంన్నారు. కాశ్మీర్ను కాపాడింది నెహ్రూనే..కాశ్మీర్ భారత్ నుంచి విడిపోకుండా నెహ్రూ కాపాడాడు. బీజేపీ నేతలకు ఆదిత్య 369 సినిమా లోలాగ టైం మిషన్ లో వందేళ్లు వెనక్కి తీసుకుపోవాలి. బీజేపీకి ఎజెండా లేదు... కాంగ్రెస్ సముద్రం లోని ఓక బిందె నీళ్లు తీసుకొని జీవిస్తున్నారు. ఆ బిందెడు నీల్లే సర్దార్ వల్లబాయి పటేల్’ అంటూ జగ్గారెడ్డి పేర్కొన్నారు.గాంధీ భవన్ అటెండర్ పోస్ట్ ఇచ్చినా పనిచేస్తాకొత్త కమిటీ ల కూర్పు చాలా అద్బుతంగా ఉంది. సామాజిక న్యాయం ప్రాధాన్యత ఇచ్చారు. పీఏసీ కమిటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు పెడితే అయిపోతుండే. జగ్గారెడ్డికి ఏ కమిటీలో ఇచ్చినా సంతోషమే. గాంధీ భవన్ అటెండర్ పోస్ట్ ఇచ్చినా పనిచేస్తా. జానారెడ్డి ఉన్న కమిటీ లో నాకు అవకాశం ఇచ్చారంటే నాకు ప్రమోషన్ ఇచ్చినట్లే.’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
త్వరలోనే ఆ బండారాన్ని ఆధారాలతో బయటపెడతా: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీసినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అంటూ మాజీ మంత్రి హరీష్రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని అసమర్థ రేవంత్ సర్కారు.. హిమాచల్ ప్రదేశ్ లో హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడం మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అనే సామెతను గుర్తు చేస్తోంది’’ అంటూ హరీష్రావు ట్వీట్ చేశారు.అప్పులు పుట్టడం లేదని, తమను ఎవరు నమ్మడం లేదని ప్రతీ వేదిక మీద తన చేతకాని తనాన్ని ప్రదర్శిస్తున్న రేవంత్రెడ్డి.. 6,200 కోట్ల రూపాయలతో హిమాచల్ ప్రదేశ్లో తెల్ల ఏనుగు లాంటి హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి టీజీ జెన్కోను రంగంలోకి దింపడం ఇంకో తుగ్లక్ చర్య తప్ప మరొకటి కాదు. హిమాచల్లో హైడల్ ప్రాజెక్టు నిర్మాణ పనుల నుంచి మోసర్ బేర్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీ పారిపోయినా, ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వరంగ కంపెనీ 3 ఏండ్ల తర్వాత సాధ్యం కాదని వదిలేసిన 510 మెగావాట్ల ప్లాంట్ని కట్టేందుకు టీజీ జెన్ కో ఒప్పందం ఎందుకు చేసుకుందో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అంటూ హరీష్రావు డిమాండ్ చేశారు.‘‘రెండు దశాబ్దాల కాలంలో ఒక్కరు కూడా కట్టేందుకు ముందు రాని ప్రాజెక్ట్ను ఎందుకు నేడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టవలసి వస్తోంది?. డీపీఆర్ లేకుండానే తెలంగాణ ప్రభుత్వం హిమాచల్ ప్రభుత్వంతో ఎంవోయు చేసుకొని అప్ ఫ్రంట్ ప్రీమియం కింద 26 కోట్ల రూపాయలు చెల్లించి మరో 26 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధపడడాన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి చెపుతున్న మాటలు ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికేనని తేలిపోయాయి’’ అంటూ హరీష్రావు ట్వీట్ చేశారు...2009లోనే మోసర్ బేర్ కంపెనీ 64 కోట్ల అప్ ఫ్రంట్ ప్రీమియం చెల్లించి హిమాచల్ ప్రదేశ్ లోని ప్రతిపాదిత సేలి, మియార్ లో హైడ్రో పవర్ ప్రాజెక్టులు కట్టాలని భావించింది. కానీ సాంకేతికంగా, ఆర్థికంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అనంతరం తాము చెల్లించిన 64 కోట్ల ప్రీమియంని హిమాచల్ ప్రభుత్వం తిరిగి ఇవ్వనందుకు గాను ఆ రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించింది. హిమాచల్ హైకోర్టు మోసర్ బేర్ కంపెనీకి వడ్డీతో సహా తీసుకున్న డబ్బును 2023 జనవరిలోనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీసినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు.రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని అసమర్ధ రేవంత్ సర్కారు హిమాచల్ ప్రదేశ్ లో హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడం మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అనే సామెతను గుర్తు చేస్తోంది.…— Harish Rao Thanneeru (@BRSHarish) May 30, 2025..10 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఢిల్లీలోని హిమాచల్ భవన్ ను వేలం వేసి ఆ డబ్బుని కంపెనీకి చెల్లించాలని 2024 నవంబర్ లో హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 7 నెలలకు పైగా అత్యధికంగా మంచు కురిసే ప్రాంతంలో హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ సాధ్యం కాదని 2019లో ఒప్పందం చేసుకున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీ కూడా చేతులు ఎత్తేసి ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాంటి అనువు కాని ప్రాంతం లో 6,200 కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాతో 510 మెగా వాట్ల హైడ్రల్ ప్రవర్ ప్రాజెక్టులకు ఎందుకు రేవంత్ రెడ్డి సర్కారు ఉబలాటపడుతుందో శ్వేతా పత్రం విడుదల చేయాలని భట్టి విక్రమార్కను డిమాండ్ చేస్తున్నాం.ఫీజిబిలిటీ రిపోర్ట్లు, డీపీఆర్ లు లేకున్నా, జెన్ కో బోర్డు ఆమోదం లేకున్నా కూడా ఎంవోయూ చేసుకొని 26 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని, అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తున్నాం. రెండు కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న గూడు పుఠాణి ఏందో గల్లీ కాంగ్రెస్ చెప్తుందా? ఢిల్లీ కాంగ్రెస్ చెప్తుందా? హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చెప్తుందా?. సాధ్యం కాదు అని 20 ఏండ్లుగా కట్టని ప్రాజెక్టును ఎవరి లాభం కొరకు, ఎవరి మెప్పు కోసం కడుతున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి.రైతు రుణమాఫీకి డబ్బు లేదంటారు.. రైతు బంధుకు డబ్బు లేదంటారు. రైతు బీమాకి డబ్బు లేదంటారు. ఆసరా పెన్షన్ కి డబ్బు లేదంటారు. మహాలక్ష్మి కింద నెలకు 2500 రూపాయలు ఇచ్చే పథకానికి డబ్బు లేదంటారు. తులం బంగారానికి డబ్బు లేదంటారు. విద్యార్థులకు ఫీ రీయింబర్స్మెంట్కి డబ్బు లేదంటారు. విద్యా భరోసాకి డబ్బు లేదంటారు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు డబ్బు లేదంటారు. ఉద్యోగుల డీఏలకు, పీఆర్సీకి దిక్కు లేదంటారు. చివరికి అప్పు కూడా పుడుతలేదు అని అన్న రేవంత్ రెడ్డికి హిమాచల్లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్కు 6,200 కోట్లు ఎక్కడ నుండి వస్తాయో చెప్పాలి. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నిర్థిష్టమైన సమాచారం మా వద్ద ఉంది. త్వరలోనే కాంగ్రెస్ అవినీతి బండారాన్ని పూర్తి ఆధారాలతో బయటపెడతాం’’ అంటూ హరీష్రావు హెచ్చరించారు. -
‘ఈటెల బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారు’
హైదరాబాద్: బీఆర్ఎస్, బీజేపీ ఒప్పందాన్ని ఎమ్మెల్సీ కవిత బహిర్గతం చేశారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు. కేసీఆర్, కిషన్ రెడ్డిల లోపాయకారి ఒప్పందంతోనే బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారంటూ విమర్శలు గుప్పించారు మహేష్ గౌడ్. ముందుగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ అధినాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీలో ఎవరికి ఎంత ప్యాకేజ్ అందిందో బహిర్గతం చేయాలన్నారు మహేష్ గౌడ్. ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారని ఆరోపించారు.కాళేశ్వరం కమిషన్ నోటీసుల తర్వాత హరీష్ రావు, ఈటెల సమావేశమయ్యారని, ఈ భేటీలో ఈ భేటీ లో కేసీఆర్ తో ఈటెల ఫోన్ లో మాట్లాడారంటూ మహేష్ గౌడ్ పేర్కొన్నారు.ట్రంప్కు భయపడే యుద్ధం ఆపేశారా?ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ పై యుద్ధానికి దిగిన భారత్.. మధ్యలో యుద్ధాన్ని ఆపడానికి కారణమేంటని ప్రశ్నించారు మహేష్ గౌడ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భయపడే యుద్ధాన్ని మధ్యలో ఆపేశారా? అంటూ నిలదీశారు.‘యుద్ధంను మధ్య లో ఎందుకు ఆపారు.ట్రంప్ జోక్యం పై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు.పాకిస్థాన్- భారత్ యుద్ధంలో దేశం సాదించింది ఏంటి?, పోగుట్టుకుంది ఏంటో దేశ ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు. యుద్ధం అంటే ఇంధిరా గాంధీ గుర్తుకు వస్తారు. కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ ఇంధిరా గాంధీ హాయాంలో జరిగాయి... కానీ ఎప్పుడూ రాజకీయం చేయలేదు’ అని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. -
రేవంత్ రెడ్డికి సంబీత్ పాత్రా చురకలు
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ సంబీత్ పాత్రా(Sambit Patra) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)ను శంకించే బదులు.. పోయి పాకిస్తాన్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించుకోవాలంటూ చురకలంటించారు. శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ విషయంలో కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి (Revanth Reddy) తదితరులు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ, ఆయన పార్టీ నేతలు.. పాకిస్తాన్లో ఎన్ని ఎయిర్బేస్లు ధ్వంసం అయ్యాయి?. ఉగ్రవాదులు ఎంతమంది చనిపోయారు? అని వాళ్లు అడగడం లేదు. కేవలం ఎన్ని రఫెల్స్ యుద్ధ విమానాలు పాక్ నేల కూల్చిందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్లో ఇప్పుడు రెండు వర్గాలు తయారయ్యాయి. ఒకటి పాకిస్తాన్కు మద్దతు తెలిపేది. రెండో వర్గం.. వీళ్ల కారణంగా భారత్కు మద్దతు గళం వినిపించలేకపోతున్నది... మీ జై హిందూ యాత్ర(Jai Hind Yatra).. పాకిస్తాన్ హింద్ యాత్రలా తయారైంది. మీరు మీ యాత్రను ఆపేస్తే మంచిది. అలాగే వెళ్లి పాకిస్తాన్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించుకోండి అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ సంబీత్ పాత్రా ఎద్దేవా చేశారు.అలాగే అఖిలపక్ష ఎంపీల బృందాన్ని.. టెర్రరిస్టులతో పోలుస్తూ(ఎంపీలు ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు.. ఉగ్రవాదులూ ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు అనే కామెంట్) జైరామ్ రమేష్ వ్యాఖ్యలు చేశారు. వాళ్లేం సరదా పర్యటనలకు వెళ్లలేదు. ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరును ప్రపంచానికి తెలియజేసేందుకే వెళ్లారు. అందులో మీ ఎంపీలు కూడా ఉన్నారనే విషయం గుర్తిస్తే మంచిది’’ అని జైరామ్ను ఉద్దేశించి సంబీత్ పాత్రా అన్నారు.ఇదిలా ఉంటే.. ఉగ్రవాదంపై పోరు, పీవోకేను తిరిగి భారత్లో విలీనం చేసే చర్యలకుగానూ కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాదు పాక్ను రెండు ముక్కలు చేయడానికి తన మద్దతు పూర్తిగా ఉంటుందని తెలిపారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబితేనే మోదీ ప్రభుత్వం యుద్ధాన్ని ఆపేసి వెనక్కి వచ్చిందన్న అంశంపై రేవంత్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.‘‘ప్రధాని మోదీ వేల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి రఫెల్ యుద్ధ విమానాల(Rafale Fighter Jets)ను కొనుగోలు చేశారు. అలాంటప్పుడు ఆ యుద్ధ విమానాల్లో ఎన్నింటిని పాక్ నేల కూల్చింది? ఈ విషయంపై చర్చ జరగదా?. వీటికి సమాధానాలు తెలియాల్సిందే’’ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో బీజేపీ చేపట్టిన తిరంగా ర్యాలీని ఆయన తప్పుబట్టారు. బీజేపీ తన చర్యలతో భారత సైనికుల్లో మనోస్థైర్యాన్ని దెబ్బ తీసిందని, ఆ పార్టీ చేపట్టిన తిరంగా ర్యాలీకి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ ‘జై హింద్ యాత్ర’ చేపడుతోందని తెలంగాణ సీఎం అన్నారు.ఇదీ చదవండి: తప్పు చేసి ఉంటేనే క్షమాపణలు చెబుతా! -
బీజేపీతో పొత్తుపెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు : ఎమ్మెల్సీ కవిత
సాక్షి,మంచిర్యాల: నాకంటూ సొంత అజెండా ఏమీలేదు. పార్టీని కాపాడుకోవాలనేది నా తపన అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి స్పష్టం చేశారు.ఎమ్మెల్సీ కవిత శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ‘నాకు సొతంత అజెండా ఏమీలేదు. పార్టీని కాపాడుకోవాలనేది నా తపన. బీజేపీలో పార్టీని విలీనం చేయొద్దనేది నా వాదన. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు. నేను జైల్లో ఉన్నప్పుడు పార్టీని బీజేపీలో కలుపుతానని అన్నారు. పార్టీని బీజేపీలో కలుపుతానంటే నేను ఒప్పుకోను. లెటర్ రాయడంలో నా తప్పేమీ లేదు. లెటర్ బయటపెట్టిన వారిని పట్టుకోండి’ అని వ్యాఖ్యానించారు. -
ఒకే కొడుకు కాబట్టి చంద్రబాబు బతికిపోయాడు: సీపీఐ నారాయణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) స్పందించారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుపైనా ఆసక్తికర కామెంట్ చేశారాయన. ‘‘కవిత అసలు ఎందుకు బయటకు వస్తోంది?. బీఆర్ఎస్లో డెమోక్రసీ లేదు. ప్రాంతీయ పార్టీల్లో ఇద్దరు పిల్లలు ఉంటే ప్రమాదమే. చంద్రబాబుకు ఒకే కొడుకు కాబట్టి బతికిపోయాడు. ప్రాంతీయ పార్టీల్లో ప్రాపర్టీ, పలుకుబడి అంతా కుటుంబం కోసమే. పదవులు, ప్రాపర్టీల గొడవగా కవిత ఎపిసోడ్(Kavitha Episode) చూస్తున్నాం’’ అని అన్నారాయన. ప్రాంతీయ పార్టీల్లో డెమోక్రసీ లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో అతి డెమోక్రసీ ఉంది. ఆ పార్టీ పదే ముఖ్యమంత్రులను ఢిల్లీకి పిలిపించుకుంటుంది. ఇది పరిపాలనపై ప్రభావం చూపెడుతుంది. ఎన్నికైన సీఎంకు స్వేచ్ఛ ఇవ్వాలి. అంతేగానీ పదే పదే పగ్గాలు పెట్టి లాగొద్దు’’ అని సూచించారు.ఆపరేషన్ కగార్పైనా స్పందిస్తూ.. చంపినంత మాత్రాన నక్సలిజం పోదు. ఇంకా పెరుగుద్ది. మనుషులను చంపగలరు గాని సిద్ధాంతాన్ని చంపగలరా?. ఇది అడవులను ఖాళీ చేసి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం’’ అని నారాయణ ఆరోపించారు. ఇదీ చదవండి: తప్పుడు కేసా? కాదా? అనేది మేం తేలుస్తాం -
కరీంనగర్ నుంచి వార్ మొదలైంది.. ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్
సాక్షి,హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కరీంనగర్ నుంచి వార్ మొదలైందని ప్రకటన చేశారు. అందరూ దొంగలు ఒక్కటయ్యారని రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. అంతకుముందు బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలనే ప్రతిపాదన వచ్చిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సమర్ధించారు.గురువారం పార్టీలోని కోవర్టులే తనని ఓడించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 25ఏళ్లుగా కేసీఆర్కు లేఖలు రాస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్క లేఖ కూడా లీకు కాలేదు. కానీ ఈ సారి రాసిన లేఖ ఎలా బహిర్ఘతం అయ్యింది. ఆ లీకు వీరులెవరో చెప్పాలి. నేను జైల్లో ఉండగా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరిగింది.నేను పార్టీలో ఉంటే అది సాధ్యం కాదని, తనని కేసీఆర్కు దూరం చేయాలని చూస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.అయితే, కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రాజా సింగ్.. ఆఫ్ ద రికార్డు కవిత మాట్లాడినది నిజమే అని నేను అనుకుంటున్నాను. పెద్ద ప్యాకేజీ దొరుకుతే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్తోనే కలిసిపోతారు. మా వాళ్లు కుమ్మక్కయ్యారు కాబట్టే బీజేపీకి నష్టం’ అని వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ మునిగే నావ నేనెందుకు చేరతా: కవిత
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ మునిగి పోయే పడవ. ఆ పార్టీలో నేనెందుకు చేరతా?. చేరితే ఏంటి లాభం? నేను కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరిపినట్లు జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం. నేను కేసీఆర్కు రాసిన లేఖను కుట్రపూరితంగా లీక్ చేశారు. 2013 తర్వాత నేను కాంగ్రెస్ నేతలు ఎవరితోనూ మాట్లాడలేదు. రెండు జాతీయ పార్టీలు.. కాంగ్రెస్, బీజేపీతో తెలంగాణకు నష్టమే. అయినా బీఆర్ఎస్ను కొందరు నేతలు బీజేపీకి అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు 101 శాతం ప్రయత్నాలు జరిగాయి. నేను మద్యం కేసులో జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదనను నా వద్దకు తీసుకు వస్తే వ్యతిరేకించా. బీఆర్ఎస్ స్వతంత్రంగా ఉండాలన్నదే నా అభిమతం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆరు నెలలు కాదు.. ఏడాదైనా జైల్లో ఉంటా.. పార్టీని బీజేపీలో విలీనం చేయొద్దని కోరా. అప్పటినుంనే నా తండ్రి కేసీఆర్ నుంచి నన్ను విడదీసే కుట్రలు, పార్టీకి, కుటుంబానికి దూరం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నన్ను పార్టీ నుంచి బయటకు పంపితే జరిగే లాభం ఎవరికి?’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్కు ఆమె రాసిన లేఖ బయటకు రావడం, ఆ నేపథ్యంలో కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించడం, తదితర పరిణామాల నేపథ్యంలో..కవిత గురువారం తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. పార్టీ పనితీరు, నేతల వ్యవహారశైలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అన్న కేటీఆర్ పేరు ప్రస్తావించకుండా ఆయనపై.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు కవిత మాటల్లోనే.. పార్టీని కేసీఆర్ కాపాడుకోవాలి.. కేసీఆర్కు 25 ఏళ్లుగా వందల లేఖలు రాస్తున్నా. అందులో తప్పేముంది. సాధారణంగా లేఖను చదివిన కేసీఆర్ చింపేస్తారు. నా కర్మ బాగా లేకో మరొకటో తెలియదు. కానీ ఎవరో కుట్ర పూరితంగా లేఖను బయటకు లీక్ చేశారు. లీకు వీరులను బయట పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతుంటే గ్రీకు వీరుల్లా ప్రవర్తిస్తున్నారు. నేను మా నాన్నకు లేఖ రాస్తే మీకు నొప్పేంది? నాపై ప్రతాపం చూపడం మానుకుని కాంగ్రెస్, బీజేపీపై చూపండి. నేను అసలే మంచిదాన్ని కాదు.. నోరు విప్పితే తట్టుకోలేరు. లేఖలో నేను సూచించిన అంశాల్లో ఒక్కటైనా తప్పుందా? కోవర్టులే పార్టీకి నష్టం చేస్తున్నారు. గతంలో పార్టీలో ఉన్న పెద్ద నాయకులు ఇప్పుడు రేవంత్ దగ్గర ఉన్నారు. నాతో ఉన్న నాయకులు ఎవరూ కాంగ్రెస్లో చేరలేదు. నేను ఎన్నడూ పదవులు అడగలేదు. ఆత్మాభిమానం మాత్రమే కోరుకుంటా. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించను. నల్లి కుట్ల రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు చేయకుండా ఏ అంశంపైనైనా నేరుగా మాట్లాడతా. నేను బీఆర్ఎస్కు వ్యతిరేకం కాదు. కొత్త పార్టీ అవసరం లేదు. ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలు. పార్టీని కేసీఆర్ కాపాడుకోవాలి. వారిద్దరూ ఎవరికి దగ్గరో అందరికీ తెలుసు రాజ్యసభ ఎంపీ దామోదర్రావు, గండ్ర మోహన్రావును నా వద్దకు ఎవరు పంపారో తెలియదు. కానీ వారిద్దరూ ఎవరికి దగ్గరో అందరికీ తెలుసు. వారు నాతో చర్చించింది ఒకటి.. బయటకు లీక్ చేసింది మరొకటి. ఇతర నేతల విషయాల్లో స్పందిస్తున్న పార్టీ నాయకత్వం.. నేను పార్టీ ఎమ్మెల్సీని అయినా నాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఎందుకు స్పందించడం లేదు? లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నేను కారణమైతే నాపై, లేదంటే అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. పెయిడ్ ఆర్టిస్టులతో నాపై తప్పుడు ప్రచారం చేయిస్తూ సోషల్ మీడియాలో మహాభారతం కేరక్టర్లు వేస్తున్నారు. ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మంచిదేనా? లీకు వీరులను కట్టడి చేయకుండా పెయిడ్ ఆర్టికల్స్ రాయిస్తే భయపడేది లేదు. 2006లో తెలంగాణ జాగృతి స్థాపించింది మొదలుకుని ఎనిమిదేళ్లు కేసీఆర్ నీడలో సైనికురాలిగా పనిచేశా. కడుపులో బిడ్డను పెట్టుకుని ఉద్యమంలో నా శక్తి మేరకు పనిచేశా. కేసీఆర్ వారించడంతోనే రాజీనామాపై వెనక్కి ఢిల్లీ మద్యం కేసులో కేసు నమోదు చేస్తే ఎమ్మెల్సీకి, పార్టీ పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్కు చెప్పా. కానీ కుట్రతో బీజేపీ కేసులు పెట్టిందని కేసీఆర్ వారించడంతోనే పదవిలో కొనసాగుతున్నా. 2019లో లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీచేస్తే సొంత పార్టీ వారే కుట్రపూరితంగా ఓడించారు. ఎమ్మెల్యేలు నా గెలుపు కోసం పనిచేయలేదు. అయితే అదే నిజామాబాద్ జిల్లాలో నాకు ప్రొటోకాల్ ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ నాకు మండలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరినొకరు ఓడించుకున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి పదవుల కోసం పోటీ పడి ఒకరినొకరు ఓడించుకున్నారు. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ఏం కార్యాచరణ తీసుకుంది? నేతలు ఎవరూ ఎందుకు స్పందించలేదు? క్షేత్రస్థాయిలో ఉద్యమ కార్యాచరణ ఎందుకు చేపట్టడం లేదు? నోటీసులపై కార్యాచరణ చేపట్టకుండా అమెరికాలో పార్టీ రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తే ఏం లాభం? నన్ను రేవంత్రెడ్డి కోవర్టు అనడం ఎంత వరకు కరెక్ట్? ట్విట్టర్ మెసేజ్లు సరిపోతాయా? పార్టీ నేతల కాలేజీలపైకి బుల్డోజర్లు పోతుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు? వారు పార్టీ తరఫున పోటీ చేయడమే తప్పా? తెలంగాణ సోయిలో పరిపాలన జరగడం లేదని బీఆర్ఎస్ నాయకులు గళం ఎత్తి పోరాడకుంటే పార్టీ ఎలా ముందుకు పోతుంది? మీడియా సెల్ పెట్టుకుని దాడులు చేస్తూ క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయకుండా ట్విట్టర్లో మెసేజ్లు పెడితే సరిపోతాయా? నీటిపారుదల అంశంపై ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ట్వీట్లకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఉద్యమం చేయాలి. బీఆర్ఎస్లో ఒకేఒక్క లీడర్ కేసీఆర్ కేసీఆర్ కృషితోనే వరంగల్ సభ విజయవంతం అయింది. కొందరు నేతలు కేసీఆర్ నీడలోనే బతుకుతున్నామనే విషయాన్ని గుర్తించి, కేసీఆర్ను తామే మోస్తున్నామనే భ్రమ నుంచి బయటకు రావాలి. నా కుటుంబాన్ని వదిలి నేను ఎందుకు వెళ్తాను? నేను ఎవరి నాయకత్వం కిందా పని చేయను. బీఆర్ఎస్లో ఒకేఒక్క లీడర్ కేసీఆర్. ఆయన బలమైన నాయకుడు. ఆయన నాయకత్వంలో మాత్రమే పనిచేస్తా. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా గౌరవం ఇస్తా. చంద్రబాబు ఏం చేసినా కేంద్రం అడ్డుకోవడం లేదు ఏపీ సీఎం చంద్రబాబు ఏం చేసినా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవటం లేదు. ఏపీ చేపట్టనున్న బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీరని నష్టం జరుగుతుంది. ప్రజాభవన్లో రేవంత్తో మీటింగ్ తర్వాతే చంద్రబాబు బనకచర్లపై ప్రకటన చేశారు. గోదావరి జలాల్లో తెలంగాణకు వాటా లేకుండా చేయాలనే కుట్రలో భాగంగానే 200 టీఎంసీల ప్రాజెక్టును తెరమీదకు తెచ్చారు.జాగృతిని విస్తృతం చేస్తా..మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటా నేను మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటా. పార్టీ చేయని పనులు సగం మేర నేనే చేస్తున్నా. ఉద్యమ సంస్థగా ఏర్పడిన తెలంగాణ జాగృతి పది విభాగాలతో బలంగా ఉంది. దీనిని మరింత విస్తరించడంతో పాటు కార్యాలయాన్ని అశోక్నగర్ నుంచి బంజారాహిల్స్కు మారుస్తాం. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించడంతో పాటు నీటిపారుదల, బీసీలకు సంబంధించిన అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలతో స్పీడ్ పెంచుతాం. సింగరేణిని అమ్మే కుట్రలపై, కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ కార్యాచరణ చేపట్టాలి. లేనిపక్షంలో తెలంగాణ జాగృతి తరఫున కార్యాచరణ ప్రకటిస్తాం.పులిబిడ్డ ఎక్కడికీ పోదు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యాఖ్యలు సేవాలాల్ ఆలయంలో పూజలకు హాజరైన ఎమ్మెల్సీ కవితమేడ్చల్: గుండ్లపోచంపల్లి హనుమాన్ గడ్డ సమీపంలో గల సేవాలాల్ తండాలోని సేవాలాల్ ఆలయంలో వార్షికోత్సవ పూజలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. గురువారం మధ్యాహ్నం తన నియోజకవర్గంలోని ఆలయానికి విచ్చేసిన కవితకు పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి అనుచరులతో కలిసి స్వాగతం పలికారు. ఉదయం కవిత కార్యక్రమం ఖరారు కాగానే ఎమ్మెల్యే కార్యాలయం నుంచి పార్టీ కేడర్కు సందేశాలు వెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గుండ్లపోచంపల్లికి చేరుకున్నారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి అరగంట ముందే అక్కడికి చేరుకుని ఏర్పాట్లు పర్యవేక్షించారు. గిరిజన సంప్రదాయ బద్ధంగా డప్పులు, బ్యాండు మేళాలతో, బోనాలతో స్వాగత ఏర్పాట్లు చేశారు. అందరికీ గులాబీ రంగు పగిడీలు ఏర్పాటు చేయించారు. అరగంట సేపు ఆలయం వద్ద ఉన్న కవిత.. ఇటీవలి పరిణామాలపై ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. మీడియా మాట్లాడించే ప్రయత్నం చేసినా చిరునవ్వుతో దాట వేశారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ.. కవిత పులిబిడ్డ అని, పుట్టిన బిడ్డ పులివద్దనే ఉంటుందని, ఎక్కడికీ పోదని అన్నారు. కవిత ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ను వీడి వెళ్ళరని, ఎవరూ ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. -
భారతీయుల ఆత్మగౌరవం ట్రంప్ దగ్గర తాకట్టా?: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులతో ప్రధాని మోదీ పాకిస్తాన్తో యుద్ధం విరమించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని, దేశ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. ‘అమెరికా ఒత్తిడికి తలొగ్గి యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేస్తారా? భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెడతారా? యుద్ధం అంటే ధైర్యం, వెన్నెముక, యుద్ధతంత్రం ఉండాలని ప్రగల్భాలు పలికిన ప్రధాని మోదీ నాలుగు రోజుల యుద్ధం తర్వాత అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారు? పాకిస్తాన్తో యుద్ధంలో రఫేల్ విమానాలు ఎన్ని నేలకూలాయో లెక్క చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం బాచుపల్లి వీఎన్ఆర్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకూ జైహింద్ యాత్ర కొనసాగింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్రెడ్డి ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలోని యుద్ధ విమానాలే పాకిస్తాన్తో యుద్ధంలో దేశ ఆత్మ గౌరవాన్ని కాపాడాయని, మోదీ కొనుగోలు చేసిన రఫేల్ విమానాలు మాత్రం యుద్ధంలో నేలకూలాయని ఎద్దేవా చేశారు. యుద్ధం చేయాలనుకున్నప్పుడు అఖిలపక్షాన్ని పిలిచారని.. యుద్ధం ఆపేసినప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. యుద్ధంపై ఉపన్యాసాలు చెప్పడం కాదు. దేశ ప్రజలకు మోదీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇందిరను స్ఫూర్తిగా తీసుకోవాలి పాకిస్తాన్తో యుద్ధంలో అపరకాళీ ఇందిరా గాంధీని ప్రధాని మోదీ స్ఫూర్తిగా తీసుకుంటే బాగుండేదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు యుద్ధం ఆపాలని ఇందిరా గాం«దీని అప్పటి అమెరికా అధ్యక్షుడు బెదిరించారని, కానీ ఆమె అమెరికా బెదిరింపులకు లొంగలేదన్నారు. భారత్ వైపు ఎవరు కన్నెత్తి చూసినా కనుగుడ్లు పీకేస్తామని.. చైనాకు ఇందిరాగాంధీ వార్నింగ్ కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు చైనాపై యుద్ధం ప్రకటించి గట్టిగా బుద్ధి చెప్పిన ఘనత ఇందిరమ్మదన్నారు. భారత ఆర్మీ కల్నల్ సంతోష్ను చైనా పొట్టన పెట్టుకుంటే మోదీ కనీసం చైనాకు బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 1971లో భారత్–పాక్ యుద్ధ సమయంలో అమెరికా మధ్యవర్తిత్వం అవసరం లేదని ఇందిరా గాంధీ నిర్మొహమాటంగా చెపారని, యుద్ధంలో ఇందిరమ్మ పాకిస్తాన్ను రెండు ముక్కలు చేసి చూపారన్నారు. ఇందిరమ్మ స్ఫూర్తితో పాక్ను రెండు ముక్కలు చేయాలని.. తాము మద్దతుగా ఉంటామని చెప్పారు. పాకిస్తాన్కు గుణపాఠం చెప్పడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని రేవంత్ కోరారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో కలుపుకొనేందుకు పాక్పై యుద్ధం చేయాలని, రాజకీయాలకు అతీతంగా అండగా ఉంటామని చెప్పామన్నారు. భారత్పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారని, ఉగ్రవాదులను తుదముట్టించే వరకూ సైన్యానికి అండగా ఉంటామని తెలిపారు. రాహుల్ గాంధీపై విమర్శలా? అమెరికాకు తలొగ్గి యుద్ధం విరమించిన బీజేపీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాందీపై విమర్శలు చేయడం విడ్దురంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. భారత్ 1967లో చైనాను, 1971లో పాకిస్తాన్ను ఓడించినందుకు కాంగ్రెస్ను విమర్శిస్తున్నారా ఎద్దేవాచేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, గాంధీ కుటుంబానిదన్నారు. మోదీకి వీరతిలకం దిద్ది పాకిస్తాన్పై యుద్ధం చేయాలని చెబితే.. ఎందుకు వెనుకడుగు వేశారో బీజేపీ నేతలే చెప్పాలన్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని, మీ సొంత వ్యవహారం కాదని ధ్వజమెత్తారు. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తారన్నారు. భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని బీజేపీ దెబ్బతీస్తే.. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కాంగ్రెస్ జైహింద్ యాత్ర చేపట్టిందని చెప్పారు. రాహుల్ గాందీని దేశానికి ప్రధానిగా చూసే వరకు మనం విశ్రమించొద్దని పార్టీ కార్యకర్తలకు రేవంత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
‘గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే.. యుద్ధాన్ని గెలుస్తాడు’
మేడ్చల్ జిల్లా: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్కు కాంగ్రెస్ పూర్తి మద్దతిస్తే, యుద్ధం ఆపేసినప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు(గురువారం) మేడ్చల్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. ప్రధాని మోదీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే.. యుద్ధాన్ని గెలవగలడు అంటూ ప్రధాని మోదీని విమర్శించారు.‘ఉగ్రదాడి తర్వాత కేంద్రానికి పూర్తిగా మద్దతిచ్చాం. యుద్ధాన్ని ఆపాలనుకున్నప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు?, మన భూభాగాన్ని చైనా ఆక్రమిస్తుంటే మోదీ ఏం చేస్తున్నారు?, అమెరికా ఒత్తిడికి తలొగ్గి యుద్ధం ఆపేశారా?, మన పౌరులపై తూటాలు పేల్చిన దేశాన్ని తుడిచేయాలని ప్రధానిని కోరాం.పాక్ ను ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేయాలని కోరాం. భారత్ను బెదిరించడానికి ట్రంప్ ప్రకటన చేయడం బాధాకరం. యుద్ధాన్ని విరమించినప్పుడు మోదీ అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదు. గతంలో అమెరికా బెదిరింపులను ఇందిరాగాంధీ పట్టించుకోలేదు. అప్పట్లో పాక్ను ఓడించి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేశారు. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే.. యుద్ధాన్ని గెలవగలడు. పాక్ను ఓడించాలంటే ఇందిరాగాంధీ బాటలో మోదీ నడవాలి. ఇదే విషయాన్ని రాహుల్గాంధీ చెప్తే విమర్శిస్తున్నారు’ అంటూ సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇది చదవండి: ‘మోదీ జీ.. ఎవరి సత్తా ఏంటో ఎన్నికల్లో చూస్కుందాం’ -
కవితలో ఇంత ఆవేదన ఉందనుకోలేదు.. త్వరలోనే ఆమెను కలుస్తా
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పందించారు. కవితలో ఇంత ఆవేదనతో ఉంది అనే విషయం ఈ రోజే తెలిసింది. కవిత వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జరుగుతుంది. కవితతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. కవిత సమస్యపై పార్టీలో తొందరలోనే కొలిక్కి వస్తుందని అనుకుంటున్నా.చిట్ చాట్లో మాట్లాడిన దానికి పార్టీ ఎలా షోకాజ్ నోటీసులు ఎలా ఇస్తాము. టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి పనిచేశాం. .ఒక బీజేపీతోనే మేము కలిసి పనిచేయలేదు. రాజకీయాల్లో ప్రకంపనలు సహజం. చాలా పార్టీల్లో ఇలాంటి ప్రకంపనలు చూశాం. మా పార్టీ మొదటిది కాదు , చివరిది కాదు. పార్లమెంట్ లో కరుణానిధి, అళగిరి, కనిములి ఫ్యామిలీ రాజకీయాలు చూశాం.సమస్యలు త్వరలోనే ఖచ్చితంగా సద్దుమణుగుతాయి. ఒక్క బీజేపీతో మాత్రమే పని చేయలేదు. బీజేపీతో కలిసి పనిచేయాలనుకుంటే ఎప్పుడో పొత్తు పెట్టుకునేవాళ్ళం ’ అని వ్యాఖ్యానించారు. -
కవిత ఏం మాట్లాడిందో తెలీదు: సబితా
సాక్షి, హైదరాబాద్: కవిత ఏం మాట్లాడిందో తనకు తెలీదని.. ఆమె వ్యాఖ్యలపై పార్టీ స్పందిస్తుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విద్యను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. గత పదేళ్లలో విద్యకు కేసీఆర్ ఏం చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను వ్యతిరేకించడం లేదు. విధాన పరమైన నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాం. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రూ.80 కోట్లని ఒకసారి.. మరోసారి 125 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం అన్నారు. ఇప్పుడేమో రూ. 200 కోట్లకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం అంటున్నారు. ఇలా ఎందుకు అంచనాలు పెంచుతున్నారు. ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ఎంత ఖర్చు పెడుతున్నారో చెప్పండి’’ అంటూ సబితా ప్రశ్నించారు.ఏడాది కాలంగా విద్యలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు?. ఎన్ని నియోజక వర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రణాళిక ఏంటో ప్రభుత్వం స్పష్టం చేయాలి. పెండింగ్ 8 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించండి. భవనాలు మాత్రమే కడితే సరిపోదు. సిలబస్లో ఏం మార్పు తెస్తున్నారు. ఆ స్కూళ్లలో ఎవరికి అడ్మిషన్స్ ఇస్తారు. సైనిక్, నవోదయ, మోడల్, మన ఊరూ-మన బడి, మండల స్థాయి స్కూళ్లను ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పాలి...మా హయంలో ఉద్యోగాలే ఇవ్వలేదనీ రేవంత్ మాట్లాడుతున్నాడు. ఏడాదికి మీరు ఇస్తామన్న ఉద్యోగాలు ఇచ్చారా?. కుల వృత్తులకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే బర్లు, గొర్లు పంచారు. రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలతో వెట్టి చాకిరి చేయిస్తున్నారు.’’ అంటూ సబితా మండిపడ్డారు. -
మాకూ కేబినెట్లో చోటివ్వండి..!
ఢిల్లీ : తెలంగాణ కేబినెట్ విస్తరణ పంచాయితీ మరోసారి ఢిల్లీకి చేరింది. తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం పలుమార్లు చర్చలు జరిపి ఇప్పటికే నివేదిక సిద్ధం చేసి పెండింగ్ లో పెట్టింది. తెలంగాణ కేబినెట్ పునఃవ్యవస్థీకరణలో మంత్రి పదవులు తమకు కావాలంటే తమకు కావాలనే కాంగ్రెస్ నేతలు వరుసగా ఢిల్లీకి క్యూకట్టిన తరుణంలో ఆ నివేదికను అధిష్టానం పక్కన పెట్టేసింది. అయితే ప్రస్తుతం మాదిగ కులానికి చెందిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఢిల్లీకి చేరుకున్నారు. తమ కులానికి కూడా కేబినెట్ లో పెద్ద పీట వేయాలని వారు పట్టుబడుతున్నారు.తెలంగాణ కేబినెట్ విస్తరణలో తమ కులానికి అవకాశం కల్పించాలంటూ అధిష్టానం పెద్దలను కలవడానికి వారు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ అపాయింట్ మెంట్ కోరారు.మాది న్యాయమైన డిమాండ్..‘మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం గురించి సీఎం, పీసీపీ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కి తెలిపే ఢిల్లీ వచ్చాం. మాది న్యాయమైన డిమాండ్. మాదిగ కులస్తునికి ఖచ్చితంగా కేబినెట్ లో స్థానం కల్పించాలి. తెలంగాణలో మాదిగ సామాజికవర్గం పెద్ద సామాజిక వర్గం. మాదిగ సామాజిక వర్గ ప్రజలకు న్యాయం జరగాలంటే మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గ ప్రతినిధి ఉండాలి. మాదిగ వర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కి అండగా ఉంది. మాలలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం పట్ల మాకు అభ్యంతరం లేదు. మంత్రివర్గంలో ఎవరుండాలనేది నిర్ణయించేది అధిష్టానం కాబట్టి ఢిల్లీ వచ్చాం. మంత్రివర్గంలో మాదిగలకు కచ్చితంగా స్థానం లభిస్తుందని ఆశిస్తున్నాం. మొదటి కేబినెట్ ఏర్పాటులో మాకు అవకాశం దక్కుతుందని భావించాం. ఇప్పుడు రెండోసారి కేబినెట్ విస్తరణ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మరోసారి మాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. మాదిగ సామాజిక వర్గంలో ఏ ఎమ్మెల్యేకు అవకాశం ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు’ అని వారు స్పష్టం చేశారు. అడ్లూరు లక్ష్మణ్, మందుల సామెల్, కవ్వం పల్లి సత్యనారాయణ, లక్ష్మీ కాంతారావు ఢిల్లీకి వెళ్లిన వారిలో ఉన్నారు,. ఈరోజు(గురువారం) అధిష్టానం పెద్దలను వీరు కలిసే అవకాశం ఉంది. -
అవును.. కవిత చెప్పింది నిజమే: ఎమ్మెల్యే రాజా సింగ్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలనే ప్రతిపాదన వచ్చిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సమర్ధించారు.గురువారం పార్టీలోని కోవర్టులే తనని ఓడించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 25ఏళ్లుగా కేసీఆర్కు లేఖలు రాస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్క లేఖ కూడా లీకు కాలేదు. కానీ ఈ సారి రాసిన లేఖ ఎలా బహిర్ఘతం అయ్యింది. ఆ లీకు వీరులెవరో చెప్పాలి. నేను జైల్లో ఉండగా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరిగింది.నేను పార్టీలో ఉంటే అది సాధ్యం కాదని, తనని కేసీఆర్కు దూరం చేయాలని చూస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.అయితే, కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రాజా సింగ్.. ఆఫ్ ద రికార్డు కవిత మాట్లాడినది నిజమే అని నేను అనుకుంటున్నాను. పెద్ద ప్యాకేజీ దొరుకుతే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్తోనే కలిసిపోతారు. మా వాళ్లు కుమ్మక్కయ్యారు కాబట్టే బీజేపీకి నష్టం’ అని వ్యాఖ్యానించారు. -
కేటీఆర్పై విరుచుకుపడ్డ కవిత.. నాతో పెట్టుకోవద్దు..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో ఉన్న కోవర్టులే తనను ఓడించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఇంటి ఆడ బిడ్డపైనే పేయిడ్ వార్తలు రాయిస్తున్నారు. లేఖ ఎవరు బయటపెట్టారో చెప్పమంటే నాపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో కేటీఆర్ను టార్గెట్ చేసి విమర్శలు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలి.. కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా? అని ప్రశ్నించారు. తనది బీఆర్ఎస్ పార్టీనే. కొత్త పార్టీలు ఎందుకు?. ఉన్న పార్టీని, కేసీఆర్ను కాపాడుకుంటే సరిపోతుంది. లీక్ వీరులను బయట పెట్టండి అంటే గ్రీక్ వీరులు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత తాజాగా చిట్చాట్లో మాట్లాడుతూ.. ఏది ఉన్నా నేను సూటిగానే మాట్లాడతాను. వెన్నుపోటు రాజకీయాలు చేయను. నేను కేసీఆర్ లాగే నేను ఏదైనా సూటిగానే మాట్లాడతాను. తిక్క తిక్కగానే ఉంటాను. పార్టీని నడిపించే సత్తా మీకు లేదు.. నాకు నీతులు చెబుతున్నారా?. వరంగల్ మీటింగ్ సక్సెస్ అయ్యిందని చెప్పుకుంటున్న వాళ్లను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఏమైనా ఉంటే.. పార్టీ ఫోరమ్ లోపల మాట్లాడాలి అన్నారు. నేను బయటే మాట్లాడతాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ సోయితో పరిపాలన జరగట్లేదు అని అన్నారు. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదు.. ఏది ఉన్నా నేను ముక్కు సూటిగానే మాట్లాడతాను.ట్వీట్లకే పరిమితం అయితే ఎలా?..అంతర్గత విషయాలపై లేఖ రాస్తే ఎందుకు బయటపెట్టారు. నేను రాసిన లేఖను ఎవరు బయటపెట్టారు. బీఆర్ఎస్లో నాకు ఒకే నాయకుడు కేసీఆర్.. నాకు ఇంకెవరూ నాయకులు లేరు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీరించను. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలి.. కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా?. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన చేసే కార్యచరణ చేయనివ్వండి. నాది బీఆర్ఎస్ పార్టీనే. కొత్త పార్టీలు ఎందుకు?. ఉన్న పార్టీని, కేసీఆర్ను కాపాడుకుంటే సరిపోతుంది. నేను కాంగ్రెస్తో 2013లోనే మాట్లాడాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడలేదు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని సెటైర్లు వేశారు. బీజేపీ వాళ్లు కట్టిన ఆసుపత్రి ఓపెనింగ్కి వెళ్ళిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని అన్నారు. నేను అసలే మంచి దాన్ని కాదు..డబ్బులు ఇచ్చి నాపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. నన్ను అరెస్ట్ చేసే సమయంలో కేసీఆర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అని అడిగితే కేసీఆర్ వద్దని చెప్పినట్టు తెలిపారు. పార్టీ చేయలేని పనులను జాగృతి తరఫున నేను చేసి చూపించాను. కేసీఆర్ తప్ప ఇప్పుడు నన్ను విమర్శిస్తున్న వారు ఏం చేశారో చెప్పాలి. నేను ఎప్పుడూ పదవులు అడగలేదు. కేసీఆరే నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పార్టీ నడిపించే సత్తా లేదు.. నాకు నీతులు చెబుతున్నారా అని మండిపడ్డారు. నేను కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ కోసం పోరాటం చేశాను. నేను మంచి దాన్ని కాదు.. నాతో పెట్టుకోవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్.. అలాగే, పార్టీ చేసే పనులు నేను సగం చేస్తున్నాను. అందుకే తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. కేసీఆర్కి కాళేశ్వరం నోటీసులు ఇస్తే.. పార్టీ పరంగా ఏం చేశారు?. తెలంగాణ తల్లి విగ్రహం మారిస్తే.. ఈ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది?. అదానీ టీ షర్ట్స్ వేసుకొని హంగామా చేసి వదిలేశారు.పార్టీ కోసం కేసీఆర్కు వంద లేఖలైనా రాస్తాను. నేను 25 ఏళ్ల నుంచి కేసీఆర్కు లేఖలు రాస్తున్నాను. ప్రతీసారి లేఖలు చూడగానే కేసీఆర్ వాటిని చించేస్తారు.. కానీ, ఈసారి ఏమైందో లేఖ బయటకు వచ్చింది. అలాంటి లేఖను ఎందుకు బయట పెట్టారు. నేను జైలులో ఉన్న సమయంలో బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ, నేను బీజేపీలో కలపవద్దని చెప్పాను. వందకు 101 శాతం బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్రయత్నం జరుగుతోంది. నేను పార్టీలో ఉంటే బీఆర్ఎస్.. బీజేపీలో కలిసే అవకాశం ఉండదు. నేను ఉంటే అది కుదరని పని.. అందుకే నన్ను కేసీఆర్కు దూరం చేయాలని చూస్తున్నారు. నేను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను. ఇవాళ తెలంగాణ వ్యతిరేకులు పనిచేస్తున్నారు. అది అడ్డుకునే ప్రయత్నం పార్టీ చేయట్లేదు. కేసీఆర్ను ఎప్పుడు కలిసేది ఇప్పుడు చెప్పలేను.. డెడ్లైన్ అంటూ ఏమీ లేదు’ అని చెప్పుకొచ్చారు. -
ఆంధ్రజ్యోతిది జర్నలిజమా.. శాడిజమా?: కవిత
సాక్షి, హైదరాబాద్: పార్టీలో సముచిత స్థానం ఇవ్వకుంటే తాను కొత్త పార్టీ పెడతానంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనంపై ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కాంగ్రెస్లో చేరేందుకు రాయబారం చేస్తున్నారని వచ్చిన కథనంపైనా ఆమె మండిపడ్డారు. హస్తం గూటికి చేరుకునేందుకు మధ్యవర్తి ద్వారా కవిత సంప్రదింపులు జరుపుతున్నారంటూ ఆ పత్రికలో రాయడంపై బుధవారం ‘ఎక్స్’వేదికగా సీరియస్ అయ్యారు. ‘కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా లేక శాడిజమా?’అని ప్రశ్నించారు. కేసీఆర్తో తాడోపేడో తేల్చుకోవాలని కవిత అనుకుంటున్నారని సదరు పత్రికలో వచ్చిన కథనంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మన ప్రత్యర్థి బీఆరెస్సా.. బీజేపీనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీలో తాజా పరిణామాలు ఏంటి? అని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ ఆరా తీశారు. బుధవారం ఆమె ఏడు పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన నేతలతో ముఖాముఖి సమావేశమయ్యారు. హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులతో విడివిడిగా సమావేశమయ్యారు. ‘క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితేంటి? కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు ఎలా జరుగుతోంది? ప్రభుత్వం గురించి ప్రజలేమనుకుంటున్నారు? పార్టీ పదవులు ఇచ్చేందుకు పరిగణనలోకి తీసువాల్సిన ప్రాతిపదిక ఏంటి? తెలంగాణలో అసలైన రాజకీయ ప్రత్యర్థిగా బీఆర్ఎస్ను పరిగణించాలా? బీజేపీని తీసుకోవాలా? ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? ఆదిలాబాద్ జిల్లాల్లో పార్టీ పూర్తిగా వెనుకబడటానికి కారణమేంటి? అని నేతలను ప్రశ్నించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, పార్టీ నేతల జవాబులను ఆమె నోట్ చేసుకున్నారని, ఈ సమాచారాన్ని క్రోడీకరించి అధిష్టానానికి నివేదిక అందజేస్తారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వంతో సమన్వయం ఉండాలి ఒక్కో నేతకు 10 నిమిషాల సమయం ఇచ్చిన మీనాక్షి.. పలు అంశాలపై సమాచారం రాబట్టారు. సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు లాంటి పథకాలు ప్రభుత్వానికి ప్రజల్లో మైలేజీ తెస్తున్నాయని కొందరు ఎమ్మెల్యేలు చెప్పగా.. మరికొందరు పలువురు మంత్రుల వ్యవహారశైలిపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఆపరేషన్ సిందూర్ను అకస్మాత్తుగా విరమించుకోవటంతో బీజేపీ, ప్రధాని మోదీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, బీఆర్ఎస్లో కుటుంబ కలహాలతో కేడర్ నిస్తేజంగా మారిందని కొందరు నేతలు తెలిపారు. ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే సానుకూల ఫలితాలు వస్తాయని సూచించినట్లు సమాచారం. నేతల మధ్య సమన్వయ లేమితోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినట్లు కొందరు తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్లు తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరినట్టు సమాచారం. సరస్వతి పుష్కరాల సందర్భంగా అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని పెద్దపల్లి ఎంపీ వంశీ, ఆయన తండ్రి వివేక్ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం ఉండాలని.. అందరూ సర్దుకుపోయి పనిచేయాలని మీనాక్షి నేతలకు సూచించినట్లు సమాచారం. గురువారం మిగిలిన లోక్సభ నియోజకవర్గాల నేతలతో మీనాక్షి నటరాజన్ సమావేశమవుతారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. పార్టీ బలోపేతం గురించి అడిగారు: రేఖా నాయక్ మీనాక్షితో భేటీ తర్వాత పలువురు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు మీడియాతో మాట్లాడారు. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్ మాట్లాడుతూ.. పార్టీని భవిష్యత్తులో ఎలా బలోపేతం చేయాలన్న అంశంపై మీనాక్షి మాట్లాడారని చెప్పారు. ఇందుకు గల వ్యూహం గురించి, భవిష్యత్తు సవాళ్లను ఎలా అధిగమిస్తారనే విషయాల గురించి మాట్లాడారని వివరించారు. డీసీసీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పినట్లు తెలిపారు. నేను చెప్పాల్సింది చెప్పా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్కు తాను చెప్పదల్చుకున్న విషయాలన్నింటినీ చెప్పానన్నారు. తనకు మీడియాలో కనిపించాలన్న తాపత్రయం లేదన్న ఆయన.. అన్ని విషయాలను ఇన్చార్జికి వివరించినట్లు వెల్లడించారు. తాను కూడా మంత్రిపదవికి అర్హుడనేనని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. చాలా రోజుల క్రితమే తన మనసులో మాటను సీఎం రేవంత్రెడ్డికి చెప్పానని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా అడిగానని వెల్లడించారు. మీనాక్షి ఓ డాక్టర్ మీనాక్షి నటరాజన్ డాక్టర్ పని చేస్తున్నారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. త్వరలోనే సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్లతో కలిసి ఆమె తగిన ట్రీట్మెంట్ కూడా ఇస్తారని, పారీ్టలో అన్నీ సెట్ చేస్తారని చెప్పారు. తన నియోజకవర్గ సమస్యలేవైనా ఉంటే లేఖ రూపంలో ఇవ్వాలని మీనాక్షి అడిగారని వెల్లడించారు. కార్యకర్తలపై ఫోకస్ పెట్టాలని సూచించినట్లు పేర్కొన్నారు. -
సీఎం రేవంత్ రైతులకు క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్ విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చేసిన వాదనలు తప్పులతడక అని తేలిన నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు తరహాలో మేడిగడ్డ బరాజ్ను పునరుద్ధరించాలన్నారు. నాణ్యత లేనిది కాళేశ్వరం ప్రాజెక్టులో కాదని, కాంగ్రెస్, బీజేపీలే చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కనీస నాణ్యత పరీక్షలు చేయకుండా, శాస్త్రీయడేటాను సేకరించకుండా ఎన్డీఎస్ఏ రూపొందించిన నివేదికను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ తిరస్కరించడమే దీనికి సాక్ష్యమని పేర్కొన్నారు. లండన్ పర్యటనలో ఉన్న కేటీఆర్ ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ను బదనాం చేసేందుకు, పార్టీని దెబ్బతీసేందుకు ఎన్డీఎస్ఏ ఈ నివేదిక ఇచ్చిందని మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ నివేదిక బూటకం ఎల్అండ్టీ తాజా ప్రకటనతో మేడిగడ్డ బరాజ్పై ఎన్డీఎస్ఏ ఇచి్చన నివేదిక బూటకమని బయట పడిందని కేటీఆర్ అన్నారు. ఊహాజనితమైన నివేదికను క్రూర రాజకీయ ఎజెండాతో కాంగ్రెస్, బీజేపీ కేంద్ర కార్యాలయాల్లో తయారు చేశారని మండిపడ్డారు. పనికిరాని ఆ నివేదిక తమకు ప్రామాణికమని సీఎం రేవంత్ చెప్పడం ప్రభుత్వ అసమర్థ, దివాలాకోరు విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. రేవంత్ నిర్వాకం వల్ల ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంట ఎండి, 500మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండా ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను ఎల్అండ్టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని కేటీఆర్ అన్నారు. ఏ మూలకు వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన బీఆర్ఎస్కు చెందిన ఎన్ఆర్ఐ నేతలతో సమావేశమయ్యారు. యునైటెడ్ కింగ్డమ్ (యూకే) లోనూ పార్టీ రజతోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. అలాగే అమెరికాలోని డాలస్ నగరంలో జూన్ 1వ తేదీన సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇదే క్రమంలో త్వరలో యూకేలోను సంబరాలు నిర్వహిస్తామని, ఈ సంబరాలకు స్వయంగా తాను హాజరు కావడంతో పాటు పార్టీ సీనియర్ నేతలు, తెలంగాణ కళాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వస్తారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న దోపిడీ, అరాచకాలు, ప్రజలపై వేధింపులను బాగా ఎండగడుతున్నారని యూకే ఎన్ఆర్ఐ నేతలను కేటీఆర్ ప్రశంసించారు. ఇంగ్లండ్లో ఉన్న సోషల్ మీడియా వారియర్స్పై కూడా అక్రమ కేసులు పెట్టినా ఎక్కడా తగ్గకుండా రేవంత్ ప్రభుత్వ దాషీ్టకాలను ప్రశ్నిస్తున్నారన్నారు. అలాగే తెలంగాణ ప్రగతికి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. అనిల్ కూర్మాచలంకు పరామర్శ గుండెకు సంబంధించిన అనారోగ్యంతో శస్త్ర చికిత్స చేయించుకుని లండన్లో కోలుకుంటున్న బీఆర్ఎస్ నాయకుడు, ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలంను కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యస్థితిపై వాకబు చేశారు. -
ఎన్ని కుట్రలు సృష్టించినా వాస్తవమే నిలుస్తుంది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎఎస్ ఇచ్చిన నివేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ ఇచ్చిన నివేదికను ఎల్ అండ్ టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా చెంపపెట్టు లాంటిదే అంటూ విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎఎస్ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయింది. కనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఎస్ఏ తుది రిపోర్టు ఎలా ఇస్తుందని ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పులతడక అని రుజువైపోయింది. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ ఇచ్చిన నివేదికను ఎల్ అండ్ టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా చెంపపెట్టు లాంటిదే.నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ గంటల వ్యవధిలో ఇచ్చిన ప్రాథమిక నివేదికను మొదలుకుని, ఏడాదిన్నర దాకా సాగదీసి ఇటీవల ఇచ్చిన తుది నివేదిక వరకూ రెండింటిలోనూ అడుగడుగునా వ్యత్యాసాలు, పొంతనలేని అంశాలుండటం రిపోర్టు డొల్లతనాన్ని బయటపెట్టింది. ఇలాంటి పనికిరాని రిపోర్టును పట్టుకుని ఎన్డీఎస్ఏ నివేదికనే తమకు ప్రామాణికమని ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి, దివాలాకోరు విధానాలకు నిదర్శనం.కేసీఆర్ గారికి పేరొస్తుందనే రాజకీయ కక్షతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను పక్కనపెట్టి సీఎం రేవంత్ క్షమించరాని పాపం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండగొట్టి, 500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలకు కారణమయ్యారు.మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎఎస్ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందికనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఎస్ఏ తుది రిపోర్టు ఎలా ఇస్తుందని ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పులతడక అని…— KTR (@KTRBRS) May 28, 2025పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా శరవేగంగా పునరుద్ధరించిన సంగతి మరిచిపోయి, మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్టునే కోల్డ్ స్టోరేజీలోకి నెట్టడం అత్యంత దుర్మార్గం. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్పై బురదజల్లేందుకు కుట్రలు చేసిన కాంగ్రెస్-బీజేపీ, ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభను దెబ్బతీయాలన్న కుతంత్రాలతోనే తుది నివేదిక పేరిట నయా డ్రామాకు తెరతీశారు.ప్రాజెక్టు ప్రణాళికల నుంచి నిర్మాణ నాణ్యత వరకూ అడుగడుగునా ఎక్కడా రాజీ పడకుండా కట్టిన ప్రాజెక్టుపై బురదజల్లడం మాని, ఇకనైనా ఎల్ అండ్ టీ అభ్యంతరాలకు ప్రభుత్వం, ఎన్డీఎస్ఏ సమాధానం చెప్పాలి. ఎన్డీఎస్ఏ వాదనలన్నీ తప్పుల తడక అని తేలిపోయిన నేపథ్యంలో.. దీన్ని కుంటిసాకుగా చూపి దాటవేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.ఇకనైనా పోలవరం తరహాలో పునరుద్ధరణ చర్యలు చేపట్టి తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలి. లేకపోతే అన్నదాతల ఆగ్రహానికి ముఖ్యమంత్రితోపాటు కాంగ్రెస్-బీజేపీల కుట్ర రాజకీయాలకు తెలంగాణ రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం’ అంటూ హెచ్చరించారు. -
కవిత లేఖ టీకప్పులో తుపానేనా?
ప్రతిపక్షంలో ఉండగా రాజకీయ పార్టీలకు సంక్షోభాలు సహజం. తెలంగాణలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లోనూ ప్రస్తుతం ఒక సంక్షోభం నెలకొని ఉంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత లేఖ రాయడం సహజంగానే కలకలం సృష్టించింది. తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో.. ఏడాదిన్నర కాలంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్కు ఇది చికాకు కలిగించేదే. కేడర్ను గందరగోళంలో పడేసేదే.కవిత లేఖ ఒక ఎత్తు.. అమెరికా నుంచి తిరిగి వస్తూనే విమానాశ్రయంలోనే చేసిన వ్యాఖ్యలు ఇంకో ఎత్తు. ఒకపక్క కేసీఆర్ దేవుడంటూనే.. ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని చెప్పి కవిత బీఆర్ఎస్ను ఇరుకున పెట్టారు. తన లేఖను బయటపెట్టిన కోవర్టులెవరన్న ప్రశ్న కూడా సంధించి దాంతో తనకు సంబంధం లేదని చెప్పారన్నమాట. పార్టీలో కేసీఆర్ తరువాత అత్యంత ప్రముఖులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్లు మరి కొంతమంది మాత్రమే. కవిత తన లేఖను ఎవరి ద్వారా కేసీఆర్కు పంపారో తెలియదు కానీ.. పార్టీ ప్రముఖుల్లోనే ఎవరో ఒకరు దాన్ని బయటపెట్టారన్నది ఆమె భావన కావచ్చు.అయితే, ఈ లేఖ లీక్ కావాలని, ప్రజల్లోకి వెళ్లాలని కవిత కూడా కోరుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా నుంచి రాగానే విమానాశ్రయంలోనే లేఖ విషయాలను హడావుడిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. తండ్రి, సోదరుడితో సంప్రదింపుల తరువాత కూడా వ్యాఖ్యానించి ఉండవచ్చు. అలా కాకుండా పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసినా దేవుడు, దెయ్యం వంటి డైలాగులు వాడారంటే ఆమె ఆంతర్యంపై పలు రకాల విశ్లేషణలు వస్తాయి. ఈ విషయం కవితకూ తెలుసు. పైగా ఆమె మద్దతుదారులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు సీఎం, సీఎం అని నినాదాలు ఇవ్వడం, ప్లకార్డులు, బ్యానర్లలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ల ఫోటోలు లేకపోవడం చూస్తే ప్రణాళిక ప్రకారమే కవిత విమానాశ్రయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టమవుతుంది.అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇప్పుడిప్పుడే పార్టీ పుంజుకుంటున్న తరుణంలో ఈ దుమారం చెలరేగడం కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోందన్న అనుమానాలు పార్టీ కేడర్లో రేకెత్తిస్తాయి. కవిత ఇకపై ఏం చేస్తుందన్న ఆందోళన కూడా ఏర్పడుతుంది. కేసీఆర్ స్పందన కోసం అంతా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతానికైతే కేసీఆర్ స్వయంగా స్పందించకపోగా.. ఇతరులు కూడా రియాక్ట్ కావద్దని సూచించారు. కేటీఆర్ ఆయనను కలిసిన తర్వాత కూడా కొత్త పరిణామాలేవీ లేకపోవడం ద్వారా పార్టీ వేచి ఉండే ధోరణిని పాటిస్తోందని అనుకోవాలి. అదే సమయంలో ఎల్లో మీడియా గతంలో వైఎస్ షర్మిలను రెచ్చగొట్టినట్లు తెలంగాణలో కవితను కూడా రెచ్చగొడుతున్నారన్న అనుమానం ఉంది. దానికి తగినట్లే ఆమె పార్టీ పెడతారని, సోషల్ మీడియాలో ఆమెకు అనుకూలంగా కామెంట్లు వస్తున్నాయని టీడీపీకి మద్దతిచ్చే ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. కవిత కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ఆ పార్టీనే వెనుకాడుతోందని కూడా ఈ ఎల్లో మీడియా కథనాన్ని ఇచ్చింది. జాగృతి కార్యకర్తలు దీన్ని ఖండించవచ్చు కానీ జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.షర్మిలను రాజకీయంగా వాడుకుని ఆ తర్వాత ఆమెను విఫల ప్రయోగం అని ఎల్లో మీడియా వారే తేల్చేశారు. కవిత పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఉంటుందా అన్న చర్చ ఉంది. కవిత లేఖ ఆధారంగా కాంగ్రెస్, బీజేపీలు రకరకాల వ్యాఖ్యలు చేసి బీఆర్ఎస్ను ఆత్మరక్షణలో పడేయడానికి ప్రయత్నించాయి. కుటుంబ పంచాయతీ అని, డ్రామా అని, ఆస్తుల తగాదా అని ఈ పార్టీలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వంటి వారు ఆమె సొంత పార్టీ పెడతారని అనే వరకు వెళ్తున్నారు. అంతదాకా వెళతారా అన్నది అప్పుడే చెప్పలేం కానీ పార్టీలో తన ప్రాముఖ్యత పెంచుకోవడానికి యత్నించవచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేత పొన్నం ప్రభాకర్ ఇదంతా బీజేపీ-బీఆర్ఎస్ డ్రామా అంటున్నారు. కేంద్ర మంత్రి బీజేపీకి చెందిన బండి సంజయ్ కవితను కాంగ్రెస్ వదలిన బాణంగా విమర్శిస్తున్నారు. ఇంకో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదంతా డాడీ, డాటర్ డ్రామా అని వ్యాఖ్యానించారు.కుమార్తె తన తండ్రికి లేఖ రాస్తే తప్పేమిటని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ ప్రశ్నిస్తున్నా.. లేఖలోని విషయాలు, ఒక రాజకీయ పార్టీ అధినేతకు వేసిన ప్రశ్నలు కచ్చితంగా చర్చనీయాంశాలే. ఫీడ్ బ్యాక్ పేరుతో కవిత పార్టీ రజతోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశం తాలూకూ లోటుపాట్లను ఒక జర్నలిస్టులా, విశ్లేషకురాలిగా తన లేఖలో ఎత్తి చూపింది. ఒక వ్యాసంలా సాగిన ఈ లేఖలో కొన్ని పాజిటివ్ పాయింట్లు ఉన్నా.. నెగిటివ్ పాయింట్లే ఎక్కువ. కేసీఆర్ నాయకత్వ పటిమపై కవితకు సందేహం కలిగినట్టుగా ఈ లేఖలోని వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. అలాగే.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో సోదరుడు కేటీఆర్.. పార్టీని నడుపుతున్న నేపథ్యంలో కవితలో ఏదో అసంతృప్తి కూడా ఏర్పడినట్లు స్పష్టమవుతోంది.వరంగల్ సభలో వేదికపై కేసీఆర్తో పాటు కేటీఆర్ ఫోటో మాత్రమే ఉండటం కూడా ఆమె అసంతృప్తికి కారణమై ఉండవచ్చు. ఏప్రిల్ 27న జరిగిన పార్టీ రజతోత్సవ సభ విజయవంతం అయిందని.. కేసీఆర్ ప్రసంగాన్ని శ్రద్దగా విన్నారని, కాంగ్రెస్ ఫెయిల్ అని సభికులతో చెప్పించడం, ముఖ్యమంత్రి రేవంత్ పేరును కేసీఆర్ తీయకపోవడం వంటివి కవితకు నచ్చాయట. అయితే, అదే సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, తెలంగాణ గీతం గురించి మాట్లాడకపోవడాన్ని ఆమె ఆక్షేపించారు. కేసీఆర్ ప్రసంగంలో మరింత పంచ్ని ప్రజలు ఆశించారని ఆమె చెబుతున్నారు. అయినా ఈ సభతో కార్యకర్తలు, నాయకులు సంతృప్తిగానే ఉన్నారని అంటున్నారు. వారంతా సంతృప్తిగా ఉంటే పనికట్టుకుని కవిత ఈ లేఖ రాసి నెగిటివ్ పాయింట్లపై ఫోకస్ పెట్టవలసిన అవసరం ఏమిటో తెలియదు.నెగిటివ్ పాయింట్ల గురించి చెబుతూ, ఉర్దూలో మాట్లాడకపోవడం, ఎస్సీ వర్గీకరణ, వక్ఫ్ బిల్లు ప్రస్తావన లేకపోవడం, సభ నిర్వహణ ఎవరో పాత ఇంఛార్జీలకు అప్పగించడం నచ్చలేదని అంటున్నారు. సభలో ఇతర నేతలు మాట్లాడే అవకాశం లేకపోవడాన్ని ఆమె తప్పు పట్టారు. సాధారణంగా ఎక్కువ మంది నేతలు ఇలాంటి సభలలో మాట్లాడుతుండే వారు. కానీ, ఈసారి కేసీఆర్ మాత్రమే మాట్లాడారు. ఇది కొంత ఆశ్చర్యంగానే ఉంది. కార్యకర్తల ధూంధాం విఫలమైందని కవిత అభిప్రాయపడ్డారు. బీజేపీపై రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడతారా అని కేసీఆర్ను ఆమె నిలదీశారు. భవిష్యత్తులో పొత్తు ఉంటుందేమోనని ఊహాగానాలకు ఆస్కారం కలిగిందని ఆమె విశ్లేషించారు. బీజేపీతో తాను వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డ విషయాన్ని గుర్తు చేసుకున్నారు.అయితే, ఎన్నికల ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పేరు రావడం వల్ల బీఆర్ఎస్కు కూడా ఇబ్బంది అయిన విషయాన్ని కూడా మర్చిపోరాదు. కాంగ్రెస్ పై క్షేత్ర స్థాయిలో నమ్మకం పోయినా, బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందేమోనన్న ఆలోచన పార్టీ శ్రేణులలో ఉందని కవిత అనడం సంచలనమే. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, మళ్లీ పార్టీని పట్టాలెక్కించేందుకు తంటాలు పడుతున్న తరుణంలో కవిత ఈ మాటలు అనడం నష్టమే. కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ, దిశానిర్దేశం చేయలేకపోయారని కూడా ఆమె తప్పుపట్టారు. ఒకటి, రెండు రోజులు ప్లీనరీ నిర్వహించి పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తీసుకుని ఉండాల్సిందని ఆమె అన్నారు. బహిరంగ సమావేశాలలో అభిప్రాయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. కవిత లేఖ సారాంశం.. పార్టీ ఆశించినంత బాగా నడవడం లేదు అన్నది అనిపిస్తుంది. కేటీఆర్తో సంబంధాలేమైనా దెబ్బతిన్నాయా అన్న అనుమానం కలుగుతుంది.కొద్ది రోజుల క్రితం హరీశ్రావు ఇంటికి వెళ్లి కేటీఆర్ రెండుగంటలు భేటీ అయి.. అంతా బాగుందన్న భావన కలిగించడానికి యత్నిస్తే, సోదరి రూపంలో ఈ కొత్త సమస్య వచ్చింది. అయితే, కవిత మరీ అధికంగా స్పందిస్తే ఆమెకే నష్టం. దేవుడి చుట్టూ దెయ్యాలు ఉన్నాయని అనడం ద్వారా తండ్రిని ఆమె గౌరవించినట్లా? లేక అవమానించినట్లా అన్న చర్చ జరుగుతోంది. పురాణాలలో దెయ్యాల మధ్యలో దేవుడు ఎక్కడైనా కనిపించారా?. తండ్రికి తన లేఖలో‘సారీ’ చెబుతూ ముగించినా, ఆమె ఎయిర్ పోర్టులో చేసిన ఘాటైన వ్యాఖ్యలతో ఆ ‘సారీ’కి అర్థం లేకుండా పోయింది. ‘అనుబంధం, ఆత్మీయత అంతా ఒక నాటకం.. ఆత్మ తృప్తికై ఆడుకునే వింత నాటకం’ అని ఒక కవి అంటాడు. ఇటువంటి రాజకీయాలు చూస్తే ఆ మాట నిజం అనిపిస్తుంది కదా!. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఎందుకీ సాగదీత?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరోమారు చర్చనీయాంశమవుతోంది. గత నాలుగైదు రోజులుగా ఢిల్లీ వేదికగా రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయం నడుస్తుండడం, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ పార్టీ పెద్దలతో చర్చల కోసం వెళ్లడం, నీతి ఆయోగ్ సమావేశం కోసం వెళ్లిన సీఎం రేవంత్ ఆ తర్వాత ఒకరోజంతా అక్కడే వేచి ఉండడం, పీసీసీ అధ్యక్షుడితో సమావేశమైన అధిష్టానం పెద్దలు ఈనెల 30న మరోమారు రావాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సమాచారమిచ్చిన నేపథ్యంలో అసలేం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంగా అదిగో.. ఇదిగో అంటూ ఊరిస్తున్న కేబినెట్ విస్తరణ కోసం ఆశావహ ఎమ్మెల్యేలు ఎదురుచూస్తుండగా, అధిష్టానం ఈసారైనా అనుమతిస్తుందా..లేదా? అన్న సంశయం రాష్ట్ర కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మంత్రివర్గ విస్తరణ విషయంలో అనేక అంశాలు బేరీజు వేసుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం లేనిపోని తలనొప్పులు ఇప్పుడెందుకనే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ నెల 30 తర్వాత పీసీసీ కార్యవర్గ ప్రకటనతోనే సరిపెడుతుందని, మరికొన్ని రోజుల తర్వాతే కేబినెట్ విస్తరణ ఫైల్ను కదిలిస్తుందనే అభిప్రాయం గాం«దీభవన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.ఈ పీటముడులు వీడవా?రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ విషయంలో పడిన పీటముడులు వీడేవి కావనే అభిప్రాయానికి అధిష్టానం పెద్దలు వచ్చారనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. జనగణనలో కులగణన చేసి బీసీల లెక్క తేల్చాలని, ఎవరి వాటా ఎంతో తేల్చాలని కోరుతున్న కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు రాష్ట్ర మంత్రివర్గంలో బీసీ నేతలకు ఎన్ని బెర్తులిస్తారన్న దానిపై స్పష్టత లేదు. ఇప్పుడున్న రెండింటికి తోడు మరొకటి వస్తుందని అనుకుంటున్నా.. ఆ తర్వాత ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు.ఇక జిల్లాలు, సామాజిక వర్గాల వారీగా కుదరని పొంతన, టీపీసీసీ కార్యవర్గానికి, కార్పొరేషన్ చైర్మన్ పోస్టులకు, అసెంబ్లీలో ఇచ్చే పదవులకు మంత్రివర్గ విస్తరణతో లింకు పెట్టడం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధిష్టానం పక్షాన ఇచి్చన హామీలను నెరవేర్చడం, సీఎం అభిప్రాయం, ఇతర సీనియర్ల ప్రతిపాదనలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నివేదికలు... ఇలా కావాల్సినన్ని పీటముడులు ఉన్న ఈ అంశం అసలు పరిష్కారమయ్యే మార్గం కూడా దొరకడం లేదనేది బహిరంగ రహస్యమని అంటున్నారు. మరోవైపు ఇద్దరు, ముగ్గురు మంత్రుల పనితీరు ఆశాజనకంగా లేదన్న రిపోర్టులు కూడా ఈ సాగదీతకు కారణమని తెలుస్తోంది. దీంతో మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రక్షాళన కూడా చేయాలనుకుంటే ఇంకో ఆరు నెలల సమయమిచి్చ, పనితీరు సరిగా లేని వారిని కూడా పక్కనపెట్టి, వారి సామాజిక వర్గాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఒకేసారి విస్తరణ పూర్తి చేస్తే బాగుంటుందనే యోచనలో కాంగ్రెస్ పెద్దలున్నట్టు సమాచారం.ఏకాభిప్రాయమెలా సాధ్యం? మంత్రివర్గ విస్తరణ కోసం అటు ఢిల్లీ పెద్దలు, ఇటు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులు పలుమార్లు చర్చలు జరిపారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా దీపాదాస్ మున్షీ ఉన్నప్పటి నుంచే ఇటు సీఎం నివాసం, అటు ఏఐసీసీ కార్యాలయం వేదికగా చాలాసార్లు సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి, సీనియర్ మంత్రి ఉత్తమ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్లు భేటీ అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాందీతో కూడా చర్చోపచర్చలు జరిపారు.చివరకు మార్చి నెలలో పార్టీ పెద్దలను కలిసిన సందర్భంగా ఇక అన్ని చర్చలు అయిపోయాయని, తమ ప్రతిపాదనలన్నింటినీ అధిష్టానం ముందుంచామని, విస్తరణ బంతి అధిష్టానం కోర్టులో ఉందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్రెడ్డి మాత్రం మంత్రివర్గ విస్తరణ అంశం ఫ్రీజ్ అయిందని (స్తంభించిందని), ఈ వ్యవహారాన్ని అధిష్టానమే పరిష్కరిస్తుందని అధికారికంగానే చెప్పారు. అయితే ఇంతా జరిగి, ఇన్ని చెప్పిన తర్వాత మళ్లీ ఢిల్లీ వేదికగా మంత్రివర్గ విస్తరణ చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు దేనికి సంకేతమని పార్టీ నేతలు అంటున్నారు.గతంలో కుదరని ఏకాభిప్రాయం ఇప్పుడెలా సాధ్యమవుతుందని, ఏకాభిప్రాయం పేరుతో ఈ సాగదీత ఎందుకనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పారీ్టలోని ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణ జాప్యం అంశంలో అసహనంతో ఉన్నారని, వీలున్నంత త్వరలో తమకు కేబినెట్ హోదా ఇవ్వకుంటే అమీతుమీ తేల్చుకుంటామని, తమ దారి తాము చూసుకునే పని ప్రారంభిస్తామని తమ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి.అయితే.. అనూహ్యమేప్రస్తుత పరిస్థితుల్లో ఈనెల 30వ తేదీ తర్వాత కూడా పీసీసీ కార్యవర్గ ప్రకటన మాత్రమే ఉంటుందని, మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం మరికొంత సమయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఒకవేళ మంత్రివర్గ విస్తరణకు గ్రీన్సిగ్నల్ వస్తే అది అనూహ్యమేనని, అలా జరిగినా రెండు లేదా మూడు బెర్తులు మాత్రమే భర్తీ చేస్తారని సమాచారం. మరికొంత సమయం తర్వాత మంత్రివర్గ ప్రక్షాళన చేస్తామనే సంకేతాలను ఇచ్చి ఈ బెర్తులను భర్తీ చేసే అవకాశముంటుందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. -
కవిత కొత్త పార్టీ ప్రకటన అప్పుడే.. చేరబోయేది ఎవరంటే
సాక్షి,హైదరాబాద్: ‘మై డియర్ డాడీ అంటూ’ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత .. తండ్రి కేసీఆర్కు రాసిన ఆరు పేజీల లేఖ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పుట్టించింది. అయితే, ఆ లేఖ బీఆర్ఎస్తో పాటు, ఆ పార్టీ కీలక నేతల్ని ఇరుకున పెట్టేలా ఉండడంతో నాటి నుంచి ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ కీలక నేతల గురించి, అంతర్గత వ్యవహారాల గురించి ఎక్కడో చోట మాట్లాడుతూనే ఉన్నారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నారని ఒకరు? కాదు, కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ మరొకరు బహిరంగ ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా, మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇదే తరహా సంచలన వ్యాఖ్యలు చేశారు.జూన్ 2న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లేందుకు కవిత సిద్ధమయ్యారు. కొత్త పార్టీ పెట్టిన తర్వాత కవిత పాదయాత్ర చేయనున్నారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతున్న తరుణంలో కొత్త పార్టీ పేరుతో కేసీఆర్ కుటుంబం డ్రామా ఆడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. వారి కుటుంబంలో ఎవరికి ఎవరు నచ్చకపోయినా కవిత పార్టీలోకి వెళ్లేందుకు ఇలా చేస్తున్నారని అన్నారు రఘునందన్ రావు. కేసీఆర్కు కవిత లేఖఇటీవల కేసీఆర్కు కవిత రాసిన లేఖ వెలుగులోకి వచ్చిన సమయంలో రఘునందన్ రావు కవిత, బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. కవిత రాసిన లేఖ రాజకీయ పంచాయతీ నా , ఆస్తుల పంచాయతీ నా? కవిత చెప్పినా చెప్పకున్నా తెలంగాణలో బీజేపీ బలపడుతున్నది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ కుటుంబంలో వారసత్వ చిచ్చు వచ్చింది నిజమని తెలుస్తోంది. కవితను బయటకు పంపించడం కోసం బావా, బామ్మర్దులు ఒక్కటి అయ్యారు అనే సంకేతం వారి మీటింగ్ ద్వారా ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు కొత్త పార్టీ కవిత లేఖ రాసిన రోజే కాంగ్రెస్కు సంబంధించిన పత్రిక, టీవీలలో వార్త ప్రముఖంగా వచ్చింది. కవిత కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సీఎం ఈ డ్రామా వెనకా ఉన్నట్టుగా కనిపిస్తున్నది. లేదా ఇటీవలే బీఆర్ఎస్ సిద్ధాంత కర్త, పునాది అని చెప్పుకునే వ్యక్తి హరీష్తో కొత్త పార్టీ పెట్టించాలని అన్నారు. ఇప్పుడు కవితతో పార్టీ పెట్టించి కాంగ్రెస్కు దగ్గరయ్యే ప్రయత్నం సాగుతున్నది. ఎవరేం చేసినా వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారం చేపట్టడం ఆపడం ఎవరి తరం కాదు’ అని వ్యాఖ్యానించారు. ఇవాళ ఏకంగా కవిత కొత్త పార్టీ పెట్టడమే కాదు, అందులో చేరబోయే నేతల గురించి ప్రస్తావిస్తూ రఘునందన్ రావు వ్యాఖ్యానించడం గమనార్హం. -
‘మీరే చెప్పండి.. ఇది అచ్చేదిన్ కాదా?’
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పదకొండేళ్ల పాలనపై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే విషం చిమ్ముతున్నారరంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ధ్వజమెత్తారు. మోదీ తన పాలనలో చేసిన అభివృద్ధి మీకు కనిపించడం లేదా ఖర్గే జీ.. అంటూ లక్ష్మణ్ ప్రశ్నించారు. ఈరోజు(మంగళవారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియా సమావేశం నిర్వహించారు లక్ష్మణ్,‘మోదీ పదకొండు ఏళ్ల పాలనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే విషం చిమ్ముతున్నారు. ప్రపంచంలో పదవ స్థానంలో ఉన్న భారత్ ను మోదీ నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగేలా చేశారు. మోదీ విధానాలు, కులం, వస్త్రాలపై రాహుల్ గాంధీ అవహేళన చేశారు. స్టాండప్, స్టార్టప్, మేక్ ఇన్ ఇండియాగా మోదీ తీర్చిదిద్దారు. ఉద్యోగాలు ఇవ్వడమే కాదు.. ఉద్యోగాలు కల్పించే వ్యవస్థలుగా యువతను తీర్చిదిద్దారు. జాతీయ రహదారులు, రైల్వే, వైమానిక రంగాలను అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ పాలన కన్నా వంద రెట్ల అభివృద్ధి మోదీ చేసి చూపించారు. నకిలీ విత్తనాలు అరికట్టి, కనీస మద్దతు ధరలు, సబ్సిడీలు మోదీ ప్రభుత్వం కల్పించింది. ఇది అచ్చేదిన్ కాదా ఖర్గే చెప్పాలి. ఓబీసీలపైన రాహుల్ గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారు. మోదీ గ్లోబల్ లీడర్ గా ఎదిగారు.. ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో మోదీ తరహాలో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పారా?, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ దేశ రక్షణ రంగ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. మల్లిఖార్జున్ ఖర్గే వాస్తవాలు గ్రహించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయింది. ముఖ్యమంత్రి డిల్లీలో మూడు రోజులు పడిగాపులు కాశారు. రాహుల్ గాంధీ ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమే. కుటుంబ కలహాలు, ఆస్తుల పంపకాలు, వారసత్వ రాజకీయాల వల్లే బీఆర్ఎస్ లో కొట్లాట. బీజేపీ వెన్నుపోటు రాజకీయాలు చేయదు. ఆయుదాలు చేతిలో పట్టుకొని చర్చలు అంటే ఎట్లా?, ఆపరేషన్ సిందూర్ ను విమర్శిస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు’ అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
లూటీ అయిన రాష్ట్రాన్ని గాడిలోకి తెస్తున్నాం
అచ్చంపేట/ఆమనగల్లు: ‘ప్రజాప్రభుత్వంలో సమగ్ర ప్రణాళికతో సంపద సృష్టించి ప్రజలకు పంచుతాం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని లూటీ చేసింది. మేము గాడిలోకి తెచ్చి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం. ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. మేం తెచ్చిన ప్రతి పథకం దేశానికి రోల్ మోడల్గా నిలుస్తోంది.. ఇప్పటికే మీ మోడల్ మాకు చెప్పండంటూ ఇతర రాష్ట్రాలు అడుగుతున్నాయి’అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని గట్టుతుమ్మన్ గ్రామంతోపాటు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. కులగణనతో దేశానికే ఆదర్శంగా నిలిచాం గట్టుతుమ్మన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ కులగణన 50 రోజుల్లో పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని ఆయన కుమార్తె కవిత ఇప్పుడు చెబుతోందని.. కానీ రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లోనే ఈ దెయ్యాలను వదిలించుకొని ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని భట్టి ఎద్దేవా చేశారు. రెండు దశాబ్దాలపాటు రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన ప్రణాళికను తాము తయారు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ పోతుందని కేసీఆర్ దు్రష్పచారం చేశారు.. ‘మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల కేసీఆర్ వద్దకు ఎవరూ రావట్లేదని ఆయన బాధపడుతున్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ పోతుందని కేసీఆర్ దు్రష్పచారం చేశారు. అప్పట్లో మేము సవాల్ చేశాం. చెప్పినట్లుగానే డిమాండ్కు తగ్గట్లుగా విద్యుదుత్పత్తి చేస్తున్నాం’అని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా మరో 50 ఏళ్ల విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తోందని భట్టి చెప్పారు. 2029–30 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ను ఉత్పత్తి చేస్తామన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో భవిష్యత్ తరాలకు మిగులు విద్యుత్ అందిస్తామని.. ఇతర రాష్ట్రాలకు విద్యుత్ను అమ్మే స్థాయికి ఎదుగుతామని పేర్కొన్నారు. సంక్షేమానికి ఏటా రూ.70 వేల కోట్లు రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఏటా రూ. 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్లో రూ. 200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, రూ. 18 కోట్లతో నిర్మించనున్న 8 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేసి సాగునీరు అందించడమే ప్రజాప్రభుత్వ ఎజెండా అని తెలిపారు.పెండింగ్లో ఉన్న రిజర్వాయర్ల భూసేకరణ నిధులను వెంటనే విడుదల చేస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, మధుసూదన్రెడ్డి, తూడి మేఘారెడ్డి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వనితుడు చల్లా వంశీచంద్రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.విద్యుత్ కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమాదేశ చరిత్రలోనే ఓ రికార్డు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసాక్షి, హైదరాబాద్/హన్మకొండ: విద్యుత్ కార్మికులకు కోటి రూపాయలకు పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్) పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేశ్ కుటుంబ సభ్యులకు సోమవారం ప్రజాభవన్లో కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కుతో పాటు విద్యుత్ శాఖలో నరేశ్ శ్రీమతికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేసిన సందర్భంగా భట్టి మాట్లాడారు.విద్యుత్ కార్మికునికి కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును అందించడం కేవలం సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వంలోనే సాధ్యమైందన్నారు. గతంలో కార్మికుల కోసం ఏ ప్రభుత్వం ఇంత గొప్పగా ఆలోచన, ప్రయత్నం చేయలేదని చెప్పారు. ప్రమాద బీమా, కారుణ్య నియామక పత్రం అందించడం ప్రభుత్వ ఆలోచనకు, మానవీయ కోణానికి అద్దం పడుతోందని, విద్యుత్ ఉద్యోగులు అంకితభావంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డిప్యూటీ సీఎం కోరారు. ప్రభుత్వ ఆలోచనను సమర్థవంతంగా అమలు చేసిన ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి విద్యుత్, బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.