breaking news
-
బీజేపీలోకి మరో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే.. ఇదిగో క్లారిటీ
సాక్షి, వికారాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు కొందరు పార్టీని వీడుతున్నారు. కొద్దిరోజుల క్రితమే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇక, తాండారు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా పార్టీ మారుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ రెడ్డి ఈ వార్తలపై స్పందించారు. అమెరికా నుంచి వీడియో విడుదల చేశారు.తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వీడియోలో మాట్లాడుతూ..‘పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నా. గువ్వల బాలరాజును నేనే బీజేపీలోకి పంపినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఇంకా కొంత మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు హాస్యాస్పదంగా ఉంది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ నమ్మవద్దు. వేల కోట్ల కాంట్రాక్ట్లు ఇస్తామని, ఉన్నత పదవులు ఆశచూపింది బీజేపీ. తెలంగాణకు అన్యాయం చేయవద్దని బీఆర్ఎస్ కంకణబద్దుడిగా, కేసీఆర్ మాసనపుత్రుడిగా నేను సాహసం చేశాను.సొంతలాభం ముఖ్యం కాదని, తాండూరు అభివృద్ధి ముఖ్యమని భావించాను. కొంతమంది బీజేపీ నుంచి వచ్చిన వాళ్లను బహిరంగంగా ఆ రోజు ప్రపంచానికి పట్టించాను. ధైర్యసాహసాలు చేసిన తాండూరు బిడ్డ.. వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదు. తెలంగాణను అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్లడానికి బీఆర్ఎస్తోనే వెళ్తాను. ఇతర పార్టీలతో తొత్తులుగా మారిన మీడియాను హెచ్చరిస్తున్నా.. తప్పుడు ప్రచారం చేయవద్దని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నా.బీఆర్ఎస్ కార్యకర్తలకు పూర్తి క్లారిటీ ఉంది. బీఆర్ఎస్ లోకల్ బాడీ ఎన్నికల సన్నాహాక సమావేశాలు నిర్వహించుకున్నాం. సొంత పనుల మీద అమెరికా వచ్చాను...త్వరలోనే తిరిగి వస్తాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను గెలిపించుకుంటాను. పార్టీ మార్పుపై ఎటువంటి ఆలోచన లేదు. త్వరలోనే తాండూరుకు వస్తాను’ అని క్లారిటీ ఇచ్చారు. -
‘తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఇలా పతనం కావడం ఇదే తొలిసారి’
హైదరాబాద్: రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతోనే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని ధ్వజమెత్తారు. వరుసగా నెలలు తెలంగాణ మైనస్ ద్రవ్యోల్పణమే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పతనం అయ్యిందనడానికి నిదర్శమన్నారు. ఈ మేరకు కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. వరుస రెండు నెలల పాటు తెలంగాణ మైనస్ ద్రవ్యోల్పణంలోకి వెళ్లిపోవడం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసారి అని మండిపడ్డారు. దేశంలో ఇలాంటి పరిస్థితి వచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కారు ఆర్థిక కార్యకలాపాలను పూర్తిగా అణచివేసిందని, అదే సమయంలో ఉద్యోగాలను సృష్టించడంలో విఫలమైందన్నారు. ఒక శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థను అవగాహన లేని పాలనతో నాశనం చేయడం చూస్తే బాధగా ఉందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలన నిరాశజనకంగా కనిపిస్తోందన్నారు కేటీఆర్. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, రాష్ట్రాభివృద్ధి తిరోగమనంలో పయనిస్తోందన్నారు.For the first time since its formation, Telangana has slipped into deflation for 2 straight months - June & JulyWhat’s worth highlighting is that Telangana is the ONLY state in India in this situationDeflation is not a sign of prosperity. It means people are limiting… pic.twitter.com/AAk5ZGCNTl— KTR (@KTRBRS) August 14, 2025 -
‘SIR పేరుతో ఈసీ చేస్తున్న దారుణాన్ని మేము ప్రశ్నించాం’
హైదరాబాద్: ‘SIR’(స్పెషల్ ఇంటిన్స్వ్ రివ్యూ) పేరుతో భారత ఎన్నికల సంఘం చేస్తున్న దారుణాన్ని తాము ప్రశ్నించామని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేల 65 లక్షలు ఓటర్లను తొలిగించినట్లయితే ఎందుకు తీసేస్తున్నారో వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘ సుప్రీం కోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ...తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో గడిచిన రెండు వారాలుగా పార్లమెంటు సభ్యులం....ఈ స్పెషల్ ఇంటిన్స్వ్ రివ్యూపై పార్లమెంటులో చర్చ జరగాలని పట్టుపడుతూ వస్తున్నాం. స్పీకర్ ఈ విషయంపై దృష్టి పెట్టకుండా సభను వాయిదా వేస్తూ వచ్చారు.ఇవాళ సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో....మనం ప్రజా స్వామ్యాన్ని కాపాడుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం అనేది ఒక కీలకమైన విభాగం. రాజ్యాంగ బద్దంగా స్వతంత్రంగా పని చేయాల్సిన ఈ సంస్థ ప్రలోభాలకు లోనైతే తీరని నష్టం వాటిల్లుతుంది. పౌరసత్వం, మతం పేరున ఎన్నికల సంఘం ఓటర్లను తొలిగించలేదు. ఒకవేల ఓటర్లను తొలిగించాలంటే ఎందుకు తొలిగించారో...చెప్పాల్సి ఉంటుంది. రాహుల్ ఇటీవల ఇచ్చిన ప్రజంటేషన్ ద్వారా ఓటర్ల జాబితాలో లోపాలు సుస్పష్టంగా వెలుగులోకి వచ్చాయి. అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటకలో చనిపోయిన వారిని బతికి ఉన్నట్లు, బతికి ఉన్న వారు చనిపోయినట్లు తప్పులు తడకలుగా జాబితా ఉంది. భారత్లో ఎన్నికల సంఘం చాలా స్పష్టతతో న్యూట్రల్గా పని చేయాల్సి ఉంది. సుప్రీం కోర్టు ఇవాళ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఈ విషయాన్ని స్పష్ఠం చేస్తున్నాయి.. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై తామంతా సంతోషిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం మనందరిపై ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. -
సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ నియమించిన ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు చెంపపెట్టు అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు(కేటీఆర్) అన్నారు.‘‘గతంలో బీజేపీ.. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పంపిన ఇద్దరు ఎమ్మెల్సీ ప్రతిపాదనలకు అడ్డుపడితే, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రక్రియ పెండింగ్లో ఉండగానే మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. బీఆర్ఎస్ గతంలో నామినేట్ చేసిన బడుగు, బలహీనవర్గాలకు చెందిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణల అభ్యర్థిత్వాలకు అడ్డుతగిలిన కాంగ్రెస్, బీజేపీల నిజస్వరూపం మరోసారి బట్టబయలైంది’’ అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ దుయ్యబట్టారు. ‘‘రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేని ఈ రెండు ఢిల్లీ పార్టీల అప్రజాస్వామిక విధానాలు ఎంతమాత్రం సాగనివ్వమని చాటిచెప్పిన గౌరవ న్యాయవ్యవస్థకు బీఆర్ఎస్ పక్షాన శిరస్సు వంచి సలాం చేస్తున్నాం’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ నియమించిన ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నిక చెల్లదని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్ కు చెంపపెట్టు. గతంలో బీజేపీ.. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పంపిన ఇద్దరు ఎమ్మెల్సీ ప్రతిపాదనలకు…— KTR (@KTRBRS) August 13, 2025 -
బీజేపీలో చేరుతున్నారా.. జర జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ‘బీజేపీలో చేరాలనుకునే నాయకులారా.. ఒకసారి ఆలోచించుకోండి, జర జాగ్రత్త’అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో విడుదల చేశారు. ‘బీజేపీలో చేరిన తరువాత మీ కార్యకర్తలకు ఏ పదవీ ఇప్పించుకోలేరు. మీకు టికెట్ గ్యారంటీ ఉండదు’అని హెచ్చరించారు. చేరినప్పుడు మొదటి వరుసలో సీటు, తరువాత చివరి సీటులో కూర్చుంటారని పేర్కొన్నారు. 11 ఏళ్లు అణచివేతను ఎదుర్కొన్నానని అన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న కార్యకర్తల కోసం ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘విజయశాంతి, జితేందర్రెడ్డి, నాగం జనార్దన్రెడ్డి లాంటి నేతలు బీజేపీలో చేరారు. ఏమైంది? పార్టీని విడిచి వెళ్లిపోయారు’అని పేర్కొన్నారు. హిందుత్వానికి, దేశానికి మంచిపనులు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అంటూనే ‘తెలంగాణ మా పార్టీ. మేం ఏం చెబితే అదే జరుగుతుంది’అని అనుకునే వారి వల్లే పార్టీ సర్వనాశనం అవుతోందని ఆరోపించారు. బీజేపీ తెలంగాణను పాలిస్తుందన్నారు. -
రేవంత్ను సీఎం చేశారుగా..: రాజగోపాల్రెడ్డి
మునుగోడు: ‘నాకు మంత్రి పదవి ఇస్తామని పార్టీలో చేర్చుకున్నారు.. నేడు పదవి ఇచ్చేందుకు సమీకరణలు కుదరడం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అనడం సరైంది కాదు.. నన్ను పార్టీలో చేర్చుకునే సమయంలో సమీకరణలు ఎందుకు గుర్తుకు రాలేదు’అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రశ్నించారు. తన మంత్రి పదవిని ఎవరు అడ్డుకుంటున్నారో అందరికీ తెలుసని చెప్పారు. మంగళవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఎల్గలగూడెం గ్రామంలో కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ..‘నేను ఏ పదవి కోరుకున్నా మునుగోడు ప్రజల కోసమే. నాకు పదవులపై ఎలాంటి ప్రేమ లేదు. మహబూబ్నగర్ నుంచి రేవంత్రెడ్డికి సీఎం పదవి ఇచ్చారు కదా.. మా అన్నదమ్ములిద్దరికి మంత్రి పదవి ఉంటే తప్పేంటి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ముగ్గురు మంత్రులు ఉంటే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలకు ముగ్గురు మంత్రులు ఉంటే తప్పేంటి. ఒక ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు అంటే.. ఇద్దరం సమర్థులం, పరిపాలన చేసే సామర్థ్యం కలిగిన వ్యక్తులం. అలాంటి వారికి పదవులు ఇస్తే ఎవరికి ఇబ్బంది. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న నాకు మంత్రి పదవి ఇవ్వకుండా సమీకరణల పేరుతో దాట వేస్తున్నారు. నాకు పదవి రాకపోతే జరిగే నష్టం మునుగోడు ప్రజలకు తప్ప నాకు కాదు. పదవులు ఇచ్చే నిర్ణయం అధిష్టానం చూసుకుంటుంది. నాకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో నేను ఎంతవరకైనా ఓపిక పడతా. కానీ, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో నిధులు ఇవ్వకుండా అడ్డుపడితే ఊరుకునే ప్రసక్తి లేదు. నిధులు ఇవ్వకుంటే ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతా. మరోమారు ఉద్యమానికి సిద్ధమై తీరుతా. అలా అని మునుగోడు ప్రజలు తలవంచుకునే పని అసలు చేయను. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలన కొనసాగిస్తూ నిధులు ఇవ్వకుండా పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుంటే చూసి ఊరుకోలేక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంను మునుగోడు ప్రజల దగ్గరకు తీసుకొచ్చా. నా రాజీనామా కారణంగానే నియోజకవర్గానికి అప్పటి ప్రభుత్వం దాదాపు రూ.వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేస్తే ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతుంది. ఇంకా మరింతగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు ఇవ్వకుంటే ఎంతటి త్యాగానికైనా సిద్ధమైతా. అందుకు ప్రతి ఒక్కరి సహాయ, సహకారాలు కావాలి. ప్రధానంగా కమ్యూనిస్టుల మద్దతు పూర్తిగా అందించాలి’. అని రాజగోపాల్రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: ఫోన్ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. బండి సంజయ్ తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలుగా కేటీఆర్ మంగళవారం పంపిన నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించిన పత్రికా సమావేశంలో బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకు ఈ తరహా ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు.మీడియా సమావేశంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవన్నారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా, కేంద్రమంత్రిగా బాధ్యత కలిగిన పదవుల్లో ఉంటూ ప్రజాజీవితంలో ఉన్న మరో శాసనసభ్యుడిపై అసత్యాలతో కూడిన అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని చెప్పారు. బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసు అందిన వారంలోపు బండి సంజయ్ స్పందించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నోటీసులకు భయపడే ప్రశ్నే లేదు: సంజయ్లీగల్ నోటీసులకు భయపడే ప్రశ్నే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ స్పష్టం చేశారు. కేటీఆర్ తనకు పంపిన లీగల్ నోటీసులపై మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘గేమ్ ఆన్. లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు. నిజం ఒక సింహం.. దాన్ని విడిచిపెడితే అది తనను తాను రక్షించుకుంటుంది. ఫోన్ట్యాపింగ్ ద్వారా జీవితాలను నాశనం చేసిన నేరస్తులు బయటపడతారు. సత్యమేవ జయతే’అని పేర్కొన్నారు. -
రామచంద్రరావు హౌజ్ అరెస్ట్.. కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనం: బండి సంజయ్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు హౌజ్ అరెస్ట్ (గృహ నిర్బంధం)పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలనకు ఇదే నిదర్శమని, కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తోందని మండిపడ్డారాయన.బంజారాహిల్స్ పెద్దమ్మ గుడివద్ద హిందూ సంఘాలు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిసున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి హాజరవుతారనే అనుమానాల నడుమ తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ పరిణామంపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.‘‘పెద్దమ్మ గుడికి హిందువులు పోతే తప్పేంది? రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? భాగ్య నగర్ లో హిందూ సంఘాలను, బీజేపీ కార్యకర్తలందరినీ అరెస్ట్ చేయడం మూర్ఖత్వం అని అన్నారు. ఒక పథకం ప్రకారమే కాంగ్రెస్ వ్యవహరిస్తున్నట్లు కన్పిస్తోంది.. .. పెద్దమ్మ గుడిని కూల్చిన గూండాలను అరెస్ట్ చేయకుండా శాంతియుతంగా పూజలు నిర్వహించే హిందూ సంఘాల నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం దుర్మార్గం. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి కుట్రలు చేస్తోంది. ఒక వర్గం ఓట్ల కోసం హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటోంది. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పే రోజులు రాబోతున్నాయి’’ అని బండి సంజయ్ అన్నారు. -
కాంగ్రెస్, బీజేపీ కుట్రలను బీఆర్ఎస్ ఎదుర్కోగలదా?
తెలంగాణకు చెందిన భారత రాష్ట్ర సమితిని బలహీన పరిచేందుకు కాంగ్రెస్, బీజేపీలు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ల వైఖరి ఈ అనుమానానికి కారణమవుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యమిచ్చేందుకు సిట్ అధికారుల వద్దకు వెళ్లిన సందర్బంలో బండి సంజయ్ మీడియా వద్ద చేసిన వ్యాఖ్యలు వీటిని మరింత బలపరుస్తున్నాయి.ప్రత్యర్థులను బలహీనపరిచి తద్వారా తాము బలపడాలని కోరుకోవడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. ఇందుకు రకరకాల వ్యూహాలూ అమలు చేస్తూంటారు. తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఈ వ్యూహాలకు, కుట్రల బారిన పడుతున్నది భారత రాష్ట్ర సమితే. ఒక ప్రాంతీయ పార్టీగా రెండు జాతీయ స్థాయి పార్టీలను ఎదుర్కుంటూ ఉండటం దీనికి కారణం. 2014 నుంచి తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2023 శాసనసభ ఎన్నికలలో ఓడింది.తొలి టర్మ్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య సత్సంబంధాలే ఉండేవి కానీ ఆ తరువాత ఇరువురు దూరమయ్యారు. సొంత జాతీయ పార్టీ యోచనతో కేసీఆర్ మహారాష్ట్రలో శాఖను ప్రారంభించారు. అయితే స్వరాష్ట్రం తెలంగాణలోనే ఓటమి పాలు కావడంతో ఆయన ప్లాన్లు తలకిందులయ్యాయి. దీంతో ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలతో ఏర్పరచుకున్న సంబంధాలను కూడా పక్కన బెట్టవలసి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా 39 అసెంబ్లీ స్థానాలతో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండగలిగింది. కాని వీరిలో పది మంది కాంగ్రెస్లో చేరిపోయారు.ముఖ్యమంత్రి పదవి పొందిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను దెబ్బగొట్టే ఆలోచనతో కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోలు లావాదేవీలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, గొర్రెల పంపిణీ వంటి వాటిపై దృష్టి పెట్టి విచారణకు ఆదేశాలు ఇచ్చింది. వీటన్నిటిలో కెసిఆర్ ను ఇరుకున పెట్టే వ్యూహం కనిపిస్తుంది. ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జ్యుడిషయల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసులు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.2024 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలు బీఆర్ఎస్కు పెద్ద పరీక్ష అయ్యాయి. ఆ పార్టీ పూర్తిగా పరాజయం చెందడంతో లోక్సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కాంగ్రెస్, బీజేపీలు చెరో 8 సీట్ల చొప్పున విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. బీఆర్ఎస్కు ఒక్క సీటు రాకపోవడం పెద్ద ఎదురుదెబ్బ అయ్యింది. అప్పటి నుంచి బీజేపీకి కూడా తెలంగాణపై ఆశలు పెరిగాయి. ఏ అవకాశం వచ్చినా బిజెపి నేతలు బీఆర్ఎస్పై విరుచుకుపడటం మొదలుపెట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు బీజేపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు.తాజాగా బండి సంజయ్ బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యం ఇవ్వడానికి దర్యాప్తు అధికారుల బృందం ముందుకు వెళ్లి తన అభిప్రాయాలు తెలియచేశారు. ఏమి ఆధారాలు ఇచ్చారో తెలియదు కాని ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్, కేటీఆర్లు వ్యాపారుల నుంచి డబ్బు వసూలు చేస్తూ వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, హరీష్రావు, కవితలతోసహా పలువురి పోన్లను టాప్ చేశారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలలో, కేసీఆర్ కుటుంబంలో కలతలు సృష్టించడానికి సంజయ్ ఈ ఆరోపణలు చేశారా అన్న సందేహం వస్తుంది.ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, కేటీఆర్లను ఈపాటికి జైలులో పెట్టేవాళ్లమని సంజయ్ వ్యాఖ్యానించారు. ఇది మరీ సీరియస్ కామెంట్. ఎవరినైనా జైలులో పెట్టడానికి నిర్దిష్ట ఆధారాలు ఉండాలి. అవేమి చూపకుండా ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం?. సిట్ అధికారులు కూడా కేంద్రమే ఈ కేసు విచారించాలని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాల ఫోన్లను కూడా టాప్ చేశారని అధికారులు సంజయ్ కు చెప్పారని ఒక పత్రిక రాసింది. ఇందులో వాస్తవం ఉంటే కేంద్రానికి, అందులోను హోం శాఖకు తెలియకుండా ఉండదు.కేంద్రంలోని వారి ఫోన్లు టాప్ అయి ఉంటే, దానిని కనిపెట్టడం కాని, సీబీఐకి అప్పగించడం కాని కేంద్రం చేతిలో పనే కదా అన్న ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంటుంది. కానీ బండి సంజయ్ తెలంగాణలో బీఆర్ఎస్ను వీక్ చేయడం కోసం, ఆ పార్టీ నేతలను భయపెట్టడానికి ఈ ఆరోపణలు చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలలో బీజేపీ ఎనిమిది సీట్లు గెలుపొందినా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ బాగా పుంజుకుందన్న అభిప్రాయం కూడా ఉంది. దాంతో బీఆర్ఎస్ నేతలు నైతికంగా ఇబ్బంది పడేలా సంజయ్ మాట్లాడి ఉండవచ్చు.దానికి తోడు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కొందరు సిటింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. మరో విషయం చెప్పాలి. ఏపీకి బీజేపీ ఎంపీ సీ.ఎం.రమేష్కు చెందిన కాంట్రాక్ట్ కంపెనీకి రేవంత్ రెడ్డి భారీ కాంట్రాక్టు ఇప్పించారని కేటీఆర్ ఆరోపించారు. ఆ సందర్భంలో రమేష్ రియాక్ట్ అవుతూ తనవద్ద బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రతిపాదనను కేటీఆర్ చేశారని అన్నారు. కేటీఆర్ దాన్ని ఖండించినా అలాంటి ఆరోపణలు రావడం ఏ పార్టీకి అయినా కాస్త ఇబ్బందికరమైన వ్యవహారమే. సంజయ్ ప్రకటనను కూడా కేటీఆర్ తోసిపుచ్చి క్షమాపణ డిమాండ్ చేశారు.అలా చేయకపోతే లీగల్ నోటీసు ఇస్తానని అన్నారు. సంజయ్ చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక రూపంలో కేసీఆర్, హరీష్ రావులను చికాకు పెట్టాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. కేసీఆర్ను అరెస్టు చేయాలని అనుకోవడం లేదని రేవంత్ అన్నప్పటికీ, పరిణామాలు ఏ వైపు మళ్లుతాయో అప్పుడే చెప్పలేం. వీటన్నిటిని గమనిస్తే, బీఆర్ఎస్ను దెబ్బతీసి, ఆ స్థానాన్ని తాను ఆక్రమించాలని బీజేపీ వ్యూహాలు పన్నుతున్నట్లు అనిపిస్తుంది. ఆ అవకాశం బీజేపీకి రాకుండా చేసి, తనే లాభపడాలని కాంగ్రెస్ సహజంగానే యత్నిస్తుంది.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ను ఎదుర్కోవడమే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం ముందున్న సవాలు. ఈ రెండు పార్టీలలో ఏదో ఒకదానితో బీఆర్ఎస్కు సంబంధాలు ఉండి ఉంటే ఈ సమస్యలు అంతగా ఉండేవికావు. దేశవ్యాప్తంగా స్వతంత్రంగా ఉండే ప్రాంతీయ పార్టీలను అణచి వేయడానికి జాతీయ పార్టీలు యత్నిస్తున్నాయి. అందులో బీజేపీ మరీ ముందు ఉంటోందనిపిస్తుంది. ఉదాహరణకు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టే వరకు బీజేపీ అమలు చేసిన వ్యూహాలు అన్నీ, ఇన్నీ కావు. ఆనాటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను సైతం జైలులో పెట్టింది. బీహారులో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఒకసారి బీజేపీ, మరోసారి కాంగ్రెస్తో జతకట్టి ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నారు.అదే పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమితో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో మాత్రం ఎవరితో కలవడం లేదు.అక్కడ కాంగ్రెస్, సీపీఎంల స్థానాన్ని బీజేపీ ఆక్రమించేసింది. తమిళనాడులో కాంగ్రెస్తో డీఎంకే కూటమి కడితే, ఏఐఏడీఎంకే ఈ మధ్యనే బీజేపీతో కలిసింది. కర్ణాటకలో జేడీఎస్ కూడా కొంతకాలం కాంగ్రెస్తో, ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలో భాగస్వామి అయింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ఒంటరిగానే ఉండడానికి సిద్దపడడంతో, బీజేపీ నాయకత్వం తనను తీవ్రంగా దూషించిన టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి వెనుకాడలేదు. కాకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చి తమను బతిమలాడేలా చేసుకున్నారు.దరిమిలా చంద్రబాబుపై ఎలాంటి కేసులు ముందుకు సాగలేదు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్రత్యామ్నాయంగా వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే ఉండగలిగింది. ఇక్కడ కాంగ్రెస్ దాదాపు జీరో స్థాయిలో ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. అయినప్పటికీ వైసీపీకి జనంలో పెరుగుతున్న ఆదరణను తగ్గించడానికి కూటమి పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. తెలంగాణలో మూడు పార్టీలు ఆధిపత్య పోరులో ఉండడం వల్ల బీఆర్ఎస్ రెండు జాతీయ పార్టీలతో పోటీ పడవలసి వస్తోంది. ఈ రకంగా సాగుతున్న రాజకీయంలో వచ్చే మూడేళ్లు బీఆర్ఎస్ రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుని నిలదొక్కుకోవలసి ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆర్థిక వ్యవస్థను ఖతం పట్టించారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనలో తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలు సంగతేమో కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మాత్రం గ్యా రెంటీగా ఖతం పట్టించిందని అన్నారు. కాగ్ ఇచ్చిన తాజా నివేదికలోని అంశాలను ప్రస్తావిస్తూ.. రేవంత్రెడ్డి ముఖ్య మంత్రి అయ్యాక తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజా రిందని సోమవారం ఒక ప్రకటనలో కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే రూ.20,266 కోట్లు అప్పు ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. కాగ్ నివేదిక ప్రకారం, రాష్ట్ర ఆదాయం పడిపోవడంతో పాటు అప్పులు భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.20,266 కోట్లు ప్రభు త్వం అప్పుగా తీసుకుంది. వార్షిక ల క్ష్యంలో ఇది 37.5 శాతం. కొత్తగా ఏ రోడ్లు వేయకుండా, ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించకుండా, విద్యార్థులకు కనీసం మంచి భోజనమైనా పెట్టకుండా ఈ నిధులను ఏం చేస్తున్నారు? పన్నేతర ఆదా యం కూడా దారుణంగా పడిపోయింది.బడ్జెట్లో అంచనా వేసిన దానిలో కేవలం 3.37 శాతం మాత్రమే వసూలు అ యింది. మిగులు బడ్జెట్తో ప్రారంభమైన తెలంగాణ, ఇప్పు డు రూ.10,583 కోట్ల రెవెన్యూ లోటును ఎదుర్కోవడం అసమర్థ పాలనకు నిదర్శనం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడి లో పెట్టడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉందో ప్రజలకు స్పష్టంగా చెప్పాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏ ఒక్క పథకం సరిగ్గా అమలు కావడం లేదు కాంగ్రెస్ పాలనలో పథకాల కోసం ప్రజలు పదే పదే దరఖాస్తు చేసుకోవడానికే సరిపోతుందని, ఒక్క పథకమూ నిర్దిష్టంగా అమలు కావడం లేదని కేటీఆర్ విమర్శించారు. తిక్కలోడు తిరునాళ్లకు పోతే..ఎక్కా దిగా సరిపోయిందన్న చందంగా ప్రభుత్వం తీరుందని సోమవారం ఎక్స్ వేదికగా ఆయన ఎద్దేవా చేశారు. ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బీమా పథకం కింద 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు 1,11,320 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.5,566 కోట్ల పరిహారం అందించాం.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బీమా ప్రీమియం చెల్లించలేదు. వేలాదిమంది రైతు కుటుంబాలు బీమా సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రతి ఏటా ఆగస్టు 14తో రైతుబీమా ప్రీమియం గడువు ముగుస్తుంది. ప్రభుత్వం ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించి రెన్యువల్ చేయడం ఆనవాయితీ. అయితే గడువు దగ్గరకు వచ్చిన తర్వాత రైతుబీమా కోసం రైతు స్వయంగా స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్) పత్రం అందజేయాలని, తనతో పాటు నామినీ పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు కూడా అందజేయాలనే నిబంధన విధించారు. ప్రస్తుతం ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో రైతుబీమాకు రైతులు మళ్లీ దరఖాస్తు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం మూర్ఖత్వం. గతంలో మాదిరిగానే ప్రభుత్వం రైతు బీమా రెన్యువల్ చేయాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
స్పీకర్పై ఒత్తిడి పెంచాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్పై ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు పార్టీ ముఖ్య నేతలను ఆదేశించారు. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు జరుగుతున్న సన్నద్ధతపై ఆరా తీశారు. ఢిల్లీలో న్యాయవాదులు కోరిన విధంగా పూర్తి సమాచారాన్ని వీలైనంత త్వరగా సిద్ధం చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కేటీఆర్ను ఆదేశించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్తో కేసీఆర్ సోమవారం ఎర్రవల్లి నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. స్థానిక ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ స్థానిక ఎన్నికల సన్నద్ధతపై చర్చించడంతో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించిన పరిణామాలు భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంలో ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసిందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశముందని సమావేశంలో నేతలు అంచనా వేశారు. ఈ నెల 14న కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ నిర్వహించే ‘బీసీల కదన భేరి’ సభ ఏర్పాట్లపైనా చర్చించారు. సభలో రిజర్వేషన్ల అంశాన్ని బలంగా ప్రస్తావించి కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టాలని కేసీఆర్ ఆదేశించారు. బనకచర్లపై దిశా నిర్దేశం ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్టుపై ఇటీవల ఢిల్లీలో న్యాయ నిపుణులతో హరీశ్ జరిపిన సంప్రదింపులకు సంబంధించి చర్చ జరిగినట్లు తెలిసింది. జాతీయ స్థాయిలో ఏపీ సీఎం చంద్రబాబు వేస్తున్న ఎత్తుగడలకు పార్టీ పరంగా చెక్ పెట్టేలా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధతపై చర్చ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనకు ముందే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ అభిప్రాయపడినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెడితే అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలిసింది. దీనిపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని కేసీఆర్ వెల్లడించినట్లు సమాచారం. విలీనం ప్రచారాన్ని తిప్పికొట్టాలి ‘ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి పదేళ్లు అధికారంలో కొనసాగి, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతర పోరాటం చేస్తోంది. కానీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతోందని కొందరు ఉద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో కేడర్కు తప్పుడు సంకేతాలు వెళ్లక ముందే విలీనం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి..’ అని బీఆర్ఎస్ అధినేత ఆదేశించారు. -
రాయలసీమ ఎత్తిపోతలు ఆపండి
సాక్షి ప్రతినిధి వరంగల్/ఏటూరునాగారం/మధిర: శ్రీశైలం ఎగువ భాగాన రోజుకు 11 టీఎంసీల నీటిని తరలించే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే నిలిపేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఏపీ సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడు సమీపంలో వైరా నదిపై రూ.600 కోట్లతో నిర్మించనున్న జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి భట్టి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా రోజుకు ఒక టీఎంసీ విడుదల చేస్తేనే లక్షల ఎకరాల భూమి సాగవుతోందని, పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 11 టీఎంసీలు తరలిస్తే ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు సైతం 25 రోజుల్లోనే ఖాళీ అవుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వల్లనే ఏపీలో బనకచర్ల, శ్రీశైలం లిఫ్ట్ ఆగిపోయాయని వెల్లడించారు. బీజేపీ, బీఆర్ఎస్ వల్లే నష్టం..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కారు కలిసి దొంగచాటుగా ఆర్డినెన్స్ తెచ్చి భద్రాచలం డివిజన్లోని ఏడు మండలాలను ఏపీలో కలిపి, గిరిజనులకు చెందిన 2 లక్షల ఎకరాలు పోలవరానికి ధారాదత్తం చేశారని భట్టి విక్రమార్క ఆరోపించారు. గిరిజనులపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా పోలవరం ఎత్తు తగ్గించి రెండు లక్షల ఎకరాలను కాపాడాలని ఏపీ సీఎంను డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయ్యాక నికర జలాలు, వరద జలాల వాటా తేలాకనే బనకచర్ల ప్రస్థావన తీసుకురావాలని స్పష్టంచేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మధిర నియోజకవర్గంలోని 30 గ్రామాలను నాగార్జునసాగర్ రెండో జోన్లోకి మార్చి, రూ.600 కోట్లతో జవహర్ ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇచ్చిందని తెలిపారు. అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు దేవాదులరాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టు దేవాదుల అని భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. ములుగు జిల్లా దేవాదుల చొక్యారావు ఎత్తిపోతల పథకం, సమ్మక్క–సాగర్ బరాజ్ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి వారు ఆదివారం పరిశీలించారు. ముందుగా 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం దేవాదుల పంపుహౌస్ వద్ద సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి, ఉత్తమ్ మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 28 వేల ఎకరాల భూ సేకరణ పనులు పెండింగ్లో ఉన్నాయని, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూ నిర్వాసితులకు చెల్లించేందుకు రూ.67 కోట్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరింత భూ సేకరణ కోసం రూ.179 కోట్ల వరకు అవసరమని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ను కూల్చింది బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతేనని ఆరోపించారు. ఇచ్చంపల్లి తుమ్మిడిహెట్టి బరాజ్ను రూ.38 వేల కోట్లతో కట్టి తీరుతామని భట్టి, ఉత్తమ్ స్పష్టం చేశారు. కాగా, దేవాదుల నుంచి వేరే ప్రాంతాలకు నీళ్లు తీసుకపోతున్నారని, తన నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలని మంత్రి సీతక్క కోరారు. రామప్ప– లక్నవరంను అనుసంధానిస్తూ కెనాల్ నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కడియం శ్రీహరి, నాగరాజు, మురళీనాయక్, ఇరిగేషన్ కమిషనర్ ప్రశాంత్ పాటిల్ పాల్గొన్నారు. -
బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
సాక్షి, హైదరాబాద్: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలోకి చేరారు. నాంపల్లిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు రామచందర్రావు బీజేపీ కండువా కప్పి బాలరాజును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ బీజేపీ నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రామచందర్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి సున్నా అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీకి 2023 ఎన్నికల్లో 13.9 శాతం ఓట్లు వచ్చాయని 2024లో 36 శాతం ఓట్లు వచ్చాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనే కాదు.. ఆ తర్వాత రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. చాలా మంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. అన్ని పార్టీలను స్టడీ చేసిన తర్వాతే బీజేపీలోకి చేరానని తెలిపారు. సామాన్య కార్యకర్తగా పార్టీలో జర్నీ ప్రారంభిస్తానన్నారు. తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందో జనాల్లోకి తీసుకువెళ్లడానికి తాను సిద్ధమన్నారు. బీజేపీలో చేరుతుంట బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని.. అనవసరంగా బీఆర్ఎస్ చేరికపై చర్చించవద్దని కోరుతున్నానని బాలరాజు అన్నారు. -
పాక్తో భారత్ మ్యాచ్ ఆడటమేంటి?.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: ఆసియా కప్లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరగబోయే క్రికెట్ మ్యాచ్పై ఎంఐఎం అధినేత, లోక్సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్తం, నీళ్లు కలిసి ప్రవహించలేవు.. పాకిస్తాన్తో భారత్ క్రికెట్ ఎలా ఆడుతుంది అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మ్యాచ్కు బీసీసీఐ ఎలా అనుమతి ఇచ్చింది అంటూ నిలదీశారు.ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జాతీయ మీడియా పోడ్ కాస్ట్లో మాట్లాడుతూ..‘నీళ్ళు, రక్తం కలిసి ప్రవహించలేవని.. చర్చలు, ఉగ్రవాదం కలిసి సాగలేవని ప్రధానమంత్రి మోదీ స్వయంగా చాలా సార్లు చెప్పారు. ఇలా మాట్లాడి.. మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్తో ఎలా క్రికెట్ ఆడుతారు. దుబాయ్లో పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నామని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. నేను ఈ మ్యాచ్ను చూడను. పాక్తో భారత్.. వాణిజ్య సంబంధాలను తెంచుకున్నారు, గగనతలాన్ని మూసివేశారు. కానీ, మీరు క్రికెట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నారా? ప్రశ్నించారు. పాక్తో ఆడటానికి కేంద్రం ఎలా అనుమతి ఇస్తుంది. భారతదేశంలో క్రికెట్ అనేది ఒక వ్యామోహం. క్రికెట్ ప్రతీ దాన్ని స్తంభింపజేస్తుంది అని అన్నారు.ఇదే సమయంలో పహల్గాం ఉగ్రవాద దాడిలో ప్రజలు వారి కుటుంబ సభ్యుల ముందే చనిపోయారు. ఈ దాడి నన్ను తీవ్రంగా బాధించింది. ఈ ఘటన చాలా దారుణం. భార్యాపిల్లల ముందే తమ వారిని ఎవరైనా హత్య చేయడం బాధాకరం. ఇంత దారుణం జరిగినప్పుడు పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడటంలో అర్థం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం మ్యాచ్కు అనుమతి ఇస్తుంది?. పాక్, భారత్ మ్యాచ్ బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చారు.అలాగే, హిందూ ఉగ్రవాదం అనేదే లేదు అని హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనకు ప్రతిస్పందిస్తూ.. మహాత్మా గాంధీని ఎవరు చంపారు? ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను ఎవరు చంపారు?. మహాత్మా గాంధీని ఎవరు చంపారో అమిత్ షా మర్చిపోయి ఉండవచ్చు అంటూ వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో భద్రతా లోపానికి జవాబుదారీతనం వహించాలి. భారీ సైనిక ఉనికి ఉన్నప్పటికీ ఉగ్రవాదులు ఎలా ప్రవేశించారు?. పౌరులను ఎలా హత్య చేయగలిగారు?. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటికీ ఉగ్రవాద నిరోధక చర్యలు విఫలమయ్యాయి’ అని విమర్శించారు. -
‘అందుకే బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు’
హైదరాబాద్: బీజేపీ-కాంగ్రెస్ రెండు ఒకటేనని, అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు నత్తనడకన సాగుతుందన్న కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటరిచ్చారు. అసలు బీజేపీ-బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారన్నారు. సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ను ఒక బీసీ నుంచి, రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీ నుంచి కిషన్రెడ్డి లాక్కున్నారన్నారు. ఇక జూబ్లీహిల్స్శాసనసభ ఉప ఎన్నికలో భాగంగా తమ అభ్యర్థి గురించి ఇంకా సర్వే జరుగుతుందని ఆయన తెలిపారు. నోటిఫికేషన్ వచ్చాకే అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే పోటీ పెట్టకుండా ఉండే సాంప్రదాయాన్ని కేసీఆర్ బ్రేక్ చేశారన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో తమ గెలుపు నల్లేరు మీద నడకేనని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. అదే మా తపనలోకల్ బాడీ ఎన్నికల అంశానికి సంబంధించి కాంగ్రెస్ మంచి సమన్వయంతో ఉందన్నారు మహేస్ గౌడ్. రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలనేది తమ తపన అని ఆయన పేర్కొన్నారు. గుజరాత్లో ఇస్తున్న ముస్లిం రిజర్వేషన్లను తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జనహిత పాదయాత్ర తనదని,కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా ఆ పాదయాత్ర తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ది కాదన్నారు. తమ ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆమోదించాకే ఆ పాదయాత్రను ప్రారంభించామన్నారు. -
నా వయసు 73.. ఇంక ఏ వైపు చూసేట్లు ఉంది: మల్లారెడ్డి
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటికైతే బీఆర్ఎస్లోనే ఉన్నానని.. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలిగే ఆలోచనతో ఉన్నానని మనసులో మాట బయటపెట్టారు.రాఖీ పండుగ సందర్భంగా.. తన అక్కాచెల్లెళ్లతో రాఖీ కట్టించుకున్న అనంతరం శనివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాఖీ పండగంటే తనకు ఎంతో ఇష్టమన్న మల్లారెడ్డి.. ఈ పండుగ నాడే తన ఇంజనీరింగ్ కళాశాలలు ప్రారంభించానని చెప్పారు. రాజకీయంగా బీజేపీ వైపా, టీడీపీ వైపా, బీఆర్ఎస్ పార్టీల వైపా అన్నది కాదని.. తాను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్లోనే ఉన్నానని మల్లారెడ్డి చెప్పారు. తనకు 73సంవత్సరాలు వచ్చాయని.. ఇంకా ఏవైపునకు చూడాల్సిన అవసరం ఏముందని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. ‘‘ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిని అయ్యా. ఇంకా మూడేళ్లు రాజకీయాల్లో ఉంటా’’ అని చెప్పుకొచ్చారు. అస్సలు తాను రాజకీయమే వద్దనుకుంటున్నానని తెలిపారు. కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామని అనుకుంటున్నానని అన్నారాయన. -
కేటీఆర్కు బండి సంజయ్ సవాల్.. హరీష్, కవిత విచారణకు రావాలంటూ..
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ను మాజీ మంత్రి కేటీఆర్.. ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్పై ప్రమాణానికి సిద్ధమని.. ఏ గుడికి రమ్మంటారో కేటీఆర్ టైమ్, డేట్ చెప్పాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.కేంద్రమంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష అని స్నేహంలో ఉన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ ప్రశ్నించడం లేదు. కేటీఆర్ సోదరి కవితనే.. తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్పై నేను ప్రమాణానికి సిద్ధం. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కేటీఆర్ ప్రమాణం చేస్తాడా?. నా సవాల్కు కేటీఆర్ సిద్దమా?. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు బీఆర్ఎస్ను వదిలేసి బయటికి రావాలి. కాళేశ్వరం రిపోర్ట్ వచ్చాక ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు.సిట్ అధికారులకి నా దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చాను. సిట్ అధికారులు నిజాయితీపరులు. కానీ పరిమితులు తక్కువగా ఉన్నాయి. కానీ ప్రభుత్వంపై నమ్మకం లేదు. ఫోన్ ట్యాపింగ్ విచారణను సీబీఐకి అప్పగించండి. దాదాపు ఆరు వేలకు పైగా ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. ప్రభాకర్ రావు ఐజీ అని తప్పుడు సమాచారం కేంద్రానికి ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని ఆయనను విచారణకి పిలుస్తారా?. ఎస్ఐబీ దేని కొసం పనిచేయాలి.. కేవలం మావోయిస్టుల కోసం పని చేయాలి. మావోయిస్టు సానుభూతిపరులుగా మా పేర్లు పోలీసులకు పంపారు. ఇలా ఫోన్లు ట్యాపింగ్ చేస్తారా?. హరీష్ రావు, కవిత ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. వారిని కూడా విచారణకి పిలవాలి అని వ్యాఖ్యలు చేశారు. -
క్షమాపణ చెప్పకుంటే కోర్టుకు లాగుతా
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తనపై చేసిన అడ్డ గోలు, చిల్లర వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ 48 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయనను కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరైన అనంతరం దిల్కుషా అతిథిగృహం వద్ద బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు.దీనిపై కేటీఆర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఫోన్ ట్యాపింగ్పై బండి సంజయ్ చేసిన ఆరోపణల్లో ఒక్క శాతం నిజం ఉన్నా నిరూపించాలని నేను సవాల్ విసురుతున్నా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్కి నిఘా వ్యవస్థ ఎలా పని చేస్తుందో కనీస అవగాహన లేదు. నిఘా వ్యవస్థల నిర్వహణపై కనీస పరిజ్ఞానం కూడా లేదు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ అబద్ధాలు, అనుచిత వ్యాఖ్యలు, ప్రకటనలు అన్ని హద్దులు దాటాయి. ఇంత దిగజారుడు ఆరోపణలు, చిల్లర మాటలు, బజారు మాటలు మాట్లాడడం ఆయనకు అలవాటుగా మారింది.ప్రతిసారి మరింత దిగజారి మాట్లాడుతున్నారు. బాధ్యత కలిగిన కేంద్ర మంత్రిగా పనిచేయడం అంటే ఢిల్లీ బాసుల చెప్పులు మూసినంత ఈజీ కాదని బండి సంజయ్ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. కేవలం తనకు రాజకీయ ప్రాధాన్యత దక్కకపోవడంతోనే, వార్తల్లో నిలవాలని తనకు అలవాటైన చౌకబారు వీధి నాటకాలకు తెరలేపిండు’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
సీబీఐ విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహా రంపై సీబీఐతోవిచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జరిపే విచారణపై తమకు నమ్మకం లేదని అన్నారు. సిట్ విచారణ పేరుతో డ్రామాలు ఆపాలని వ్యాఖ్యానించారు. సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాస్తే విచారణకు ఆదేశించేందుకు కేంద్రం సిద్ధం ఉందన్నారు. సీబీఐ నేరుగా విచారణ చేసే అధికారముంటే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లను ఎప్పుడో జైల్లో వేసేవాళ్లమని అన్నారు.ట్యాపింగ్లో భాగంగా కాంట్రాక్టర్లు, ఇతర వర్గాల వారిని బెదిరించి వేలకోట్ల వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చినందున దీని దర్యాప్తును ఈడీకి కూడా అప్పగించాలన్నారు. కేసీఆర్తో సీఎం రేవంత్రెడ్డి కుమ్మక్కయ్యారని, అందుకే కేసీఆర్ కుటుంబానికి రేవంత్ క్లీన్చిట్ ఇచ్చారన్నారు. ట్యాపింగ్ కేసులో బాధితుడు, ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ కూడా విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం దిల్కుశ గెస్ట్హౌస్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.అలాంటప్పుడు విచారణ ఎందుకు? ‘గతంలో బీఆర్ఎస్ దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోంది. ఫోన్ ట్యాపింగ్ అడ్డుపెట్టుకుని కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు దోచుకుంటే..ఆ సొమ్ములో వాటా కోసం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు కన్పిస్తోంది. ఆ సొమ్మును ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టాలనుకుంటున్నారేమో..అందుకే కేసీఆర్ తానా అంటే రేవంత్రెడ్డి తందానా అంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్కు రేవంత్ క్లీన్ చిట్ ఇస్తున్నడు. ఆయనను అరెస్ట్ చేయబోమని చెబుతున్నడు. సీఎం ఎవరు ఆ మాట చెప్పడానికి? అట్లాంటప్పుడు ఈ కమిషన్లు, ఈ విచారణలు ఎందుకు?..’ అని సంజయ్ నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్లను విచారణకు పిలుస్తారా? ‘అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును విచారించిన జడ్జి ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్, కేటీఆర్లను సిట్ విచారణకు పిలవగలదా? కేసీఆర్, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్కుమార్ మినహా ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్, అప్పటి మంత్రి హరీశ్రావు, ఇతర మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల ఫోన్లు, మావోయిస్ట్ల నుంచి ప్రమాదం పేరుతో నా ఫోన్తో పాటు అప్పట్లో టీపీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. మొత్తం 6,500 మంది ఫోన్లను కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసింది. తన కుటుంబసభ్యులు, వ్యక్తిగత సహాయకులు, పనిమనుషుల ఫోన్లు, భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసి విన్నారు..’ అని కేంద్రమంత్రి ఆరోపించారు. ఎస్ఐబీని అడ్డుపెట్టుకుని ట్యాపింగ్కు పాల్పడ్డారు.. ‘ఎస్ఐబీని అడ్డం పెట్టుకుని కేసీఆర్, కేటీఆర్ ట్యాపింగ్కు పాల్పడ్డారు. రాజకీయ నాయకులతో పాటు వ్యాపారులు, సినిమావాళ్లు, ప్రొఫెసర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. కాంట్రాక్టర్లను, లీడర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఎస్ఐబీ అధికారులు ప్రభాకర్రావు, రాధాకిషన్రావు, ప్రణీత్రావు క్షణక్షణం బాధపడేలా శిక్షవేయాలి. కానీ రేవంత్ ప్రభుత్వం వీరిని కాపాడే ప్రయత్నం చేస్తోంది. కాంట్రాక్టర్లు, ఇతర వర్గాల వారిని బెదిరించి వేలకోట్ల వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చినందున దీని దర్యాప్తును ఈడీకి అప్పగించాలి. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే వెంటనే ఈడీ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.డబ్బులు ఎవరు తిన్నారో తేల్చాలి.. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి దగ్గర రూ.7 కోట్లు పట్టుకున్నారు. మరికొందరు కాంగ్రెస్ వాళ్ల దగ్గర కోట్ల రూపాయలు పట్టుకున్నారు. ఆ పైసలన్నీ ఎటుపోయినయ్? ట్యాపింగ్ గ్యాంగ్ తిన్నారా? ట్విట్టర్ టిల్లు తిన్నాడా? తేల్చాలి..’ అని సంజయ్ అన్నారు. అన్ని ఆధారాలు ఉన్నా కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్టు చేయలేదని దుయ్యబట్టారు. సిట్ విచారణ సందర్భంగా ట్యాపింగ్నకు సంబంధించి తన వద్ద ఉన్న సమాచారం, ఆధారాలు అందజేసినట్లు తెలిపారు. కాగా శుక్రవారం సంజయ్తో పాటు ఆయన పీఆర్వో పసునూరి మధు, వ్యక్తిగత సహాయకులు బోయినపల్లి ప్రవీణ్కుమార్, పోగుల తిరుపతి స్టేట్మెంట్లు కూడా పోలీసులు రికార్డ్ చేశారు. కాగా సిట్ విచారణకు వెళ్లే ముందు బంజారాహిల్స్లోని తన నివాసం వద్ద కూడా ఆయన మీడియాతో మాట్లాడారు. -
బండి సంజయ్కు లీగల్ నోటీసులిస్తా.. కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్పై ఆరోపణలు నిరూపించాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. 48 గంటల్లో బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే లీగల్ నోటీసులిస్తా’’ అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ హెచ్చరించారు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ, బండి సంజయ్కు తెలివితేటలు ఎలా పని చేస్తాయో అర్థం కాలేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.అలాగే కనీస జ్ఞానం కూడా లేదు. ఆయన ఆరోపణలు హద్దు దాటాయి. ఇంత చౌకబారు వ్యాఖ్యలు ఆయనకు కొత్త కాదు.. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలలో కొంతైనా నిజం ఉందో లేదో నిరూపించమని సవాల్ విసురుతున్నా.. ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే న్యాయపరమైన చర్యలు తప్పవు’’ అంటూ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.కాగా, ఇవాళ సిట్ విచారణకు బండి సంజయ్ హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. ఎస్ఐబీను సొంత అవసరాలకు కేటీఆర్ వాడుకున్నారన్న బండి సంజయ్.. కేసీఆర్ దగ్గర పనిచేసిన మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు. -
కేసీఆర్ కూతురు, అల్లుడు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు. విచారణ అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కువగా తన ఫోన్ కాల్స్నే ట్యాప్ చేశారన్నారు.‘‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి గతంలోనే నోటీస్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో విచారణకు ఆలస్యం జరిగింది. అధికారులు నా ఫోన్ ట్యాపింగ్ వివరాలు చూపెట్టిన తర్వాత నేను షాక్కు గురయ్యాను. మావోయిస్టుల ఫోన్ ట్యాపింగ్ చేయాల్సింది నా ఫోన్ ట్యాప్ చేశారు. హరీష్రావు, రేవంత్ రెడ్డి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. వావి వరసలు లేకుండా ఫోన్ ట్యాప్ చేశారు. కేసీఆర్ కుమార్తె కవిత, అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేశారు’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.నా దగ్గర ఉన్న రిపోర్ట్ ఇచ్చాను. సిట్ అధికారులు చెప్పిన విషయాలను విని షాక్కు గురయ్యా.. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ కార్యాచరణను ముందుగానే సమాచారం తెలుసుకుని భగ్నం చేసేవారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోలేదు. వాట్సాప్ కాల్, సిగ్నల్ ద్వారానే మాట్లాడుకునే వారు. మావోయిస్టుల లిస్ట్లో మా పేర్లు పెట్టి మా ఫోన్లు ట్యాప్ చేశారు. వేలాది ఫోన్లు ట్యాప్ చేశారు. అక్కడ లిస్ట్ అంతా ఉంది..ఎస్ఐబీను సొంత అవసరాలకు కేటీఆర్ వాడుకున్నారు. కేసీఆర్ దగ్గర పనిచేసిన మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సినిమా వాళ్లు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. గ్రూప్-వన్ పేపర్ లీకేజీ ఆందోళన సమయంలో పోలీసులు ముందుగానే మా ఇంటికి పోలీసులు వచ్చారు. గ్రూప్-వన్ లీకేజీ కేసు విచారిస్తున్న జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులు ఫాల్తు గాళ్ళు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది.వ్యాపార లావాదేవీలు చేసిన పెద్ద వ్యాపారుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర పట్టుకున్న రూ.7 కోట్లు ఎక్కడ?. రూ.20 కోట్లు పట్టుకున్న దగ్గర రెండు కోట్లు మాత్రమే చూపించారు. రేవంత్ రెడ్డి ఎందుకు ఈడీకి లేఖ రాయడం లేదు. సిట్ అధికారులు నిజాయితీ గల వారు. సిట్ అధికారుల మీద అనుమానం లేదు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అనుమానం ఉంది. కేసీఆర్, రేవంత్ ఇద్దరు ఒక్కటే.ముఖ్యమంత్రి ఫోన్ను గతంలో ట్యాప్ చేశారు కదా... ఆయనను పిలిచి విచారణ చేస్తారా?. ఒక్కో కేసుకు ఢిల్లీలో ముఠాలు అప్పగిస్తున్నారు. డ్రగ్స్, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ ఇలా ప్రతీ కేసుకు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారింది. కేసీఆర్కి రేవంత్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు. కేసీఆర్కు సీఎం రేవంత్ క్లీన్ చిట్ ఇవ్వడానికి ఎవరిచ్చారు అధికారం?. ఫోన్ ట్యాపింగ్పై పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వాలి.. సీఎం ఎలా ఇస్తారు?. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి?. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కేవలం తెలంగాణలోనే ఉన్నాయి. సిట్ విచారణ మీద నమ్మకం లేదు’’ అని బండి సంజయ్ అన్నారు. -
ఘోష్ కమిషన్.. కాంగ్రెస్ దారెటు.. బీజేపీ కోర్టులోకి బంతి?
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘట్టంపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. బ్యారేజీ దెబ్బతిన్న విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపు 16 నెలలు విచారణ చేసి ఒక నివేదిక సమర్పించారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావులతో పాటు పలువురు అధికారుల పాత్రను తప్పుపట్టింది.అలాగే ప్రస్తుతం బీజేపీ ఎంపీ, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ను కూడా ఆక్షేపించింది. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తదితర మంత్రుల సమక్షంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదికలోని ముఖ్యమైన అంశాల సారాంశాన్ని ఒక ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేసీఆర్ తన పార్టీ నేతల సమావేశంలో ఒక వ్యాఖ్య చేస్తూ అది కాంగ్రెస్ కమిషన్ అని ఆరోపించారు. ఈ నివేదిక పేరుతో కొన్ని అరెస్టులు కూడా జరగవచ్చని ఆయన అంచనా వేశారు. తదుపరి హరీష్ రావు బీఆర్ఎస్ పక్షాన మరో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కమిషన్ చేసిన అబ్జర్వేషన్స్ను తప్పుపట్టారు. హరీష్ అలా చేయడం న్యాయ వ్యవస్థను కించపరచడమేనని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఈ వాద ప్రతివాదాలలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నదానిపై ఇప్పటికిప్పుడే ఒక అభిప్రాయానికి రాలేము.ఈ సందర్భంలో గతంలో ఆయా ప్రభుత్వాలపై వేసిన కమిషన్లతో ఎవరికి ఇబ్బంది కలగలేదనే చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారెవ్వరూ ఈ తరహా కేసులు ఎదుర్కోలేదు. చలన చిత్రాభివృద్ది సంస్థ అవకతవకలకు సంబంధించి జరిగిన కమిషన్ విచారణకు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి హాజరయ్యారు. కమిషన్ నివేదికలో ఆయనను తప్పు పట్టలేదు. ఒక భూ సేకరణ స్కాంలో విచారణ జరుగుతున్న సమయంలోనే ఇంకో మాజీ సీఎం స్టే పొందారు. విభజన తర్వాత ఏపీలో రాజమండ్రి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబే విచారణ సంఘాన్ని నియమించుకున్నారు. అందులో ఆయనను కమిషన్ ఆక్షేపించలేదు. ఇప్పుడు కేసీఆర్ ఈ విచారణ సంఘం నివేదికను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. రేవంత్ ప్రభుత్వం ఆయనపై కేసు పెడుతుందా? అరెస్టు చేస్తారా?.ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కాంలపై దర్యాప్తు జరిపించి అంతకుముందు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడుపై కేసులు పెట్టింది. కొన్ని కేసుల్లో ఆయన బెయిల్ తెచ్చుకోగా, ఒక కేసులో అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందో అప్పుడే చెప్పలేం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లవలసి వచ్చింది. ఆ అనుభవం రీత్యా కేసీఆర్ను కూడా అరెస్టు చేస్తారా అన్న చర్చ ఉన్నప్పటికీ తాము కక్ష రాజకీయాలు చేయబోమని అంటున్నారు. పైగా కేసీఆర్కు ఫాం హౌసే ఒక జైలు అని, వేరే జైలు ఎందుకు అని వ్యాఖ్యానించి అరెస్టు జరగక పోవచ్చన్న సంకేతం ఇచ్చారు. ఇది ఒక్క కేసీఆర్కే వర్తిస్తుందా? హరీష్ రావు, ఇతర అధికారులకు కూడా వర్తిస్తుందా అన్నది చెప్పలేం. మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లు ఇచ్చి కుంగిన ఘటన కేసీఆర్, హరీష్రావులకు, బీఆర్ఎస్కు అప్రతిష్ట తెచ్చిందన్నది వాస్తవం.అదే సమయంలో కేసీఆర్ లక్ష్య శుద్ధితోనే కాళేశ్వరం ప్రాజెక్టును సంకల్పించారని చెప్పాలి. కాకపోతే నిర్మాణం వేగంగా చేయాలన్న తొందరపాటులో ఆయన తీసుకున్న నిర్ణయాలు సమస్యలకు దారి తీసి ఉండవచ్చునని అనిపిస్తుంది. కమిషన్ పరిశీలనల్లో ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. కాళేశ్వరం నిర్మాణంపై ప్రభుత్వ స్థాయిలో కాకుండా, కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నది ఒకటి. మంత్రివర్గం నుంచి పాలనాపరమైన అనుమతులు తీసుకోలేదన్నది ఇంకో పరిశీలన. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని చెప్పి, బరాజ్ను మేడిగడ్డకు మార్చడంలో నిజాయితీ కొరవడిందన్నది మరో వ్యాఖ్య. మేడిగడ్డ వద్ద నిర్మాణానికి రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ వ్యతిరేకత తెలిపినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కొందరు కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చే యత్నం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ తప్పుడు డిజైన్లు ఇచ్చిందన్నది వేరొక ఆరోపణ. అధిక వడ్డీకి రూ.84 వేల కోట్ల అప్పు చేయడాన్ని కూడా తప్పు పట్టారు. ఈ విషయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. శాసనసభలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు చేపడతామని రేవంత్ రెడ్డి చెప్పారు.ఘోష్ కమిషన్ నివేదికను ఆధారం చేసుకుని బీఆర్ఎస్పై కాంగ్రెస్ దాడి పెంచింది. అయితే, వెంటనే ఏం చేయాలన్న దానిపై ఒక నిర్ణయానికి రాలేకపోయింది. అసెంబ్లీలో ఎటూ ఈ నివేదికను పెడతారు. అందులో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు తమ వైఖరికి అనుగుణంగానే మాట్లాడుతారు తప్ప కొత్తగా చెప్పేది ఉంటుందా అన్నది సందేహం. అయినా అసెంబ్లీలో చర్చించడం మంచిదే. ఈ నివేదికలో కొంతమంది కీలక అధికారుల పాత్ర గురించి విస్మరించారన్న వాదన ఉంది. ప్రస్తుత సీఎస్గా ఉన్న రామకృష్ణారావు జోలికి కమిషన్ వెళ్లలేదని చెబుతున్నారు. బారేజ్ను మేడిగడ్డకు మార్చడం వల్ల ఆరు వేల కోట్ల నష్టం జరిగిందని కమిషన్ అభిప్రాయపడిందని కథనం. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన దాదాపు లక్ష కోట్ల వ్యయం వృథా అయినట్లే అన్నట్లు ముఖ్యమంత్రి మొదలు, మంత్రులు, కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తుండడం విశేషం. ఈ ప్రాజెక్టులో మరో రెండు బారేజీలు, కాల్వలు, టన్నెల్స్ తవ్వకం, రిజర్వాయర్ల నిర్మాణం వంటివి కూడా ఉన్న విషయాన్ని ప్రజలలోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారని అనిపిస్తుంది.స్థల ఎంపికపై నిపుణుల కమిటీ అభిప్రాయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో కేసీఆర్ వివరించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకువెళ్లనిచ్చిందన్న ప్రశ్న వస్తుంది. పైగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టుకు ప్రశంసించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పఢ్నవీస్ స్వయంగా ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరై కేసీఆర్ను మెచ్చుకున్నారు. మరో పాయింట్ ఏమిటంటే ప్రస్తుతం కాంగ్రెస్ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా, కాళేశ్వరం సబ్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన ఆ రోజుల్లో ఈ ప్రాజెక్టును సమర్థించినట్లే కదా!. దానిపై ఏం చెబుతారు?. ప్రాణహిత-చేవెళ్లకు ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చిన ఈ ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మాణం చేసి ఘనత తెచ్చుకోవాలన్న క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం కొన్ని తప్పులు కూడా చేసినట్లు అర్దం అవుతుంది.అయితే, అవి పెద్ద తప్పులా? కాదా? అన్నది పరిశీలించాలి. ఈ నేపథ్యంలోనే రేవంత్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.. అది కూడా మంచిదే. మామూలుగా అయితే ఈ నివేదిక ఆధారంగా కేసులు పెట్టి ఉండవచ్చు. కానీ, అలా చేయకుండా అసెంబ్లీలో చర్చిస్తామని చెబుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ ప్రాజెక్టుపై విచారణకు సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం అలా చేస్తుందా? అన్నది ఒక ప్రశ్న. తద్వారా ఈ బాల్ను బీజేపీ కోర్టులో వేస్తుందా? అలా జరిగితే కాంగ్రెస్ చేతిలో ఒక ఆయుధం పోయినట్లు అవుతుంది. కనుక ఆ పని చేయకపోవచ్చు. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయి ఇంతకాలమైనా ప్రభుత్వం మరమ్మతులకు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీనివల్ల ప్రాజెక్టు నిరర్థకంగా మారే ప్రమాదం ఉంటుంది. ఉన్న ప్రాజెక్టును వినియోగించుకుంటూనే ప్రభుత్వం తదుపరి చర్యలకు వెళ్లితే మంచిదే.ఇక మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వాదన కూడా సమర్థంగానే ఉందని చెప్పాలి. ఇది ఏకపక్ష నిర్ణయం కాదని, అసెంబ్లీలో కూడా చర్చ జరిగిందని ఆయన అంటున్నారు. కేబినెట్ ఆమోదం కూడా ఉందన్నది ఆయన వాదన. మొత్తం 665 పేజీల రిపోర్ట్ కాకుండా సంక్షిప్త నివేదికను బహిర్గతం చేస్తే సరిపోతుందా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తుమ్మిడి హెట్టి వద్ద నీటి లభ్యత సరిపడా లేదని కేంద్ర జల సంఘమే చెప్పిందని హరీష్ రావు వివరిస్తున్నారు. మరి కమిషన్ తన నివేదికలో అందుకు విరుద్దంగా ఎలా పెట్టిందో తెలియదు. అలాగే మంత్రివర్గ ఆమోదం ఉందన్న హరీష్ వాదనకు కేబినెట్ తీర్మానాలు చూపించాల్సి ఉంటుంది. అసెంబ్లీలో చర్చ జరిగిన మాట అయితే వాస్తవం. దానిని కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదా అన్నది చూడాలి. ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ ఉదంతం బీఆర్ఎస్కు నష్టం చేసింది.ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలడం, పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిన ప్రమాదం వంటి వాటిని ఈ సందర్భంగా హరీష్, కేటీఆర్ తదితరులు ప్రస్తావిస్తున్నారు. గుజరాత్లో ఒక వంతెన కూలిన ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించిన ఉదంతాన్ని కూడా ఉటంకిస్తున్నారు. ప్రమాదాలు జరిగితే దానిని ముఖ్యమంత్రికి అంటగడితే, ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనకు రేవంత్, ఉత్తమ్ కుమార్ బాధ్యత వహిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైతే మరీ తీవ్రమైన చర్య తీసుకుంటుందా అన్నది సందేహమే. రాజకీయంగా తమకు ప్రయోజనం అనుకుంటేనే అలా చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ మాత్రం డిఫెన్స్ నుంచి అఫెన్స్ వెళ్లడానికి ప్రయత్నిస్తుంది.అందుకే కేసీఆర్ దీనిని కాంగ్రెస్ కమిషన్ నివేదిక అని ధ్వజమెత్తితే, కేటీఆర్ ఈ నివేదిక ఒక ట్రాష్ అని వ్యాఖ్యానించారు. హరీష్ రావు ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా.. ఏ మాత్రం అవకాశం ఉన్నా వెంటనే ఆ బారేజీకి రిపేర్లు చేయించి, నీటిని ప్రజలకు అందుబాటులోకి తేవడం ఉపయుక్తం అని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అఫీషియల్: ఆ పార్టీలోకే గువ్వల బాలరాజు
బీఆర్ఎస్ మాజీ నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు రోజుల కిందటే ఆయన గులాబీ పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంపై ఇవాళే స్పష్టత వచ్చింది. బీజేపీలో చేరబోతున్నారని అధికారిక సమాచారం. సాక్షి, హైదరాబాద్: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావుతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన తమ పార్టీలో చేరబోతున్నారని రామచందర్రావు ప్రకటించారు. నియోజకవర్గ, జిల్లా ప్రజలు, కార్యకర్తలతో చర్చించాకే బాలరాజు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.2007 అక్టోబరు 6న బీఆర్ఎస్లో చేరారు గువ్వల బాలరాజు. 2009లో నాగర్కర్నూల్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్) తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో, 2018లో రెండు పర్యాయాలు అచ్చంపేట(ఎస్సీ) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2022 నుంచి నాగర్కర్నూల్ జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. కొంతకాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న ఆయన అనూహ్యంగా రాజీనామా చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాశమైంది.రాజీనామా సమయంలోనే ఆయన బీజేపీ అధిష్టానం నుంచి భరోసా ఇవ్వడంతోనే ఆయన బీఆర్ఎస్ను వీడినట్లు చర్చ జరిగింది కూడా. అటుపై ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ తీవ్రంగా విఫలమైందంటూ బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. -
బీసీ రిజర్వేషన్లను తగ్గించే కుట్ర: కిషన్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్ను 32 శాతానికి తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు బీసీలను అణగదొక్కే కుట్రలో భాగమని ఆరోపించారు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ సీట్లలో 31 మంది నాన్–బీసీలు గెలవడం ఏమిటని కిషన్రెడ్డి ప్రశ్నించారు. ‘ఒవైసీ బీసీనా? బీసీలకు రిజర్వు చేసి మజ్లిస్ చేతుల్లో పెట్టడం ద్వారా న్యాయం జరుగుతుందా?’అని కిషన్రెడ్డి నిలదీశారు. రాష్ట్రంలో జరిగిన బీసీ లెక్కల సర్వేను తూతూ మంత్రంగా నిర్వహించారని, హైదరాబాద్ నగరంలో 25 శాతం ఇళ్లలోకి వెళ్లకుండా సర్వే ముగించారని ఆరోపించారు. బీసీ జనాభాను తక్కువగా చూపించి రిజర్వేషన్లను తగ్గించాలన్న కుట్రలో భాగంగానే ఇది జరిగిందని ధ్వజమెత్తారు. ఈ కుట్రలను బీసీలు గుర్తించాలని కోరారు. నాడు బీఆర్ఎస్.. నేడు కాంగ్రెస్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మతపరమైన రిజర్వేషన్ల కోసం రాజకీయ నాటకాలు ఆడుతున్నారని కిషన్రెడ్డి ఆరోపించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 12 శాతం ముస్లిం రిజర్వేషన్ల కోసం కుట్రలు చేసినట్టే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ‘ఇదేనా మీ తెలంగాణ మోడల్? బీసీలను మోసం చేయడమే మోడలా?’అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వమే బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించిందని తెలిపారు. రాహుల్గాందీని ప్రధానిని చేస్తామన్న సీఎం రేవంత్ ప్రకటనను కిషన్రెడ్డి కొట్టిపారేశారు. ‘మీరు అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లోనైనా గెలవండి. మోదీని గద్దె దించుతామన్న మీ గొప్పలు సూర్యుడిపై ఉమ్మేసినట్టే. అది మీ మీదే పడుతుంది’అని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతిపై రాష్ట్ర మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలను కిషన్రెడ్డి ఖండించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మేమే ప్రత్యామ్నాయం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ఇప్పటికే పశ్చాత్తాపం చెందుతున్నారని, రాబోయే ఎన్నికల్లో అవినీతి బీఆర్ఎస్, చేతకాని కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలని ప్రజలు ఆశిస్తున్నారని కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం బీజేపీ నిబద్ధతతో పనిచేస్తుందని తెలిపారు. అధికారం కోసం అలవిగాని హామీలిచ్చి, ఇప్పుడు వాటిని నెరవేర్చకుండా ప్రభుత్వం ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తోందని ఆరోపించారు. -
రేవంత్కు కేసీఆర్ ఫోబియా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన ప్రసంగాల్లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారని, ఆయనకు కేసీఆర్ ఫోబియా పట్టుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. కేసీఆర్ పేరును ప్రస్తావించకుండా ఉండలేని మానసిక రుగ్మత రేవంత్రెడ్డికి ఉన్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరిట ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తు న్న కాంగ్రెస్ ప్రభుత్వం.. బీసీ డిక్లరేషన్లోని ఇతర హామీలను పూర్తిగా పక్కన పెట్టిందని అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు గురువారం కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్వన్నీ డ్రామాలే..: ‘42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని ఓట్లు వేయించుకున్న రేవంత్.. ఇప్పుడు రాహుల్గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత రిజర్వేషన్ల పెంపు జరుగుతుందన్నట్టుగా మాట్లాడుతున్నారు. గతంలో తెలంగాణ సాధించిన తర్వాతే తిరిగి వస్తానని ప్రకటించి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ లక్ష్యాన్ని చేరుకున్నారు. అదే తరహాలో ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ బీసీ రిజర్వేషన్లు సాధించారో లేదో చెప్పాలి. ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్గాందీతో సీఎం రేవంత్ ఏకకాలంలో డ్రామా చేస్తున్నాడు. చంద్రబాబు కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టే డ్రామాలకు పాల్పడుతున్నాడు. చివరివరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని రేవంత్ చెప్తున్న మాటలు ఆయన డ్రామాలో భాగమే..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు.. ‘బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ కండువాలు వేసుకుని దేవుడి కండువాలు కప్పుకున్నామని చెప్తున్నారు. వారు ఏ పార్టీలో ఉన్నారో రాష్ట్రంలో చిన్న పిల్లలను అడిగినా చెప్తారు. కానీ అసెంబ్లీ స్పీకర్కు మాత్రం ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదు. స్థానిక సంస్థల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అడ్డగోలుగా నిధులు సమకూర్చుకుంటోంది. గడిచిన 20 నెలల్లో సంపాదించిన అవినీతి సొమ్మును స్థానిక ఎన్నికల్లో పంచేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పదేళ్లు వెనక్కి పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తుంది..’అని కేటీఆర్ అన్నారు. కార్యకర్తలకు న్యాయం చేస్తాం ‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం తెలంగాణ అభివృద్ధిపై దృష్టి సారించడంతో పార్టీ కార్యకర్తలకు తగినంత న్యాయం చేయలేకపోయాం. పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను కాపాడుకుని వారికి అండగా నిలుస్తాం. పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించాలి. కొందరు చెప్తున్నట్లు బీఆర్ఎస్ ఏ పార్టీలోనూ విలీనమయ్యేది లేదు. తెలంగాణ ఉన్నంత కాలం గులాబీ కండువా ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీలను మట్టి కరిపించి మళ్లీ కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుందాం..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, పట్నం నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.