
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటికైతే బీఆర్ఎస్లోనే ఉన్నానని.. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలిగే ఆలోచనతో ఉన్నానని మనసులో మాట బయటపెట్టారు.
రాఖీ పండుగ సందర్భంగా.. తన అక్కాచెల్లెళ్లతో రాఖీ కట్టించుకున్న అనంతరం శనివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాఖీ పండగంటే తనకు ఎంతో ఇష్టమన్న మల్లారెడ్డి.. ఈ పండుగ నాడే తన ఇంజనీరింగ్ కళాశాలలు ప్రారంభించానని చెప్పారు. రాజకీయంగా బీజేపీ వైపా, టీడీపీ వైపా, బీఆర్ఎస్ పార్టీల వైపా అన్నది కాదని.. తాను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్లోనే ఉన్నానని మల్లారెడ్డి చెప్పారు.
తనకు 73సంవత్సరాలు వచ్చాయని.. ఇంకా ఏవైపునకు చూడాల్సిన అవసరం ఏముందని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. ‘‘ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిని అయ్యా. ఇంకా మూడేళ్లు రాజకీయాల్లో ఉంటా’’ అని చెప్పుకొచ్చారు. అస్సలు తాను రాజకీయమే వద్దనుకుంటున్నానని తెలిపారు. కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామని అనుకుంటున్నానని అన్నారాయన.