breaking news
-
‘ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు’
సాక్షి,హైదరాబాద్: పోన్ ట్యాపింగ్ అంశంపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చిట్చాట్లో ‘ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు.. ఫోన్ ట్యాపింగ్ ద్వారా కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్న మాటల్ని విన్నానని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి వినాల్సి వస్తే సూసైడ్ చేసుకోవడం ఉత్తమం. తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వస్తే లీగల్గా పర్మీషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సిట్ అధికారులను డిక్టేట్ చేయను. నాఫోన్ ట్యాపింగ్ కాలేదని అనుకుంటున్నా.ఫోన్ టాపింగ్ కేసులో నన్ను విచారణకు పిలిస్తే వస్తా. ట్యాపింగ్ జాబితాలో నా ఫోన్ నెంబర్ ఉందో లేదో తెలియదు. రిజర్వేషన్ల విషయంలో ఏ సమస్య వచ్చినా...స్థానిక ఎన్నికలు ఆగవు.ఈ విషయంలో మా రాజకీయ వ్యూహం మాకుంది’ అని తెలిపారు. -
రాజాసింగ్కు ఒక్క మిస్డ్కాల్ చాలు.. బండి-ఈటల వివాదంపై ధర్మపురి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో బీజేపీ రాజకీయాలపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ రాజీనామా అంశంతో పాటు ఈటల-బండి మధ్య జరుగుతున్న కోల్డ్వార్పైనా అరవింద్ స్పందించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బుధవారం ఆయన పార్టీకి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడుతూ.. ‘‘బండి సంజయ్, ఈటల రాజేందర్ వివాదంపై న్యూట్రల్ ఎంక్వయిరీ కమిషన్ వేయాలి. బీజేపీ పాత అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు కలిసి ఈ అంశంపై మాట్లాడాలి. అవసరమైతే అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకోవాలి’’ అని ధర్మపురి హైకమాండ్ను కోరారు.ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారంపై మాట్లాడుతూ.. ‘‘రాజాసింగ్ ఐడియాలాజికల్ మ్యాప్. కొన్ని విషయాల్లో మనస్థాపం చెందారు. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కాలేదు రాజీనామా చేశారు. ఒకవేళ ఆయన మళ్లీ పార్టీ సభ్యత్వం కావాలనుకుంటే మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. మళ్లీ మెంబర్షిప్ వస్తుంది. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలి. పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలి.. ఫలితం చూపించకపోతే పక్కకు పెట్టాలి. ఏ పార్టీకైనా కార్యకర్తలు కీలకం. ఆ కార్యకర్తలు నాయకులుగా ఎదిగేందుకు ఇదే మంచి సమయం. ఇందూర్ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి మేం గెలుస్తున్నాం. ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు. బీసీ రిజర్వేషన్లపై ముందుగా సుప్రీం కోర్టులో కొట్లాడాలి అని ఎంపీ అరవింద్ అన్నారు. -
తెలంగాణ కాంగ్రెస్లో పదేళ్ల లొల్లి!
తెలంగాణకు పదేళ్లు తానే ముఖ్యమంత్రినంటూ ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సహజంగానే కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. చర్చోపచర్చలకు దారితీసింది. అది కాంగ్రెస్ పార్టీ విధానం కాదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరని కూడా అన్నారు. ఇది కాస్తా తెలంగాణ అధికార పార్టీ రాజకీయాలలో కొత్త వివాదానికి తెరదీసింది. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ '2034 వరకు అంటే.. పదేళ్లపాటు పాలమూరు బిడ్డ సీఎంగా ఉంటాడు. కేసీఆర్.. ఈ విషయాన్ని డైరీలోనో.. నీ గుండెలపైనో రాసుకో" అని సవాల్ విసిరారు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతానని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ప్రజలకు, ఒక ప్రాంతానికి ఇచ్చిన హామీలను నెరవేర్చుతానని చెప్పడం వరకు ఓకే. వచ్చే తొమ్మిదేళ్లు కూడా తానే సీఎం అని చెప్పడం తనపై తనకు ఉన్న నమ్మకం కావచ్చు. కానీ కాంగ్రెస్లో అలా బహిరంగంగా చెప్పడానికి పార్టీ అధిష్టానం కాని, ఇతర నేతలు కాని ఇష్టపడరు. రాజగోపాలరెడ్డి అభిప్రాయం కూడా అదే. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నిర్ణయం ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా సీఎంను నిర్ణయిస్తారని ఆయన అన్నారు. కాంగ్రెస్లో ఈ విధానం ఉన్న మాట నిజమే కాని, కేంద్రంలో అధికారం లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అధిష్టానం పెద్దలు కూడా సీఎంల మార్పుపై సంచలన నిర్ణయాలు చేసే పరిస్థితి పెద్దగా కనబడదు. కర్ణాటక వ్యవహారమే దీనికి ఉదాహరణ. అక్కడ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మార్చాలని, తనను సీఎంను చేయాలని ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ డి.కె.శివకుమార్ కోరుకుంటున్నారు. అయినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలు ఇందుకు సాహసించడం లేదు. పైగా ఈ ఐదేళ్లు సిద్దరామయ్య కొనసాగవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. దానికి అక్కడ ఉండే రాజకీయ, సామాజిక అంశాలు కారణాలు కావచ్చు. అయితే.. సిద్దరామయ్య కూడా వచ్చే ఎన్నికల తర్వాత కూడా తానే సీఎం అని చెప్పుకోవడం లేదు. కానీ రేవంత్ ధైర్యంగా 2028 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తిరిగి తానే సీఎం అవుతానని చెబుతున్నారు. తన వర్గంలో విశ్వాసం పెంచడానికి ఇది ఉపయోగపడవచ్చు కానీ, పార్టీలోని ఇతర వర్గాలలో ఇది అసహనానికి కారణం అవుతుంది. కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న అభ్యర్ధులు ఎక్కువే. 2014లో అయితే డజను మంది తామే అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకున్నారు. అందుకే కాంగ్రెస్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) విలీనం కాకుండా అడ్డుపడ్డారు. కేసీఆర్ తనకు సీఎం పదవి ఇస్తే విలీనం చేస్తానని కండిషన్ పెట్టారు. చివరికి ఒంటరిగా పోటీచేసి విజయం సాధించడంతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. పదేళ్లు ఆ పరిస్థితి కొనసాగడంతో కాంగ్రెస్ నేతలు నిరాశలో మునిగిపోయారు. 2018 ఎన్నికలకు కొద్దికాలం ముందు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరారు. తదుపరి వర్కింగ్ అధ్యక్షుడుగా, అనంతరం పీసీసీ అధ్యక్షుడుగా నియమితులయ్యారు. ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటమి పాలైనా, మల్కాజిగిరి ఎంపీగా గెలవడం ఆయనకు కలిసి వచ్చింది. ఢిల్లీ స్థాయిలో పార్టీ నాయకత్వంతో సంబంధాలు పెట్టుకోగలిగారు. పార్టీ సీనియర్ నేతలు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, తదితరులు తొలుత రేవంత్ నాయకత్వానికి సుముఖత చూపలేదు. తప్పని స్థితిలో ఒప్పుకున్నారు. రేవంత్ నియామకంపై కోమటి రెడ్డి వెంకట రెడ్డి వంటివారు గట్టి విమర్శలే చేసేవారు. ఆయన సోదరుడు రాజగోపాల రెడ్డితో కలిసి తమకు పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే అధికారం సాధిస్తామని చెప్పినా అధిష్టానం వారివైపు మొగ్గు చూపలేదు. ఒక దశలో కాంగ్రెస్ నాయకత్వం అప్పటి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ఎదుర్కోవడానికి సరైన చర్య తీసుకోవడం లేదంటూ రాజగోపాల రెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇందుకోసం ఆయన తన ఎమ్మెల్యే పదవి కూడా వదలుకున్నారు. తదుపరి ఉప ఎన్నికలో ఆయన ఓటమి చెందారు. ఆ తర్వాత మళ్లీ 2023 జనరల్ ఎన్నికలు వచ్చేసరికి తిరిగి కాంగ్రెస్లో చేరిపోయి మునుగోడు నుంచే పోటీచసి విజయం సాధించారు. ఈయన సోదరుడు, సీనియర్ నేత వెంకట రెడ్డి నల్గొండ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. రాజగోపాలరెడ్డి కూడా మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. అధిష్టానం కూడా ఆయనను బుజ్జగించే యత్నం చేసింది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారన్న భావనతో ఆయనకే సీఎం పదవి అప్పగించింది. మల్లు భట్టి సీఎం రేసులో నిలిచినా ఉప ముఖ్యమంత్రి పదవితో సర్దుకోక తప్పలేదు. అలాగే ఉత్తంకుమార్ రెడ్డి, వెంకట రెడ్డి తదితర ఆశావహులు కూడా రాజీపడి రేవంత్ కేబినెట్లో మంత్రులుగా చేరిపోయారు. అయినా వీరిలో కొందరు రేవంత్ పై ఎప్పటికప్పుడు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారట. రేవంత్ ప్రభుత్వం చేసే తప్పులను, వచ్చే ఆరోపణలను తెలియ చేస్తున్నారట. రేవంత్ కూడా అంతకన్నా తెలివిగా అధిష్టానంతో సంబంధాలు కొనసాగిస్తున్నందున ఇప్పటికైతే ఆయనను కదలించే శక్తి ఇతర కాంగ్రెస్ నేతలకు ఉన్నట్లు కనిపించదు. కాంగ్రెస్ రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అది వేరే సంగతి. కాంగ్రెస్ రాజకీయాలు చూస్తే ఉమ్మడి ఏపీలో పూర్తి టర్మ్ పదవి కాలంలో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే కావడం విశేషం. 2004లో ఆయన నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా కొందరు ఇతర నేతలు సీఎం పదవి కోసం పోటీ పడకపోలేదు. కానీ అధిష్టానం వైఎస్ నాయకత్వానికి అంగీకరించక తప్పలేదు. అలాగే 2009లో రెండోసారి గెలిచిన పిమ్మట అప్పటి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా తనకు సీఎం పదవి కావాలని ప్రకటన చేశారు. అయినా వైఎస్సార్కే సీఎం సీటు తిరిగి దక్కింది. 1956 లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి దాదాపు మూడేళ్ల తర్వాత కేంద్ర రాజకీయాలకు వెళ్లారు. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారు. 1962లో నీలం సంజీవరెడ్డి మళ్లీ సీఎం అయ్యారు కాని పూర్తి టర్మ్ ఉండలేదు. 1964లో ముఖ్యమంత్రైన కాసు బ్రహ్మానందరెడ్డి 1967 ఎన్నికల తర్వాత తిరిగి ఆ పదవి చేపట్టినా, పూర్తి కాలం కొనసాగలేకపోయారు. తరువాత పీవీ నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యారు. జై ఆంధ్ర ఉద్యమం కారణంగా ఆయన 1972లో పదవి వదలు కోవల్సి వచ్చింది. కొంతకాలం రాష్ట్రపతి పాలన తర్వాత సీఎం అయిన జలగం వెంగళరావు 1978 వరకు కొనసాగారు. ఆ తరుణంలో పార్టీలో వచ్చిన చీలికలో 1978లో మర్రి చెన్నారెడ్డి ఇందిరా కాంగ్రెస్ పక్షాన సీఎం అయ్యారు. 1978-83 మధ్య చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకటరామి రెడ్డి, కోట్ల విజయ భాస్కరరెడ్డిలు సీఎం పదవులు నిర్వహించారు. 1983లో ఎన్టీఆర్ స్థాపించినన టీడీపీ అధికారంలోకి వచ్చింది. తిరిగి 1989లో కాంగ్రెస్ గెలుపొందడంతో 1989-94 మధ్య చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రులయ్యారు. 1994 లో ఓటమి పాలైన కాంగ్రెస్ మళ్లీ 2004లో అధికారంలోకి వచ్చాక వై ఎస్ సీఎం అయ్యారు. 2009లో తిరిగి ఆయన ముఖ్యమంత్రయ్యాక అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులు అయ్యారు. అంటే వైఎస్సార్ తప్ప ఏ ఒక్క కాంగ్రెస్ సీఎం కూడా పూర్తి టర్మ్ పాలించలేదన్నమాట. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా దెబ్బతినిపోగా, తెలంగాణలో పదేళ్లపాటు అధికాంలోకి రాలేదు. 2023లో రేవంత్ సీఎం అయిన తర్వాత కొంత స్వతంత్రంగా ప్రభుత్వాన్ని, పార్టీని నడపడానికి యత్నిస్తున్నారు. తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తి అవడంతో మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వ్యక్తులు రేవంత్ను ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడుగానే చూస్తుంటారు. ఆయన కూడా అప్పడప్పుడు చంద్రబాబును ప్రశంసించినట్లు మాట్లాడుతుంటారు. నాగర్ కర్నూల్ సభలోనూ చంద్రబాబు ప్రస్తావన తెచ్చి మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ ప్రాజెక్టులు చేపట్టినట్లు మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించలేదు. అప్పుడప్పుడూ వైఎస్ పేరును ప్రస్తావిస్తున్నా, కాంగ్రెస్ వర్గాలకు అంత సంతృప్తి కలిగించే రీతిలో మాట్లాడడం లేదన్న భావన ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి తన వ్యాఖ్యలో నిఖార్సైన కాంగ్రెస్ నేతలు సీఎం చేసిన వ్యాఖ్యలను అంగీకరించరని అన్నారు. సాధారణంగా.. జాతీయ పార్టీలలో హై కమాండ్ దే తుది నిర్ణయం అనే సంగతి తెలిసిందే. అయితే ఇది పరిస్థితులను బట్టి, రాజకీయ పరిణామాలను బట్టి, ఆయా వ్యక్తుల బలాబలాలను బట్టి ఉంటుంది. ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ బలంపై కూడా ఆధారపడి ఉంటుంది. రేవంత్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో తనకు ఎక్కువ మద్దతు ఉండేలా చూసుకుంటున్నారు. అందువల్ల అధిష్టానం కూడా తొందరపడే పరిస్థితి ఉండదు. ఆ ధైర్యంతోనే రేవంత్ భవిష్యత్తులో కూడా తానే సీఎం అని చెప్పుకుని ఉండవచ్చు. రేవంత్ పై అసహనం వ్యక్తం చేయడం మినహా, అసమ్మతి ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేకపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మద్దతు కూడగడతాం: డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని వెనుక బడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం కోసం ప్రయత్నిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సహేతుకమని భావించే ప్రతీ రాజకీయ పార్టీని కలుస్తామన్నారు. ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా సహకరించాలని అన్ని పార్టీలను కోరతామని, అందరి మద్దతూ కూడగడతామని చెప్పారు. మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయి పార్టీలను కలిసి మద్దతు కోరతామని చెప్పారు. శతాబ్దాల నుంచి అన్యాయం జరుగుతున్న వర్గాలకు న్యాయం చేసే దిశలో తాము మంచి సంకల్పంతో తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరిస్తారనే ప్రగాఢ నమ్మకం ఉందని చెప్పారు. ఈ బిల్లును అసెంబ్లీలో పెట్టి చర్చించినప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ కూడా మద్దతిచ్చాయని, ఇప్పుడు పార్లమెంట్లో కూడా ఆ పార్టీలు మద్దతివ్వాలని కోరారు. ఈ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ సమాచారం కోరినా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అన్నీ వివరిస్తాం రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ల పెంపు విషయంలో అనుసరించిన శాస్త్రీయ పద్ధతులను దేశంలోని పార్లమెంట్ సభ్యులకు వివరిస్తామని భట్టి చెప్పారు. కాంగ్రెస్ ఎంపీలతోపాటు ఇతర పార్టీల ఎంపీలకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అన్ని విషయాలను తెలియజేస్తామన్నారు. గతంలో జరిగిన సర్వేల అనుభవాలు, తాము నిర్వహించిన పైలట్ సర్వే, సర్వే ప్రశ్నావళి రూపకల్పన, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన సమావేశాలు, ఎన్యూమరేషన్ ప్రక్రియ, డేటా ఎంట్రీతోపాటు ఈ సర్వేను స్వతంత్ర నిపుణల కమిటీతో అధ్యయనం చేయించిన తీరును అందరికీ అర్థమయ్యేలా వివరిస్తామన్నారు. మొత్తం 88 కోట్ల పేపర్లలో నిక్షిప్తమైన కులగణన సమాచారాన్ని సరళీకృతం చేసిన అనంతరం అవసరమైన సమాచారాన్ని ప్రజలకు అందించామని చెప్పారు. నిపుణల కమిటీ ఇచ్చిన నివేదికను కూడా అసెంబ్లీలో, కేబినెట్లో పెట్టి ఆమోదించిన తర్వాత ప్రజల ముందుకు తెస్తామని వెల్లడించారు. ఆయన అడ్డుకునేలా మాట్లాడతారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావుకు దళితులన్నా, బీసీలన్నా చిన్నచూపు ఉన్నట్టుందని భట్టి వ్యాఖ్యానించారు. అందుకే ఆయా వర్గాలకు మేలు చేసే ప్రయత్నాలు ఎప్పుడు జరిగినా ఆయన అడ్డుకునే విధంగా మాట్లాడతారన్నారు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన వ్యవహారంలో ఆయన పాత్ర ఏంటో అందరికీ తెలుసన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని తాము చెప్పామని, చేశామని అన్న భట్టి.. తామే చెప్పాం కాబట్టి తామే చేసుకోవాలని రాంచందర్రావు వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. తామేమీ బీజేపీ అంతర్గత వ్యవహారాల గురించి అడగడం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే ప్రక్రియ గురించి అడుగుతున్నామని చెప్పారు. రాంచందర్రావు పంపిన లీగల్ నోటీసులు అందాయా అన్న ప్రశ్నకు భట్టి సీరియస్గా స్పందించారు. ‘లీగల్ నోటీసులకు భట్టి భయపడడు. నేను ఏం మాట్లాడానో దానికి కట్టుబడి ఉన్నా. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీగా, వ్యక్తిగా ఏం చెప్పాలో తెలుసు’ అని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ పార్టీకి చిత్తశుద్ధి లేకపోతే ఇంత ప్రక్రియ ఎందుకు చేస్తామని, ఈ అంశాన్ని ఇంత దూరం తీసుకొచ్చామంటేనే తమ చిత్తశుద్ధి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని భట్టి చెప్పారు. నాడు అవసరం లేదన్న వారే..అసలు కులగణన అవసరమే లేదని పార్లమెంటులో చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ.. తెలంగాణలో జరిగిన సర్వే అనంతరం దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో కులగణన చేయాలనే నిర్ణయానికి వచ్చారని భట్టి చెప్పారు. ‘తెలంగాణలో జరిగిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల గణన (సీప్యాక్స్) దేశంలోనే ఒక చారిత్రక సర్వేగా నిలిచిపోనుంది. సర్వే వద్దన్న మోదీ తెలంగాణ సర్వేతోనే ఒప్పుకునే స్థితికి తీసుకొచ్చాం. ఈ ప్రక్రియకు ఆద్యుడైన రాహుల్గాంధీ ఆలోచనను కేంద్ర ప్రభుత్వం అనుసరించేలా చేశాం. ఇక దేశంలో ఎప్పుడు, ఎక్కడ, ఏ రాష్ట్రంలో సర్వే జరిగినా తెలంగాణను మోడల్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేకుండా శాస్త్రీయంగా ఈ సర్వే చేశాం’ అని భట్టి చెప్పారు. -
‘ మీ పార్టీ సీఎంకి మీరే ఎందుకు సమయం ఇవ్వడం లేదు?’
ఢిల్లీ: పార్టీని ఎలా నడిపించాలనే విషయంపై పెద్దల మార్గదర్శకాలు తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చానని ఇటీవల తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన రామచందర్రావు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉన్న రామచందర్రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్పై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి 46సార్లు ఢిల్లీకి వచ్చినా ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ అపాయింట్మెంట్ దక్కలేదని విమర్శించారు. ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రులందరూ ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగితే అప్పుడు రేవంత్రెడ్డికి సమయం ఇచ్చారన్నారు. మరి మీ పార్టీ సీఎంకు మీరే ఎందుకు సమయం ఇవ్వడం లేదని ప్రశ్నించారు రామచందర్రావు. తాము మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమన్నారు. తెలంగాణ బీసీలను తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి ఆర్డినెన్స్ తెచ్చారని, న్యాయపరమైన చిక్కులు తెలిసి ... బీసీలను మోసం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లుకు, ఆర్డినెన్స్ కు మద్దతు ఇచ్చాం.. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని రామచందర్రావు స్పష్టం చేశారు. -
నాపై దాడికి యత్నించింది మా పార్టీ వారే!: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సంచలన ఆరోపణలకు దిగారు. తన పార్టీకి చెందిన వారే తనపై దాడికి యత్నించారని అన్నారాయన. ఈ విషయంపై సోమవారం ఆయన సాక్షితో మాట్లాడారు. సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్పై దుండగులు దాడికి యత్నించారు. మాణికేశ్వర్నగర్లో ఫలహారం బండి ఊరేగిస్తుండగా దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే గన్మెన్ల సమయస్పూర్తితో ఆయన దాడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై సాక్షితో సోమవారం ఆయన మాట్లాడారు. ‘‘నాపైన ఉద్దేశ్యపూర్వకంగా దాడి ప్రయత్నం జరిగిందనే అనుమానం ఉంది. నా నియోజకవర్గంలో మా పార్టీకి చెందిన ఓక నేత(గొల్లకిట్టు) నన్ను టార్గెట్ చేశారు. ఆయన వ్యవహారశైలిపై గత శుక్రవారం డీసీపీని కలిసి ఫిర్యాదు చేశా. ఆ వెంటనే నా సన్నిహితులను భయబ్రాంతులకు గురి చేశారు. నిన్న నాపై దాడికి ప్రయత్నం చేసిన వారంతా బయట నియోజకవర్గానికి చెందిన వారే. అందులో ముగ్గురిని గుర్తుపట్టి పోలీసులకు సమాచారం ఇచ్చా. అయితే.. ఇది పార్టీ పెద్దలకు చెప్పేంత పెద్ద ఇష్యూ కాదన్న ఆయన.. మళ్ళీ పోలీసులను కలిసి అన్ని వివరాలు చెప్తానన్నారు. ఆదివారం సాయంత్రం.. నియోజవర్గంలోని మాణికేశ్వర్నగర్లో ఫలహారం బండి ఊరేగిస్తుండగా ఎమ్మెల్యే శ్రీగణేశ్పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై దాదాపు 20 మంది దాడియత్నం చేశారు. అద్దాలు దించాలంటూ కారును వెంబడించారు. అప్రమత్తమైన గన్మెన్లు వాహనాన్ని నేరుగా ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లాలని డ్రైవర్కు సూచించారు. ఈ ఘటనపై ఓయూ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. -
పదేళ్లు సీఎంననడం అభ్యంతరకరం
నల్లగొండ: మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిపై మరోమారు విరుచుకు పడ్డారు. మరో పదేళ్ల పాటు తానే సీఎంనని రేవంత్ రెడ్డి ప్రకటించడంపై రాజగోపాల్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య బద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు’.. అని రాజగోపాల్రెడ్డి ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించాయి. -
‘కేటీఆర్.. అది మా డైలాగ్.. కాపీ కొట్టావ్’
హైదరాబాద్. రాష్ట్రంలో తమ ఫోన్లు సహా పలువురు ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించడమే కాకుండా దీనిపై లైడిటెక్టర్ పరీక్షలు రావాలంటూ సవాల్ చేశారు. ఈ అంశానికి సంబంధించి లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? మగాడివైతే రా అని సీఎం రేవంత్కు సవాల్ విసిరారు కేటీఆర్. ఇప్పుడు దీనిపై కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. ‘ మగాడివైతే రా అని కేటీఆర్ సవాల్ చేయడం సూట్ కాలేదు. ఇది మా డైలాగ్.. నువ్వు కాపీ కొట్టావ్’ అంటూ చమత్కరించారు. ‘రేవంత్ రెడ్డి వస్తే...నువ్వు తట్టుకోగలవా కేటీఆర్. రేవంత్ రెడ్డి నాటు కోడి , కేటీఆర్ బ్రాయిలర్ కోడి. కేటీఆర్ మీ హాయాంలో బెడ్రూమ్లోకి పోయి అరెస్ట్ చేస్తారు.. అప్పుడు ఏం చేశావ్. గత ఐదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంను మేము విమర్శిస్తే.. దానికి కారణం ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో అమలు కాని హామీలపైనే విమర్శలు చేశాం. అసెంబ్లీలో ప్రశ్నిస్తే కోమటిరెడ్డి, సంపత్లను సస్పెండ్ చేశారు. మాకైతే అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశమే ఇవ్వలేదు. మల్లన్న సాగర్లకు పోయేవారి పైన లాఠీలు విరగొట్టారు. పదేళ్లు దుర్మార్గపు పాలన సాగించారు. హరీష్ రావు మీ నియోజకవర్గ ప్రజలు ఎన్ని సార్లు ఫ్రీ బస్సు వాడుకున్నారో లెక్క తీద్దమా. సీఎం రేవంత్ వస్తారు.. కేసీఆర్ను రమ్మనండి,. గజ్వేల్లో మహిళలు ఫ్రీ బస్సు ఎక్కారో లేదో తేల్చుకుందాం. గతంలో ఆర్టీసీ బస్సులు ఖాళీగా తిరిగేవి. ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. .మహిళలకు ఫ్రీ ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ తిడుతున్నాడా.?, రూ.500కే గ్యాస్ సిలిండర్ , 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పై చర్చకు సిద్దమా కేటీఆర్. మహిళా సంఘాలకు మా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. దీనిపై చర్చకు వచ్చే ధైర్యం బిఆర్ఎస్ నేతలకు ఉందా?, సంపన్నులు తినే సన్నబియ్యాన్ని పేదలకు అందిస్తున్నాం. పేద పిల్లలకు కార్పోరేట్ విద్య అందించేందుకు ఓక్కో నియోజకవర్గంలో రూ. 200 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తున్నాం. ఇలాంటి ఆలోచనలు ఏరోజైనా కేసీఆర్ చేసాడా?, అని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. -
‘జనం కోరుకున్నారు.. సీఎం చెప్పారు’
హైదరాబాద్: ‘వచ్చే 10 ఏళ్లు పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉంటారు’ అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో అలజడి సృష్టించాయి. అవకాశం దొరికినప్పుడల్లా వచ్చేసారి కూడా తానే ముఖ్యమంత్రినని రేవంత్ చెప్పుకుంటూ ఉన్నారు. దీనిపై పలువురు కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉండగా, తాజాగా రాజగోపాల్ రెడ్డి బయటపడ్డారు.ప్రధానంగా రేవంత్ మళ్లీ తానే ముఖ్యమంత్రినని ఎలా చెప్పుకుంటారని రాజగోపాల్రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ స్పందించారు. రేవంత్ 10 నుంచి 15 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలనేది కొల్లాపూర్ ప్రజలు కోరుకున్నారని, రేవంత్ ముఖ్యమంత్రిగా ఉంటే తమ జిల్లా పెండింగ్ పనులు అవుతాయని సభకు వచ్చిన ప్రజలు కోరుకున్న నేపథ్యంలోనే అలా వ్యాఖ్యానించారని సంపత్ కుమార్ చెప్పుకొచ్చారు. జనం చెప్పిన దాన్నే సీఎం సభలో చెప్పారని స్పష్టం చేశారు. రాజగోపాల్రెడ్డి మంత్రి పదవి సంగతి అధిష్టానం చూసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం.జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను… pic.twitter.com/nGtGpQzgGk— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) July 19, 2025 కేటీఆర్ మాటలు శ్రుతిమించుతున్నాయిబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు చురకలంటిచారు సంపత్ కుమార్. కేటీఆర్ మాటలు శ్రుతిమించుతున్నాయని, ప్రస్తుతానికి కేటీఆర్ పుస్తకంలో ఒక పేజీ మాత్రమే చదివామని, ఇంకా చాలా కథ ఉందంటూ సెటైర్లు వేశారు. ‘కేటీఆర్ నీకంటే ఎక్కువ బాష మాట్లాడగలను... తట్టుకోలేవు. లోకేష్ను కలవలేదంటవ్...కలిస్తే తప్పేంటి అని నువ్వే అంటవ్...రేవంత్ రెడ్డి మొనగాడు. మొగాడు కాబట్టే మిమ్మల్ని మట్టి కరిపించాడు.సీఎంను ఉద్దేశించి మాట్లాడే పద్దతి నేర్చుకో కేటీఆర్’ అని సూచించారు. -
అంత నిస్సహాయ స్థితిలో ఏం లేను.. ఈటల ‘కోవర్టు’ వ్యాఖ్యల కలకలం
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలు తప్పవని.. వాటిని తట్టుకుని నిలబడితేనే నిలదొక్కుకోగలమని హుజూరాబాద్ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవా? అనే చర్చ జోరందుకుంది.సాక్షి, మేడ్చల్-మల్కాజ్గిరి: హుజురాబాద్ కార్యకర్తలను ఉద్దేశించి బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల ఆవేదన తనకు అర్ధం అయ్యిందని.. వాళ్ల రాజకీయ అవసరాలు తీర్చలేనంత నిస్సహాయ స్థితిలో తాను లేనని అన్నారాయన. శనివారం శామీర్పేట నివాసంలో ఆయన హుజురాబాద్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నాకు స్ట్రెయిట్ ఫైట్ తప్పా.. స్ట్రీట్ ఫైట్ రాదు. మీదికి ఒక మాట.. లోపల ఒక మాట మాట్లాడటం రాదు. బాజప్తా మాట్లాడతా.. బేజాప్తా మాట్లాడటం రాదు. హుజురాబాద్ చైతన్యానికి మారుపేరు. మనకు మనంగా భీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదు. 2021లో ఆ పార్టీ నుంచి నరకం అనుభవించా. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలు ఉంటాయి.. అవి తట్టుకుందాం. ప్రజలు ఎప్పుడూ మోసం చేయరు. అయితే హుజురాబాద్లో ఓడిపోతా అని ఊహించలేదు. శత్రువుతో నేరుగా కోట్లాడతా. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవడం నాకు రాదు. నా చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు. ధీరుడు వెనుదిరగడు.. ఎంత వరకు ఓపిక పట్టాలో తెలుసు. పదవులే పరవధిగా భావించే వాడిని కాదు. ఏ పార్టీలో పనిచేస్తే ఆ పార్టీకి అంకితభావంతో ఉంటా. నా అనుభవం వాడుకుంటే పార్టీకి ఉపయోగపడుతుంది. కాలం చాలా గొప్పది. హుజురాబాద్లో గత 20 ఏళ్లుగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోలేదు. హుజురాబాద్లో 2019 లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 53 వేల మెజార్టీ వచ్చింది. వ్యక్తులు ఎదకుండా ఏ పార్టీ బలపడలేదు. కార్యకర్తల ఆవేదన అర్ధం అయ్యింది. వాళ్ల రాజకీయా అవసరాలు తీర్చలేనంత నిస్సహాయంగా లేను. కొందరు సోషల్ మీడియాలో కుట్రలు చేస్తున్నారు. అబద్ధపు పునాదులపై బతుకుతున్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తున్నారు. వీధి పోరాటాలు మనకు అవసరం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని పల్లె లేదు. నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో ఆఫీస్ ఉంటుంది. నేను రాకముందు బీజేపీకి హుజురాబాద్లో కేడరే లేదు. నేను వచ్చాకే కరీంనగర్లో బీజేపీకి 50వేల మెజారిటీ. హుజురాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలో మనవాళ్లే ఉంటారు. కురుస స్వభావులను చూసి నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు. కొత్త, పాత వాళ్ళు అనే భావన లేదు. ఉన్నదాంట్లో గుర్తించి మనకి పదవులు వస్తాయి. ఎవరి దయాదక్షిణ్యాలు మనకు అవసరం లేదు. కోవర్టులు రాజకీయాల్లోనే కాదు అన్నింట్లో ఉంటారు. వారి గురించి బాధపడకండి..హుజురాబాద్ వస్తా.. మీ వెంటే ఉంటా.. మిమ్మల్ని గెలిపించుకుంటా. ఇక నుంచి పదిరోజులకు ఒకసారి హుజురాబాద్ వస్తా. కార్యకర్తలు మరుగుజ్జులు కాదు.. కుంగిపోవద్దు. రోశయ్య ,కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ లాంటి వాళ్ళతోనే కొట్లాడిన. సముద్రంలో తుపాను వచ్చే ముందు సైలెంట్గా ఉంటుంది. నాలాంటి వాళ్ళు మాట్లాడితే సమాజం రియాక్ట్ అవుతుంది. నేను ప్రజల నుంచి వచ్చిన వాడ్ని. ప్రజలే నాకు న్యాయ నిర్ణేతలు’’ అని ఈటల వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్లపై బీజేపీ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. -
బాబు, రేవంత్ దాగుడు మూతలు!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డి గురుశిష్యులని ప్రతీతి. అప్పుడప్పుడూ ఈ ప్రచారాన్ని రేవంత్ తోసిపుచ్చుతున్నట్లు కనిపించినా.. కొన్ని సందర్భాల్లో అది నిజమే అన్నట్టుగానూ ఉంటుంది. విభజన సమస్యలు, ఆస్తుల పంపిణీ, విద్యుత్తు బకాయిల వంటి ముఖ్యమైన అంశాలపై కాకుండా.. బనకచర్ల ప్రాజెక్టు ఏదో పెద్ద విపత్తు అయినట్లు ఇరువురూ ఢిల్లీలో సమావేశం కావడం ఈ విషయాన్ని రూఢి చేస్తోంది. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగిన తీరు, ఆ తరువాత వచ్చిన వార్తలు, నేతలు చేసిన వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే.. రేవంత్ ఏదో మొహమాటానికి ఢిల్లీ వెళితే.. శిష్యుడిని మేనేజ్ చేద్దామనుకున్న చంద్రబాబు భంగపడ్డట్టుగా కనిపిస్తుంది. ఈ సమావేశంలో బనకచర్ల ప్రస్తావనే రాలేదని రేవంత్ రెడ్డి ఒకటికి రెండుసార్లు స్పష్టం చేసినా చంద్రబాబు దీనికి బదులేదీ ఇచ్చినట్టు లేదు. పైగా.. ఏదో కమిటికి ఈ వ్యవహారాన్ని అప్పగించినట్లు చంద్రబాబు తన కేబినెట్ మంత్రి రామానాయుడితో చెప్పించడం రేవంత్ను ఇబ్బందిపెట్టే విషయం అయిపోయింది. బదులుగా రేవంత్ మరోసారి తన వాదన వినిపించి ఆత్మరక్షణలో పడితే.. చంద్రబాబు ఢిల్లీ నుంచి నేరుగా రాయలసీమలో ఒక నీటి విడుదల కార్యక్రమానికి వెళ్లి కూడా బనకచర్ల ప్రస్తావన చేయకపోవడం ద్వారా డిఫెన్స్లో పడినట్లు విశ్లేషించుకోవాలి. తద్వారా చంద్రబాబు బనకచర్ల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించే ఆస్కారం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుల గురించి చంద్రబాబు కొన్ని నెలలుగా విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ రాజకీయ పక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోటాపోటీ విమర్శలు చేసుకున్నాయి. నిజానికి బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ చాలా కష్టమని అంతా భావిస్తున్నారు. అందులోను పోలవరం ప్రాజెక్టు ఎత్తును 150 అడుగుల నుంచి 135 అడుగులకు తగ్గించడానికి చంద్రబాబు సర్కార్ అంగీకరించిందన్న వార్తల నేపథ్యంలో ఆ సందేహం మరింతగా బలపడుతోంది. దీనివల్ల ఏపీకి తీరని నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశం నుంచి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా బనకచర్ల డ్రామాకు తెరతీయగా, రేవంత్ పరోక్షంగా సహకరించారన్న విమర్శలు వస్తున్నాయి. సీఎంల భేటీలో బనకచర్ల ప్రాజెక్టు అజెండాపై తాము అంగీకరించడం లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. అనుమతే లేని ప్రాజెక్టుపై చర్చ అసమంజసమని కూడా అభిప్రాయపడింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. దీంతో బనకచర్ల అజెండాలో ఉంటే రేవంత్ వెళతారా? లేదా? అన్న ప్రశ్న వచ్చింది. ఒకవేళ వెళ్లినా బనచర్ల అజెండా అయితే రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి బృందం బాయ్ కాట్ చేస్తుందని కూడా లీక్ ఇచ్చారు. ఎలాగైతేనేం కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్ సమక్షంలో ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల సీఎంలు పరస్పరం సత్కరించుకున్నారు. కేంద్ర మంత్రిని సన్మానించారు. బాగానే ఉంది. కాని బయటకు వచ్చి సమావేశం వివరాలను చెప్పిన తీరు మాత్రం ఆశ్చర్యం కలిగించింది. రేవంత్ రెడ్డి బనకచర్ల ప్రస్తావన రాలేదని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టును చేపడతామని ఏపీ చెబితే కదా.. తాము ఆపాలని చెప్పాల్సింది అని ఆయన అన్నారు. పైగా ఇదసలు అనధికార సమావేశమని అనడం ఆసక్తికరంగా ఉంది. కేంద్రం ఇలా అనధికార సమావేశాలు పెడుతుందా? కేంద్ర మంత్రి అంత పని లేకుండా ఉంటారా? ఈ మాత్రం దానికి హైదరాబాద్లోనో, అమరావతిలోనో భేటీ జరుపుకున్నా సరిపోతుంది కదా? అన్న వ్యాఖ్యలు వచ్చాయి. అయితే రెండు రాష్ట్రాల నీటి సమస్యలపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. సీఎంలు పరిష్కరించుకోలేని సమస్యలను అధికారులు తీర్చగలుగుతారా! అనే సందేహం వస్తుంది. అది వేరే విషయం. రేవంత్ వ్యాఖ్యలకు భిన్నంగా ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు చెప్పారు. బనకచర్లకు సంబంధించి సాంకేతిక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకుని కమిటీ వేయాలని నిర్ణయించినట్లు అన్నారు. అది నిజమా? కాదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రేవంత్ చెప్పినదాని ప్రకారం అసలు బనకచర్ల ప్రస్తావనే రాలేదు. కేంద్ర జల్ శక్తి శాఖ పీఐబీ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో కూడా బనకచర్ల గురించి ఏమీ తెలపలేదు. దాంతో చంద్రబాబు బృందం ఇన్నాళ్లు చేసిన హడావుడంతా ఒట్టిదేనా అన్న విమర్శలు వస్తున్నాయి. అదే టైమ్లో రేవంత్ చెప్పిన దానిలో ఎంతవరకు వాస్తవం ఉందన్న ప్రశ్నను బీఆర్ఎస్ వేస్తోంది. సీఎంల భేటీ అజెండాలో బనకచర్ల అంశం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. అటువంటప్పుడు అజెండాలోని అంశంపై ఎవరూ మాట్లాడలేదా?, తెలుగుదేశం మీడియా ఏపీ ఎడిషన్లలో చంద్రబాబు బనకచర్ల గురించి మాట్లాడారని, తెలంగాణ ఎడిషన్లలో ఆ ఊసే లేదన్నట్లుగా కథనాలు వచ్చాయి. ఒకవేళ చర్చ జరిగి ఉంటే, రేవంత్ తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించినట్లవుతుంది. మాట్లాడకుండా ఉండి ఉంటే చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేసినట్లు అవుతుంది. మరి వీరిద్దరిలో ఎవరు నిజం చెప్పినట్లు? రేవంత్ ప్రకటనపై చంద్రబాబు వివరణ ఇవ్వాలి. అలాగే ఏపీ మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ స్పందించాలి. రేవంత్ రెండో రోజు కూడా దీనిపై కొంత స్పష్టత ఇచ్చినా, చంద్రబాబు నోరు మెదపలేదు. తనకు అనుకూలంగా ఉంటే చంద్రబాబు ఈపాటికి ప్రచారంతో హోరెత్తించే వారు. కాని ఆయన అలా చేయకపోవడం, రాయలసీమ టూర్లో కూడా ప్రస్తావించకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. ఏపీలో టీడీపీ ప్రభుత్వానికి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య మాచ్ ఫిక్సింగ్ ఉందన్న అభిప్రాయం వ్యాప్తిలో ఉంది. దానికి ఇప్పుడు బీజేపీ కూడా తోడైనట్లు అనిపిస్తుంది. కేంద్రమైనా వాస్తవం ఏమిటో వెల్లడిస్తుందా? లేదా? రేవంత్, నిమ్మలతోపాటు కేంద్రం కూడా ఒకే తరహా ప్రకటన చేసి ఉంటే ఈ గందరగోళానికి అవకాశం ఉండేది కాదు. అలా కాకుండా ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు స్టేట్మెంట్లు ఇవ్వడంతో వారికే తలనొప్పిగా మారిందని చెప్పాలి. ఇక ఇద్దరు సీఎంలు కూర్చుని అంగీకరించినట్లు చెబుతున్న టెలిమెట్రీ ఏర్పాటు, హైదరాబాద్లో గోదావరి బోర్డు, విజయవాడలో కృష్ణా బోర్డు ఉండాలన్న నిర్ణయం, శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులకు ఏపీ అంగీకారం వంటివే ప్రధాన చర్చాంశాలై ఉంటే మాత్రం ఇది కాలక్షేపపు సమావేశమే అవుతుందని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే అవి ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నవే. కాగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్లు ఉండాలని, కాని చంద్రబాబు ప్రభుత్వం 41.15 మీటర్లకు తగ్గించేందుకు అంగీకరించిందని అంటున్నారు. ఈ నీటి మట్టానికి పరిమితమైతే బనకచర్ల ప్రాజెక్టుకు నీరు ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. దీనికి కూడా చంద్రబాబు ప్రభుత్వం జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. కాని అన్నిటికి దబాయించడమే పద్దతిగా పెట్టుకున్న చంద్రబాబు టీమ్ వీటిపై ఎంతవరకు వాస్తవాలు వెల్లడిస్తుందన్నది సందేహమే. ఏతావాతా చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను పణంగా పెట్టి మళ్లీ రెండు కళ్ల సిద్దాంతం ఆలపించినట్లు టీడీపీ మీడియాలో రాయించుకున్నారా? అన్న భావన కలుగుతోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సీఎం రేవంత్కు బిగ్ షాక్.. రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతకుముందు పాలమూరు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘2034 వరకు ఇంకో పదేళ్ల పాటు పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉంటారు. పదేళ్లుగా పెండింగ్లో ఉన్న పాలమూరు, కల్వకుర్తి, బీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత నేను తీసుకుంటా. డిసెంబర్ 9 కల్లా అన్ని ప్రాజెక్టుల భూసేకరణ పూర్తిచేసి, నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఎవర్ని వదిలిపెట్టం.. కేటీఆర్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన కొట్లాటలో గాయపడిన 141వ డివిజన్ (గౌతమ్ నగర్) కార్పొరేటర్ సునీత భర్త రాము యాదవ్ను కేటీఆర్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 90 సీట్లు సాధించామని.. రెండో సారి కూడా తిరుగులేని విజయం సాధించామన్నారు.హైదరాబాద్లో ఒక్క సీటు కూడా రాలేదనే కారణంతో కాంగ్రెస్ గుండాగిరి రాజ్యం తెస్తోంది. మా ఎమ్మెల్యే, మా కార్పొరేటర్లు దేవుడి కార్యక్రమానికి చెక్కులు ఇచ్చే కార్యక్రమంలో గొడవ చేస్తారా? మీ అడ్డా అని వీర్రవీగుతున్నారా?. అధికారంలోకి వచ్చాక ఎవర్ని వదిలి పెట్టం’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు. గుండాల్లాగా రాజకీయం చేస్తూ బస్తీ మే సవాల్ అంటూ సవాల్ చేస్తున్నారు’’ అని కేటీఆర్ మండిపడ్డారు.మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి సిద్ధిపేటలో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెడతామని బెదిరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. పోలీసులు కొంత మందికి తొత్తులుగా మారారు. మేము మిమ్మల్ని వదలం. మా కార్యకర్తలు తరలి వచ్చి మీ అంతు చూస్తాం. మా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రాలేదని ఇష్టానుసారంగా చేస్తున్నారు. మేము ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్లు చేయటం లేదు’’ అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పాలమూరు అంటే కేసీఆర్కు చిన్నచూపు: సీఎం రేవంత్
సాక్షి, నాగర్ కర్నూల్: కృష్ణా జలాలు పొలాల్లో పారుతుంటే ఎందుకంత విషం చిమ్ముతున్నారంటూ రేవంత్రెడ్డి మండిపడ్డారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పాలమూరుకు ఎందుకు న్యాయం చేయలేదంటూ ప్రశ్నించారు. పాలమూరులో ప్రాజెక్టులకు డిసెంబర్లో భూములు సేకరిస్తాం. రెండేళ్లలో ప్రాజెక్ట్లు పూర్తి చేసి చూపిస్తాం’’ అని రేవంత్ అన్నారు.సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలం జటప్రోల్లో రూ.150 కోట్లతో 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామంలోని పురాతన మదనగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన, ఆ తర్వాత భారీ బహిరంగ సభ ప్రసంగించారు. సభలో ఇందిరా మహిళాశక్తి కింద స్వయం సహాయక బృందాల మహిళలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘రెండేళ్లు కాలేదు అప్పుడే దిగిపో.. దిగిపో అంటున్నారు. పాలమూరు అంటే కేసీఆర్ కుటుంబానికి చిన్నచూపు. కరీంనగర్ నుంచి పారిపోయిన కేసీఆర్ ఆదరిస్తే సున్నం పెట్టారు. వాల్మికీలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామన్న కేసీఆర్ ఎందుకు చేయలేదు?. చెప్పులు కుట్టమని, గొర్రెలు పెంచమని చేపలు పట్టమని చెప్పారు. ఆయన బిడ్డలే రాజ్యాలు ఏలాలా? పాలమూరు బిడ్డలకు పదవులు వద్దా?. మాదిగ కులాల వర్గీకరణ చేసినందుకు కేసీఆర్కు కడుపుమంటగా ఉంది. 25 వేల కోట్లు ఖర్చు పెడితే పాలమూరు ప్రాజెక్ట్లు పూర్తయ్యేవి. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయ్యింది’’ అంటూ రేవంత్ విమర్శలు గుప్పించారు. -
సీఎం రేవంత్పై కేటీఆర్ సంచలన ఆరోపణలు
సాక్షి,ఖమ్మం: సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ‘నీ సీఎం సీటుకు ఎసరు పెడతారని ఉత్తమ్,పొంగులేటి,భట్టి ఫోన్లు ట్యాప్ చేయడం లేదా?.దమ్ముంటే దీనికి రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం పర్యటనలో భాగంగా శుక్రవారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్.. రేవంత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం రేవంత్రెడ్డికి సరిగా కేసులు కూడా పెట్టడం రాదు. మాపై దొంగ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం,ఫోన్ ట్యాపింగ్,కారు రేసింగ్ అని తప్పులు పెడుతున్నారు. లీకులు తప్ప ఆయన పెద్దగా చేసేదేమీ లేదు. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్ ఏం అభివృద్ధి చేశారు? 18 నెలల పాలనలో రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేశారు. ఎప్పుడైనా,ఎక్కడికైనా చర్చకు సిద్ధం. కేసీఆర్ సీతారామ ప్రాజెక్ట్ కడితే రేవంత్ రిబ్బన్ కట్చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పొంగులేటికి కాంట్రాక్ట్లు వచ్చాయి.2014లో ఖమ్మం ఎలా ఉండేది. మా పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో మీకు తెలియదా?. ఖమ్మంను అభివృద్ధి చేసింది కేసీఆర్ కాదా? సీఎం రేవంత్ సీటుకు భట్టి విక్రమార్క,కోమటిరెడ్డి ఎసరుపెడుతున్నారు.అందుకే వారి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు. దీనికి సీఎం రేవంత్ సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపారు. -
రేవంత్వి చెత్త వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బనకచర్ల విషయంలో ఢిల్లీ సమావేశంలో తన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసిన సీఎం రేవంత్రెడ్డి, తన చీకటి బాగోతాన్ని కప్పి పుచ్చుకునేందుకు కేటీఆర్పై చెత్త వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి పక్కన ఉన్న వారంతా గార్బేజ్ (చెత్త) బ్యాచేనని, కాలుష్యం అధికంగా ఉండే ఢిల్లీలో రేవంత్రెడ్డి చెత్త వ్యాఖ్యలతో అది మరింత పెరిగిందని ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. బనకచర్లపై అబద్ధాలు చెబుతున్నారు.. ‘బనకచర్ల ప్రాజెక్టు ఢిల్లీ భేటీ ఎజెండాలో ఉందని ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు చెపుతుంటే, రేవంత్రెడ్డి అసలు చర్చకే రాలేదని అంటున్నారు. కేంద్ర జలశక్తి నిర్వహించిన సమావేశంలో బనకచర్లపై చర్చ జరిగినట్లు ఏపీలోని అన్ని పేపర్లలో వచి్చంది. లైయింగ్ సిండ్రోమ్ అనే వ్యాధితో రేవంత్రెడ్డి బాధ పడుతున్నాడు. అందుకే అబద్ధాలు చెపుతున్నాడు. కేటీఆర్ మీలా బ్యాగ్లు మోయలేదు.. మేము బనకచర్ల గురించి మాట్లాడుతుంటే ఆయన డ్రగ్స్, గంజాయి అంటూ మోకాళ్లకు, బోడి గుండుకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్రెడ్డిలా కేటీఆర్ బ్యాగ్లు మోయలేదు. ఆయన చుట్టూ ఉన్నవారు కూడా బ్యాగులు మోసేవారే. పరిపాలన అంటే బ్యాగ్లు మోసుడు కాదని రేవంత్రెడ్డి గుర్తుంచుకోవాలి. కేటీఆర్ను లోకేశ్ అర్ధరాత్రి పూట కలిశాడని అంటున్నాడు. రాష్ట్రంలో అర్ధరాత్రి పూట గోడలు దూకే అలవాటు రేవంత్రెడ్డికే ఉంది. ఎవడో దుబాయ్లో చనిపోతే కేటీఆర్కు ఏం సంబంధం? కేటీఆర్పై చేసిన ఆరోపణలకు రుజువులు ఉంటే చూపించాలి. లేదంటే కేటీఆర్కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి..’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. శాంతిభద్రతలు పూర్తిగా విఫలం ‘కాంగ్రెస్ పార్టీ పాలనలో మలేరియా, డెంగ్యూ వంటి రోగాలతో గురుకుల పాఠశాలల విద్యార్థులు ఆస్పత్రుల్లో ఉంటున్నారు. మరోవైపు గ్రామాల్లో పాలన పడకేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఇంటిపై, నా క్యాంపు కార్యాలయంపై, పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై, సునీత లక్ష్మారెడ్డిపై, మర్రి రాజశేఖర్రెడ్డిపై దాడికి దిగుతున్నారు..’అని మాజీమంత్రి చెప్పారు. మా ఫోన్లతో పాటు విలేకరులవీ ట్యాప్ చేస్తున్నారు.. ‘రేవంత్రెడ్డికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి అండగా ఉంటున్నాడు కాబట్టే ఈడీ ఆయన్ను అరెస్టు చేయడం లేదు. మాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థతో నిఘా పెట్టినా మాకేం కాదు. రేవంత్రెడ్డి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నాడు. విలేకరుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి..’అని హరీశ్రావు ఆరోపించారు. -
చంద్రబాబు స్క్రిప్టు.. రేవంత్ చిలక పలుకు
సిరిసిల్ల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తొత్తుగా మారారని, తెలంగాణ ప్రయోజనాలను గురుదక్షిణగా తాకట్టు పెట్టేందుకు చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు విమర్శించారు. ఇక్కడ మాట్లాడుతున్న చిలుక రేవంత్రెడ్డి అయితే పలుకులు మాత్రం చంద్రబాబువని మండిపడ్డారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.ఆరు దశాబ్దాలుగా జరిగిన జలదోపిడీ ఒక ఎత్తయితే సీఎం రేవంత్రెడ్డి కోవర్టుగా మారి ఢిల్లీలో బుధవారం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఒక ఎత్తు అని ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టు గురించి చర్చ పెడితే సమావేశానికే వెళ్లను అని చెప్పిన రేవంత్రెడ్డి.. ఎలా మీటింగ్కు పోయారని ప్రశ్నించారు. అసలు ఆదిత్యనాథ్ను సాగునీటి సలహాదారుగా పెట్టుకోవడమే పెద్ద తప్పు అన్నారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని అడ్డుకున్నదే చంద్రబాబు నాయుడు అని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రైతుల హక్కులను కాపాడడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారని స్పష్టం చేశారు. బనకచర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే మరోసారి ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుందని హెచ్చరించారు. చంద్రబాబు కనుసన్నల్లో కేంద్రం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తోందని, తెలంగాణ జలవనరులను దోపిడీ చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే బనకచర్ల ప్రాజెక్టు కట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డికి తెలిసిందల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారమేనని ఎద్దేవా చేశారు. రాయలసీమ, ఆంధ్రా కూడా బాగుండాలని.. అదే సమయంలో తెలంగాణ నీటి వాటా తేలాలని కేసీఆర్ కోరుకున్నట్లు చెప్పారు. తమకు ఆంధ్రా ప్రజలతో గొడవ లేదని స్పష్టంచేశారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని. కన్నెపల్లిలో మోటార్లను ఆన్ చేస్తే తెలంగాణలో కరువు ఛాయలు ఉండవని అన్నారు. డ్రగ్స్ కేసులో ఆధారాలు చూపాలి సీఎం రేవంత్రెడ్డి మీడియా చిట్చాట్ పేరుతో తనపై విషం చిమ్ముతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కార్యాలయానికి గౌరవం ఇచ్చి ఇప్పటి వరకు సంయమనం పాటించానని, ఇకపై ఊరుకోబోనని స్పష్టంచేశారు. డ్రగ్స్ కేసులో తనపై విచారణ జరుగుతుందని రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆధారం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘హైదరాబాద్లో నాతో ముఖాముఖి చర్చకు వచ్చే దమ్ము లేక ఢిల్లీకి వెళ్లి మరీ రేవంత్రెడ్డి నాపై బురద జల్లుతున్నారు. న్యాయస్థానాల పరిధి నుంచి తప్పించుకోవడానికే చిట్చాట్ల పేరుతో దొంగచాటు మాటలు మాట్లాడుతున్నారు. పిరికి దద్దమ్మలా చిట్చాట్ల పేరుతో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఇకపై వీటిని సహించేది లేదు. సీఎం చేసిన నిరాధార ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి. డిమాండ్ చేశారు. లేదంటే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’అని హెచ్చరించారు. -
విలన్లు క్లైమాక్స్లోనే అరెస్ట్ అవుతారు: సీఎం రేవంత్
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి కాకుండా ఫామ్ హౌస్కు రావాలా? అంటూ రేవంత్ చమత్కరించారు. బనకచర్ల చర్చ జరిగిందో లేదో కేంద్రమే చెప్పిందని ఒక ప్రశ్నక సమాధానంగా చెప్పారు సీఎం రేవంత్. ‘ ‘కేసీఆర్ సభకు రావాలి. గత ప్రభుత్వం అవినీతిపై విచారణ జరుగుతోంది. కేటీఆర్ డ్రగ్స్ కేసులోనూ విచారణ కొనసాగుతోంది. శాఖాపరమైన విచారణ రాత్రికి రాత్రే పూర్తి కాదు. విలన్లు క్లైమాక్స్లోనే అరెస్ట్ అవుతారు’ అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. ‘కేటీఆర్ను కాపాడాలని కిషన్రెడ్డి చూస్తున్నారు. అందుకే కాళేశ్వరం, ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వాలనుకుంటున్నాం. బీసీ రిజర్వేషన్లపై మా వ్యూహం మాకుంది. సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు జరుపుతాం. రెండేళ్ల తర్వాత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం’ అని రేవంత్ తెలిపారు.చంద్రబాబు తొత్తు రేవంత్: కేటీఆర్సిరిసిట్ల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని అడ్డుకుందే చంద్రబాబని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ హక్కులను కాపాడటానికి కేసీఆర్ ఉన్నారని, బనకచర్లపై కాంగ్రెస్ స్టాండ్ మార్చకోకపోతే మరొకసారి ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోందన్నారు. చిలుక రేవంత్ అయతే పలుకులు చంద్రబాబువి అని కేటీఆర్ సెటైర్లు వేశారు. ఏ బేసిన్లో ఏ ప్రాజెక్టు ఉందో సీఎం రేవంత్కు తెలియదని, ఆయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ మాత్రమేనని కేటీఆర్ విమర్శించారు. -
సీఎం రేవంత్కు కిషన్రెడ్డి లేఖ.. ఏమన్నారంటే?
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రతిపాదించిన పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వ సహకారం కోరుతూ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (CPSUలు), ముఖ్యంగా కోల్ ఇండియా లిమిటెడ్ (CIL), నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (NLCIL).. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుని, సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు (PSP), బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) వంటి కీలకమైన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని కిషన్రెడ్డి లేఖలో తెలిపారు. ఈ ప్రాజెక్టులు వచ్చే మూడేళ్లలో దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్శించనున్నాయి.లేఖలో కీలక ప్రతిపాదనలు:తెలంగాణలోని అధిక సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం గల జోన్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను అభివృద్ధి చేయడం.గ్రిడ్ స్టెబిలిటీ, ఎనర్జీ రిలయబిలిటీలను మరింత పెంచేలా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)ను అభివృద్ధి చేయడం.క్రిటికల్ బ్యాలెన్సింగ్ కెపాసిటీని అందించేందుకు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల అధ్యయనం, అమలు.ప్రాజెక్టు అమలును వేగవంతం చేయడానికి, స్థానిక ఆర్థిక ప్రయోజనాలను పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో లేదా బొగ్గు కంపెనీలు స్వతంత్ర ప్రాతిపదికన జాయింట్ వెంచర్ మోడల్స్ ఏర్పాటు చేయడం.ఈ ప్రతిపాదనలు, ప్రాజెక్టులకు భూసేకరణ, భూకేటాయింపు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు అవసరం.ఈ ప్రాజెక్టులు కర్బన ఉద్గారాలను తగ్గించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం, సహజ వనరుల నిర్వహణ తదితర విషయాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. వీటి ద్వారా ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, ఇంధన భద్రతతోపాటుగా, అవసరమైనంత మేర విద్యుత్ ను అందుబాటులోకి తీసుకురావడం, సమ్మిళిత అభివృద్ధి, జీవన ప్రమాణాలను పెంచడం వంటి సామాజిక-ఆర్థిక ప్రయోజనాలు కూడా లభించనున్నాయి. ఈ ప్రాజెక్టులు విజయవంతంగా అమలుకావడానికి రాష్ట్ర ప్రభుత్వం, CPSUల మధ్య నిర్మాణాత్మక భాగస్వామ్యం, సరైన సమన్వయం అత్యంత అవసరం. ఇందుకోసం మీరు ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని కోరుతున్నాను. మీ జోక్యంతోనే ఈ ప్రాజెక్టులు వేగంగా, సమర్థవంతంగా అమలు అవుతాయని విశ్వసిస్తున్నాను.పునరుత్పాదక విద్యుదుత్పత్తిలో తెలంగాణ సామర్థ్యాన్ని గుర్తిస్తూ.. రాష్ట్రంలో హరితాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణమైన చిత్తశుద్ధితో సహకారం అందిస్తోంది. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. భారతదేశ సుస్థిర విద్యుత్ వ్యవస్థలో తెలంగాణ పాత్ర కీలకం కానున్న సందర్భంలో.. ఈ ప్రాజెక్టుల ప్రాధాన్యత మరింత పెరగనుంది. తెలంగాణకు ఉన్న పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యం, హరితాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను దృష్టిలో ఉంచుకుని.. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మరో మెట్టు ముందుకు తీసుకెళ్తాయి. దీంతోపాటుగా భారతదేశం సుస్థిర ఇంధన పరివర్తన దిశగా చేస్తున్న కృషిలో తెలంగాణ కీలక పాత్ర పోషించడానికి ఇదొక చక్కటి అవకాశం. భారతదేశపు దీర్ఘకాల ప్రణాళికలైన ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణను సాకారం చేసుకోవడంలో భాగంగా ఆర్థిక పురోగతిని, అభివృద్ధి అవకాశాలను సమతుల్యం చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యంత కీలకం.పర్యావరణ పరిరక్షణతో పాటుగా ఆత్మ నిర్భరతతో కూడిన భవిష్యత్ను ఏర్పరచుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిర్మాణాత్మక సహకారంలో మీ చొరవ కీలకం. తెలంగాణలో రానున్న ఈ సానుకూల మార్పుకు మీ సహకారాన్ని కోరుతూ.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, మా శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలనుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. -
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ సెలైన్స్పై కవిత కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశమై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సరైనదే అని కవిత చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కూడా కవిత ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఎమ్మెల్సీ కవిత తాజాగా మీడియా చిట్ చాట్లో మాట్లాడుతూ..‘బీసీ రిజర్వేషన్పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే. బీఆర్ఎస్ నాయకులు ఆర్డినెన్స్ వద్దని చెప్పడం సరికాదు. బీఆర్ఎస్ వాళ్ళు నా దారికి రావాల్సిందే. నాలుగు రోజులు టైం తీసుకుంటారేమో అంతే. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే. నేను న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్కు సపోర్ట్ చేశాను. అలాగే, తీన్మార్ మల్లన్న నాపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఒక ఎమ్మెల్సీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనను నేను జనాభా లెక్కల నుంచి తీసివేశాను అన్నారు. ఆయన ఎవరో నాకు తెలియదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమీషన్ల కోసమే బనకచర్ల..అనంతరం, బనకచర్లపై చర్చకు తాను వెళ్లనని సీఎం రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. నిన్నటి డిల్లీ సమావేశంలో ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల. ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ సిగ్గులేకుండా గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారు. బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడు. తెలంగాణ హక్కులను కాలరాసిన నాన్ సీరియస్ ముఖ్యమంత్రి తన పదవి రాజీనామా చేయాలి. బనకచర్ల వల్ల ఆంధ్రా ప్రజలకు ఏం లాభం లేదు. కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం బనకచర్ల కడుతున్నారు. ముఖ్యమంత్రి మెగా కంపెనీ వాటా కోసమే డిల్లీకి వెళ్లారు. చంద్రబాబు ఎజెండాలో భాగంగానే సీఎం డిల్లీకి వెళ్ళాడు. బనకచర్ల ఆపకపోతే న్యాయపోరాటం చేస్తాం.సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబును ఎదుర్కొని సన్మానం చేశారు. సిగ్గులేకుండా బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబుకు అప్పనంగా అప్పగించారు. రేవంత్ రెడ్డి బనకచర్లపై బుకాయిస్తున్నారు. ఆయనకు పాలించే హక్కు లేదు. తక్షణమే సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. నాలుగు విజయాలు సాధించామని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు. కృష్ణానది బోర్డును అమరావతిలో పెట్టడం అనేది ఏపీ విభజన చట్టంలో ఉంది. తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారు.బాబుకు బహుమతిగా గోదావరి నీళ్లు..పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలి. తన స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్లో అని సీఎం చెప్తుంటారు. ముఖ్యమంత్రి ఇంకా కాలేజీలోనే ఉన్నానని అనుకుంటున్నారు. అందుకే గోదావరి నీళ్లను చంద్రబాబుకు గిఫ్టుగా ఇచ్చారు. తుపాకులగూడెం నుంచి నదుల అనుసంధానం జరిగితే తెలంగాణ, ఆంధ్రాకు న్యాయం జరుగుతుంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బనకచర్లపై అసలు చర్చ జరగలేదు. కొప్పుల ఈశ్వర్ స్వయంగా బొగ్గుగని కార్మికుడు.. వారికి బొగ్గుగని కార్మిక సంఘం బాధ్యతలు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నా’ అంటూ కామెంట్స్ చేశారు. -
రేవంత్ గుట్టు రట్టయ్యింది: కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్రెడ్డి 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందన్న కేటీఆర్.. ముసుగు వీడింది.. నిజం తేటతెల్లమయ్యిందన్నారు. ‘‘నిధులు రాహుల్ గాంధీకి.. నీళ్లు చంద్రబాబుకి.. బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయిస్తున్నారు. గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పజెప్పడానికేనా?. నువ్వు గద్దెనెక్కింది’’ అంటూ ఎక్స్ వేదికగా రేవంత్పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘కోవర్టులెవరో, తెలంగాణ కోసం కొట్లాడిందెవరో తేలిపోయింది. ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా పోరాటం తప్పదు. తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పని పడతాం’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు. నీ గురువుపై విశ్వాసం చూపించడానికి తెలంగాణ విధ్వంసం కావలసిందేనా?. ఇంకెందుకు రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు?. నిన్ను ఎన్నుకున్న పాపానికి…చెరిపేయి సరిహద్దులు! తెలంగాణా మీద నీ అక్కసు చల్లారుతుందేమో!’’ అంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు.ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయ్యింది! 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందినిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి, తెలంగాణా వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు….బూడిద తెలంగాణ ప్రజలకి! బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి….గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం…— KTR (@KTRBRS) July 16, 2025 -
రిజర్వేషన్లు ఎలా ఉంటాయో!?
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మరోవైపు ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి చట్టబద్ధత కల్పనకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలతో త్వరలో ఆర్డినెన్స్ సైతం తీసుకురానుంది. దీంతో ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ అవుతుంది? రిజర్వేషన్లు ఎలా ఉంటాయి? అనే అంశాలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీల సన్నాహాలతో స్థానిక సంస్థల ఎన్నికల రాజుకుంటున్న నేపథ్యంలో గతంతో పోల్చితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా ఉండవచ్చనేది చర్చనీయాంశంగా మారింది. ఆర్డినెన్స్ ఎలా ఉంటుందో..: పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం చూస్తే..అన్ని రిజర్వేషన్లు కలుపుకొని 50 శాతానికి లోబడి ఉండాలి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ప్రస్తుతం ఉన్న 22 శాతం రిజర్వేషన్లను, 42 శాతానికి పెంచి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆర్డినెన్స్ తేనుండటంతో.. అందులో పొందుపరిచే అంశాలు, బీసీ జనాభా లెక్కలు, వాటిని బట్టి మారే రిజర్వేషన్లు చర్చనీయాంశమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వారి జనాభా ప్రాతిపదికన ఖరారు కానున్నందున వాటి విషయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చునని అంటున్నారు. అయితే రిజర్వేషన్లు మొత్తంగా మారిపోయే అవకాశం ఉందని, కాబట్టి ఎస్సీ,ఎస్టీ స్థానాలు కూడా కొంత మేరకు ప్రభావితం కావచ్చునని చెబుతున్నారు. వార్డు స్థానాలు మొదలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ అధ్యక్షులు, జడ్పీ చైర్పర్సన్ స్థానాల వరకు రిజర్వేషన్లలో మార్పులు జరిగే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు.. గతంలో ఉన్న రిజర్వేషన్లు రెండు పదవీ కాలాల (టర్మ్లు) సమయం కొనసాగాయి. ఇప్పుడు ఒకే టర్మ్కు రిజర్వేషన్లు పరిమితం కానున్నాయి. అంటే ఈసారి నిర్ణయించే రిజర్వేషన్లు ఒక టర్మ్ మాత్రమే ఉంటాయన్న మాట. ఈ కారణంగానూ రిజర్వేషన్ స్థానాల్లో అనేక మార్పులు చోటు చేసుకోవచ్చునని అంటున్నారు. తాజా జనాభా లెక్కలతోనూ ప్రభావితం! గతంలో మాదిరిగానే సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు మండల ప్రతిపాదికన, జెడ్పీటీసీ స్థానాలు జిల్లా యూనిట్గా..ఎంపీపీ అధ్యక్షుడు జిల్లా యూనిట్గా, జెడ్పీపీ చైర్మన్ రాష్ట్ర యూనిట్గా రిజర్వేషన్లు ఉంటాయా లేదా అనేది కూడా రాజకీయ పార్టీల నేతలు, ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠకు కారణమౌతోంది. అయితే ప్రభుత్వం జారీచేసే ఆర్డినెన్స్కు అనుగుణంగా ఆయా రిజర్వేషన్లు మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు తాజా జనాభా లెక్కల్లో (కుల గణన)వచ్చిన మార్పులను బట్టి రిజర్వేషన్లు కూడా మారిపోతాయని భావిస్తున్నారు. స్థానాల సంఖ్యపై స్పష్టత! రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, వార్డుల సంఖ్యతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సంఖ్యపై స్పష్టత వచ్చినట్టు సమాచారం. గ్రామ పంచాయతీలు 12,782గా, గ్రామాల వార్డులు 1,12,712, ఎంపీటీసీ స్థానాలు 5,816, జెడ్పీటీసీ స్థానాలు 566, మండల ప్రజా పరిషత్లు 566, జిల్లా పరిషత్లు 31గా లెక్క తేలినట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖాపరంగా ఈ లెక్క తేల్చినట్లు అధికారవర్గాల భోగట్టా. 2019లో జరిగిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఒక జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీపీ)–(మేడ్చల్ జిల్లా పరిషత్ రద్దు) స్థానం తగ్గగా అనేక గ్రామాలు, మండలాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 55 నుంచి 60 స్థానాల వరకు తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త మండలాలు, గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగింది. తగ్గిన ఎంపీటీసీలు, పెరిగిన మండలాలు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని అనేక గ్రామాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో మేడ్చల్ జిల్లా ప్రజా పరిషత్ (గ్రామీణ జిల్లా) ఉనికిలో లేకుండా పోతోంది. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం, కార్పొరేషన్లలో ఆయా గ్రామాలు విలీనం కావడం వల్ల ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గనున్నట్టు తెలుస్తోంది. 2019లో ఎంపీటీసీ స్థానాలు 5,847 ఉండగా, ప్రస్తుతానికి ఆ సంఖ్య 5,800 వరకు తగ్గవచ్చని అంచనా. రాష్ట్రంలో మండలాల సంఖ్య 539 నుంచి 566కు పెరిగింది. గత ఎన్నికల్లో 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 12,782కు పెరిగింది. వీటిపై రాష్ట్రవ్యాప్తంగా 10–11 తేదీలలో అభ్యంతరాలను స్వీకరించి 12న తుది జాబితా ప్రకటించాల్సి ఉండగా, క్షేత్రస్థాయి నుంచి సకాలంలో పూర్తి సమాచారం అందకపోవడంతో వాటి ప్రకటనలో జాప్యం జరిగింది. సోమవారం నాటికి కూడా కొన్నిచోట్ల నుంచి వివరాలు రాకపోవడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లపై కచి్చతమైన సంఖ్యను అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. 2019 ఎన్నికల నాటికి మండల ప్రజా పరిషత్లు 539 ఉండగా, 2025 ఎన్నికల నాటికి 566కు పెరగనున్నాయి. గతంలో గ్రామ పంచాయతీలు 12,769 ఉండగా, ఇప్పుడు 12,782కు చేరుకున్నట్టు అధికారవర్గాల సమాచారం. -
హెచ్సీఏ కంటే జూబ్లీహిల్స్ బైఎలక్షనే నాకు ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్లో చోటు చేసుకున్న పరిణామాలపై టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ స్పందించారు. హెచ్సీఏ అవినీతి సర్వసాధారణం అయ్యిందన్న ఆయన.. తాను ఆ విషయాన్ని పట్టించుకునే స్థితిలో లేనని అన్నారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ..‘‘రూల్స్ పాటించకపోతే ఇలాంటి కష్టాలే వస్తాయ్. హెచ్సీఏలో చాలా సమస్యలున్నాయ్. అసోషియేషన్ అనేది ఎప్పుడూ స్వలాభంతో నడవకూడదు. ఫోర్జరీ చేసినందుకే ప్రస్తుత ప్రెసిడెంట్ అరెస్ట్ అయ్యాడు. కాబట్టి, ఇప్పటివరకు జరిగిన అవకతవకలు బయటకి తీయాలి. హెచ్సీఏలో జరుగుతున్న పరిణామాలపై బీసీసీఐ ఫోకస్ పెట్టాలి. హెచ్సీఏ సభ్యులు, కోచ్ల పిల్లలనే క్రికెట్ ఆడిస్తున్నారు. సెలక్టర్లలో కూడా అవినీతి ఉంది. మొత్తంగా అవినీతి అనేది కామన్గా మారింది. పార్టీ ఆదేశిస్తే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేస్తా. జూబ్లీహిల్స్ రేసులో నేను కూడా ఉన్నాను. హెచ్సీఏ కంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లో పోటీ చేయడమే నా ముఖ్య లక్ష్యం’’ అని అజారుద్దీన్ కుండబద్ధలు కొట్టారు. -
స్థానిక సంస్థల ఎన్నికలపై దూకుడు పెంచిన బీజేపీ
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ దూకుడ పెంచింది. ఈ మేరకు ఘట్కేసర్ సమీపంలోని పీపీఆర్ కన్వెన్షన్లో వర్క్ షాపు నిర్వహించింది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన రాంచందర్ రావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వర్క్షాపుకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పదాధికారులు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచేలా వ్యూహ రచన చేస్తున్నారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ముగ్గురు ప్రధాన కార్యదర్శలతో కమిటీ ప్రకటించే అవకాశం ఉంది. -
బాబు పంపిందే రేవంత్ మాట్లాడుతున్నారు: జగదీష్రెడ్డి
లేని గొప్పలు చెప్పుకోవడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందని, తన గురురు చంద్రబాబు కోసం తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి మండిపడ్డారు. తిరుమలగిరి సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ జగదీష్రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారాయన. సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణకు రేవంత్ చేసింది ఏమీ లేదు. చెప్పుకోవడానికి ఏమీ లేదు. లేని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటు. తిరుమలగిరి సభకు స్పందనే లేదు. అందుకే సీఎం ఆ సభలో బూతులు మొదలుపెట్టారు. నానాటికీ ఆయన తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు అని జగదీష్ రెడ్డి అన్నారు. ‘‘నీళ్ళ విషయంలో మరొక సారి రేవంత్ అజ్ఞానం బయటపడింది. ఏపీ సీఎం చంద్రబాబు పంపిన దానినే రేవంత్ మీడియా ముందు మాట్లాడుతున్నారు. తద్వారా తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. గురుదక్షిణ కింద కృష్ణ, గోదావరి జలాలను బాబుకు అప్పజెప్పబోతున్నారు. బనకచర్ల కోసం మేడిగడ్డను గాలికి వదిలేస్తున్నారు’’ అని రేవంత్పై జగదీష్ మండిపడ్డారు. మేడి గడ్డ బ్యారేజీ, అన్నారం , సుందిల్ల నుండి బాహుబలి పంపు హౌస్ వరకు ఎక్కడైనా చర్చకు సిద్దం’’ అని సవాల్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6,47,479 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశాం. మరి మా హయంలో రేషన్ కార్డులు పంపిణీ జరగలేదని అంటున్న రేవంత్ చెంప దెబ్బకు సిద్ధమా?. ఇప్పుడు ఎన్నికలు పెడితే నల్గొండలో 12 సీట్లకు 12 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుంది.ధాన్యం ఉత్పత్తిలో నల్గొండ జిల్లాను దేశంలోనే నంబర్ వన్గా బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిదిద్దింది. ధాన్యం ఉత్పత్తిలో 3 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 40 లక్షల మెట్రిక్ టన్నుల పెంచింది బిఆర్ఎస్ ప్రభుత్వమే. నల్గొండలో యాదాద్రి పవర్ ప్లాంట్, 3 మెడికల్ కాలేజీ లు, యాద్రాది టెంపుల్ అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగాయి కదా. మరి సీఎంగా రేవంత్ హయాంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా ప్రారంభించారా?. నల్గొండ రైతులనే అడుగుదాం.. వారి చెంప దెబ్బలకు నేను సిద్ధంగా ఉన్నా. మరి సీఎం రేవంత్, మంత్రులు అందుకు సిద్ధమేనా? అని జగదీష్రెడ్డి సవాల్ విసిరారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను జగదీష్ రెడ్డి ఖండించారు. రాజకీయాల్లో ఇలాంటి అక్కర్లేదు. ఎవరికివారే సంస్కారం నేర్చుకుంటే మంచిది. సీఎం రేవంత్ కూడా విజ్ఞతతో మాట్లాడడం నేర్చుకోవాలి అని జగదీష్రెడ్డి హితవు పలికారు.