సంక్షేమ కార్యక్రమాల ద్వారా పొందే లబ్ధిని... విశిష్ట గుర్తింపు సంఖ్య ‘ఆధార్’తో అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నానా హైరానా పడుతున్న తరుణంలో సుప్రీం కోర్టు ఆదేశాల ద్వారా ఎదురు దెబ్బ తగిలినట్లయింది.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సంక్షేమ కార్యక్రమాల ద్వారా పొందే లబ్ధిని... విశిష్ట గుర్తింపు సంఖ్య ‘ఆధార్’తో అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నానా హైరానా పడుతున్న తరుణంలో సుప్రీం కోర్టు ఆదేశాల ద్వారా ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ‘ఆధార్’ను పొందడం ఐచ్ఛికమని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు, దానికి లింకు పెట్టరాదని సుప్రీం కోర్టు సోమవారం సంచలనాత్మక ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలో ఆధార్ కార్యక్రమం సాగుతున్నప్పటికీ, సరైన సంఖ్యలో నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయనందున విఘ్నాలు ఏర్పడుతూనే వచ్చాయి. ఇటీవల దీనిపై ప్రజల్లో కూడా ఆసక్తి సన్నగిల్లింది.
ముఖ్యంగా బెంగళూరులో దీనిపై ఆసక్తి చూపే వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఈ ఏడాది ఆఖరు లోగా నేరు ప్రయోజన బదిలీ (డీబీటీ)ని అమలు చేయడానికి వీలుగా ఆధార్ కవరేజీని మరింత విస్తృతం చేయాలని చమురు కంపెనీలపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ విపరీతమైన ఒత్తిడిని తీసుకొస్తోంది. వంట గ్యాస్పై సబ్సిడీని నేరుగా కస్టమర్ బ్యాంకు ఖాతాకు జమ చేయడమే డీబీటీ. తుమకూరు, మైసూరు, ధార్వాడలలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేస్తున్నారు.
సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి తుమకూరు జిల్లాలో, అక్టోబరు ఒకటో తేదీ నుంచి మైసూరు, ధార్వాడ జిల్లాల్లో విధిగా అమలు చేయనున్నారు. వచ్చే మార్చి నుంచి మరో 19 జిల్లాల్లో దీనిని విధిగా అమలు చేయాల్సి ఉంది. దీని వల్ల వినియోగదారులు వంట గ్యాస్కు మార్కెట్ ధరను చెల్లించాలి. అనంతరం ఆధార్ లింకుతో కూడిన బ్యాంకు ఖాతాకు సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తారు. ఆధార్ సంఖ్యలు, దానితో అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాలను సమర్పించని వారికి సబ్సిడీ లభించదు.
ప్రస్తుతానికి 60 శాతం మందికి ఆధార్ సంఖ్య ఇచ్చినా, మిగిలిన 40 శాతం మందికి ఇవ్వడమే అధికారులకు పెద్ద సవాల్గా మారింది. ప్రస్తుతం రాష్ర్ట వ్యాప్తంగా 2,900 ఆధార్ నమోదు కేంద్రాలున్నాయి. బెంగళూరులో 589 కేంద్రాలున్నప్పటికీ, జనం పెద్దగా తరలి రావడం లేదు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3.54 కోట్ల మంది పేర్లను నమోదు చేసుకోగా, 2.86 కోట్ల మందికి ఆధార్ సంఖ్యను ఇచ్చారు. ఇప్పటికే మందకొడిగా సాగుతున్న ఈ కార్యక్రమం సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులతో అటకెక్కుతుందనే ఆందోళన అధికారుల్లో నెలకొంటోంది.