బస్సు దగ్ధం | The bus torched | Sakshi
Sakshi News home page

బస్సు దగ్ధం

Dec 3 2014 2:24 AM | Updated on Sep 13 2018 5:22 PM

బస్సు దగ్ధం - Sakshi

బస్సు దగ్ధం

వేగంగా వస్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీ కొంది.

బెంగళూరు కేఆర్‌పురం వద్ద ప్రమాదం
బైక్‌ను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొన్న వైనం
నలుగురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

 
కృష్ణరాజపురం : వేగంగా వస్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీ కొంది. దీంతో చెలరేగిన మంటల్లో బస్ దగ్ధమైన సంఘటన కేఆర్ పురం ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు..  ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి బెంగళూరుకు ఎస్‌వీటీ అనే ప్రైవేట్ బస్సు మంగళవారం బయలుదేరింది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో నాల్గవ జాతీయ రహదారిలోని కృష్ణరాజపురంలో ఉన్న వెంగయ్య చెరువు వద్ద వెళ్తుండగా..  ద్విచక్ర వాహనంలో ఎదురుగా వస్తున్న విద్యార్థులు తమ బైక్‌ను మలుపు తిప్పే ప్రయత్నంలో బస్‌కు ఎదురుగా వెళ్లారు. ఈ సమయంలో బస్సు ఎక్కువ వేగంగా వస్తుండటంతో  డ్రైవర్ బస్సును అదుపు చేయలేక డివైడర్‌కు ఢీకొట్టాడు. దీంతో బైక్ పైన ఉన్న యువకులు  హరీష్ (21), హరీష్ (25), మల్లికార్జున (25), కళ్యాణ్ (20) బస్ కింద పడ్డారు. వీరి బైకు వెళ్ళి డీజిల్ ట్యాంకు తగిలింది. దీంతో వెంటనే బస్సుకు మంటలు అంటున్నాయి.  ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే బస్సు దిగిపోయారు. 

ఆ బస్సులో సుమారు 50 మంది ప్రయాణీకులు ఉన్నారు. పోలీసులకు విషయం తెలియడంతో ఫైరింజన్ల సహాయంతో మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. కాగా ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకునేలోపే  బస్సు పూర్తిగా కాలిపోయింది. కాగా ఈ ప్రమాదంలో గాయపడ్డ హరీష్, హరీష్‌లకు నిమ్హాన్స్‌లో,  కళ్యాణ్‌కు కేఆర్ పురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో, మల్లికార్జునకు విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో మల్లికార్జున, హరీష్ పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. సంఘటణ స్థలాన్ని ఎమ్మెల్యే బసవరాజు, ఆర్టీఓ అధికారులు పరిశీలించారు. ప్రమాద స్థలానికి సమీపంలోనే ప్రభుత్వాస్పత్రి, ప్రవేట్ ఆస్పత్రులు ఉన్నా.. ప్రమాదం జరిగి గంట సేపైనా ఒక్క అంబులెన్‌‌స కూడా రాకపోవడంపై బాధితులు మండిపడ్డారు.  కేసు నమోదు చేసుకున్న కృష్ణరాజపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.గాయపడిన ఈ విద్యార్థులంతా కృష్ణరాజపురానికి చెందిన వారేనని పోలీసులు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement